నవాబుపేట, జూలై 2 : అన్నం పెట్టే రైతు ఆనందంగా ఉండాలని వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్జైన్ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవ సాయ సహకార సంఘ భవనంలో ఏర్పాటుచేసిన రైతు భరోసా పథకంపై రైతుల నుంచి అభిప్రాయాల సేకరణ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఏయే పంటలు పండిస్తారని, పంటలు పండించే క్రమంలో ఎదురయ్యే సమస్యలను రైతులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. దేశానికి వెన్నముక రైతు అని.. ఆయన లేకుంటే వ్యవసాయమే లేదన్నారు. రైతుల నుంచి సమస్యలను నేరుగా తెలుసుకునేందుకే గ్రామాలను సందర్శిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ పథకాలు రైతులకు అందాలన్న సదుద్దేశంతోనే ప్రత్యక్షంగా అభిప్రాయాలను సేకరిస్తున్నట్లు చెప్పారు.
మండలాన్ని వెజిటెబుల్ జోన్గా ప్రకటించాలి
రైతుభరోసా అర్హులకు అందేలా చూడాలని.. ఎరువులు, విత్తనాలు, డ్రిప్, స్ప్రింకర్లను సబ్సిడీపై అందించాలని పలువురు రైతులు కలెక్టర్కు విన్నవించారు. నవాబుపేట మండలాన్ని వెజిటెబుల్ జోన్గా ప్రకటించి పండించిన పంటలను మార్కెట్కు తరలించేందుకు వీలుగా రవాణా సౌకర్యాన్ని కల్పించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ పోలీసు రాంరెడ్డి, జిల్లా సహకార అధికారి ఈశ్వ రయ్య, తహసీల్దార్ జయరాం, ఎంపీడీవో అనురాధ పాల్గొన్నారు.