రంగారెడ్డి, జూలై 1(నమస్తే తెలంగాణ)ః సీజన్ల వారీగా వ్యవసాయ శాఖ పంటల నమోదు ప్రక్రియ (క్రాప్ బుకింగ్) చేపడుతుండగా.. ప్రస్తుత వానకాలం సీజన్కు సంబంధించి రంగారెడ్డి జిల్లాలో పంటల సర్వే మొదలైంది. వ్యవసాయ విస్తరణ అధికారుల ఆధ్వర్యంలో క్లస్టర్ల వారీగా సాగు చేసిన పంటల వివరాలను పోర్టల్లో నమోదు చేస్తున్నారు. గత ఏడాది ప్రయోగాత్మకంగా కేశంపేట మండలంలో డిజిటల్ సర్వేను ప్రభుత్వం నిర్వహించింది. ఈసారి డిజిటల్ సర్వేపై ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆదేశాలు రాలేదని సంబంధిత అధికారులు చెబుతున్నారు.
సర్వే కోసం పల్లెబాట..
పక్కాగా పంటల వివరాల లెక్కలు తీసేందుకు జిల్లాలోని వ్యవసాయ శాఖ అధికారులు పల్లెబాట పట్టారు. జిల్లా వ్యవసాయ శాఖ అధికారితోపాటు ఆరుగురు ఏడీఏలు, 22 మంది ఏవోలు, 83 మంది ఏఈవోలు గత కొద్దిరోజులుగా ఇదే పనిలో ఉన్నారు. రైతుల వారీగా సర్వే నంబర్లు, సాగు విస్తీర్ణం, ప్రధాన పంటలు, అంతర పంటలు, నీటి వసతి వివరాలతోపాటు యజమాని సెల్నంబర్, సంతకాలు సేకరించి ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు.
పంట ఏ దశలో ఉంది? చీడ పీడలు ఏమైనా ఆశించాయా? పంట దిగుబడి ఎంత వచ్చే అవకాశం ఉంది! తదితర వివరాలను వివిధ దశల్లో నమోదు చేసేలా యాప్ను రూపొందించారు. ఎక్కడో కూర్చుని వివరాలు నమోదు చేయకుండా..తప్పనిసరిగా వ్యవసాయ క్షేత్రం వద్దకు వెళ్లి నమోదు చేసేలా ఏర్పాట్లు చేశారు. ఈ సర్వే వల్ల అవసరమయ్యే ఎరువులు, విత్తనాలను సమకూర్చడంతోపాటు పంట కొనుగోళ్ల సందర్భంగా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకునే అవకాశం కలుగుతున్నది.
2.94లక్షల ఎకరాల్లో పంటల సాగు..
ఈసారి వానకాలంలో 2.94లక్షల ఎకరాల్లో పంటలను సాగు చేసే అవకాశం ఉందని జిల్లా వ్యవసాయ శాఖ అంచనా వేస్తున్నది. ఇందులో అత్యధికంగా 1.77లక్షల ఎకరాల్లో పత్తిని సాగు చేయనుండగా..ఆతర్వాత వరిని లక్ష ఎకరాల్లో సాగు చేసే అవకాశం ఉన్నది. అయితే ఇప్పటివరకు పత్తిని 85వేల ఎకరాల్లో సాగు చేయగా..వరిని 46 ఎకరాల్లో వేశారు. మరో 8,477 ఎకరాల్లో నారుమడిని సిద్దం చేసి ఉంచారు. మొక్కజొన్నను 17వేల ఎకరాల్లో సాగు చేశారు. ఈ మేరకు వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి పంటల నమోదు ప్రక్రియను చేపడుతున్నారు.
ఈసారి డిజిటల్ క్రాప్ సర్వే ఉండేనా..!
పంటల సాగు వివరాలు మరింత పక్కాగా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం డిజిటల్ క్రాప్ సర్వేను నిర్వహిస్తున్నది. గత ఏడాది జిల్లాలో పైలెట్ ప్రాజెక్ట్ కింద కేశంపేట మండలాన్ని ఎంపిక చేసి సర్వే నిర్వహించారు. మ్యాపులను జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టం(జీఐఎస్), గ్లోబల్ పొజిషనింగ్(జీపిఎస్) సిస్టం ద్వారా పంటల వివరాలను సేకరించారు. ఈ పద్ధతిలో రైతు పొలం వద్దకు వెళ్లి జీపీఎస్ ద్వారా ఛాయాచిత్రాన్ని తీసి పంటల వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది.
పంటల సాగు విస్తీర్ణం, పంటల ప్రకృతి వైపరీత్యాల వల్ల జరిగే పంట నష్టం వివరాల సేకరణ, తెగుళ్ల వల్ల జరిగే నష్టం, వాతావరణ ఆధారిత వ్యవసాయ సూచనలకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని ఈ డిజిటల్ సర్వే ద్వారా తెలుసుకోవచ్చు. అయితే ప్రస్తుత వానకాలంలో డిజిటల్ క్రాప్ సర్వేకు సంబంధించిన ఆదేశాలు ఇప్పటివరకు రాలేదని సంబంధిత అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతానికైతే క్రాప్ బుకింగ్ సర్వేను యాప్ ద్వారా చేపడుతున్నామని వారు చెబుతున్నారు.