న్యూఢిల్లీ: పసిడి ధర మళ్లీ పెరిగింది. గత వారం వరుసగా తగ్గిన బంగారం, వెండి ధరలు ఈ వారంలో మొదటి రోజే స్వల్పంగా పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో ఇవాళ 99.9 స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల బంగారం ధర రూ.241 పెరిగి రూ.45,520కి చేరింది. క్రితం ట్రేడ్లో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.45,279 వద్ద ముగిసింది. అంతర్జాతీయ బులియన్ మార్కెట్లో విలువైన లోహాల ధరలు పెరుగడంతో దేశంలో ఇవాళ పసిడి, వెండి ధరలు పెరిగాయని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ నిపుణులు తెలిపారు.
అదేవిధంగా వెండి ధరలు కూడా ఇవాళ స్వల్పంగా పెరిగాయి. కిలో వెండి ధర రూ.781 పెరిగి రూ.68,877కు చేరింది. క్రితం ట్రేడ్లో కిలో వెండి ధర రూ.68,096 వద్ద ముగిసింది. ఇక అంతర్జాతీయ మార్కెట్లలో ఇవాళ ఔన్స్ బంగారం ధర 1,753 అమెరికన్ డాలర్లు, ఔన్స్ వెండి ధర 26.90 అమెరికన్ డాలర్లు పలికింది.