నవాబుపేట, జూన్ 27 : కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కుల పంపిణీలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య కొట్లాట తారాస్థాయికి చేరుకుంది. గత ప్రభుత్వ హయాంలో మంజూరైన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను లబ్ధిదారులకు పంచేందుకు స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. చెక్కులను పంచే కార్యక్రమం మొదలుపెట్టగానే ప్రొటోకాల్ పాటించకుండా అగౌరవపర్చడం సరైన పద్ధతి కాదని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. ఇది పార్టీ ప్రోగ్రామ్ కాదు.. చెక్కులను పంచే కార్యక్రమంలో రాజకీయం చేయడం ఎంతవరకు సబబని యాదయ్య మండిపడ్డారు. మీ కాంగ్రెస్ ప్రభుత్వం తులం బంగారం, లక్ష రూపాయలు ఇస్తామని ప్రజలను మోసం చేయడం తగునా అని స్పీకర్ ఎదుటే కాంగ్రెస్ పార్టీ నాయకులను ఎమ్మెల్యే నిలదీశారు.
పోలీసులు కలుగజేసుకొని బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ నాయకులకు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. స్పీకర్ కూడా యాదయ్యకు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు సర్దిచెప్పి కార్యక్రమం ప్రశాంతంగా జరిపించేలా చూడాలని పోలీసులు, అధికారులను కోరారు. అనంతరం స్పీకర్, ఎమ్మెల్యే చెక్కులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే యాదయ్య మాట్లాడుతూ.. స్పీకర్ మొదటిసారిగా తమ నియోజకవర్గంలోని మండలానికి రావడంతోనే ఇలాంటి ఘటన చోటు చేసుకోవడంతో చింతిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ తొలి ముఖ్య మంత్రి కేసీఆర్ ప్రజల అవసరాల నిమిత్తం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను అమలు చేశారని ఎమ్మెల్యే గుర్తుచేశారు. స్పీకర్ ప్రసాద్కుమార్ మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో మంజూరైన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులనే పంచుతున్నామని.. వాటి పేర్లు కూడా మార్వలేదన్నారు. మాజీ ముఖ్యమంత్రి అమలు చేసిన అనేక సంక్షేమ పథకాలను కొనసాగిస్తూనే సీఎం రేవంత్రెడ్డి మరికొన్ని సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని స్పీకర్ పేర్కొన్నారు.
కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ చేవెళ్ల ఇన్చార్జి భీమ్భరత్, ఆర్డీవో వాసుచంద్ర, పీఏసీఎస్ చైర్మన్ రాంరెడ్డి, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు దయాకర్రెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు నాగిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు వెంకటయ్య, వివిధ గ్రామాల మాజీ సర్పంచులు పాల్గొన్నారు.