వికారాబాద్ : బీఆర్ఎస్ హయాంలో ముఖ్యమంత్రిగా కేసీఆర్(KCR) చేపట్టిన హరితహారం వల్ల రాష్ట్రంలో పచ్చదనం పరిఢవిల్లిందని మాజీ మంత్రి , ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి(Sabitha Indra Reddy) అన్నారు. మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మంత్రాల చెరువు కట్టపై హరిత హారం(Haritaharam) కార్యక్రమం కింద మొక్కలు నాటి నీళ్లు పోశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి గ్రామంలో నర్సరీల ఏర్పాటుతో గ్రామాల్లో పచ్చదనం పెరిగి, కాలుష్యం తగ్గిందన్నారు. ప్రతి యేట హరితహారాన్ని ఉద్యమంలో చేపట్టి కోట్లాది మొక్కలు నాటి వాటిని సంరక్షించారని తెలిపారు. ప్రజలు కాలుష్య నియంత్రణకు మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. నర్సరీలను కాపాడుకోవలసిన బాధ్యత స్థానిక ప్రజలపై ఉందని సూచించారు.
చెరువు చుట్టు సుందరీకరణ పనులను , ప్రస్తుతం జరుగుతున్న ఎస్ఎన్డీపీ పనులను పరిశీలించారు. చెరువులోకి మురుగు నీరు ఎందుకు వదులుతున్నారని అధికారులను ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో మేయర్ దుర్గా దీప్లాల్ చౌహన్, డిప్యూటీ మేయర్ తీగల విక్రంరెడ్డి, కమిషనర్ చంద్రశేఖర్ , నాయకులు, అధికారులు పాల్గొన్నారు.