తెలంగాణ ఏర్పడ్డాక కేసీఆర్ హయాంలో కరెంట్ కాంతులు ప్రసరిస్తే.. కాం గ్రెస్ పాలనలో ‘కట్’కట మొదలైనది. ఎడాపెడా కోతలపై ప్రజలు, వ్యాపారులు, రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏ పని సక్రమంగా చేయలేకపోతున్నామని, కరెంట్ ఉంటేనే అన్ని పనులు జరుగుతాయని పేర్కొంటున్నారు. ప్రస్తుతం సరఫరా అయ్యే కరెంట్తో బోరు మోటర్ ద్వారా ఎకరా పొలం కూడా పారడం లేదని కర్షకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి వచ్చిన ఏడు నెలల కాలంలోనే మళ్లీ పాత రోజులు గుర్తుకొస్తున్నాయి. ఎక్కడ చూసినా కరెంట్ కోతల మాటలే వినిపిస్తున్నాయి. చిన్న వానకు కూడా కరెంట్ పోతున్నది. నాడు నిరంతర వెలుగులు ఉంటే..నేడు ఆగమాగం అవుతు న్నామంటూ ప్రభుత్వంపై ప్రజలు మండిపడుతున్నారు. ఈ కాంగ్రెస్ సర్కార్ మాకు వద్దు బాబోయ్ అంటున్నారు.
– న్యూస్ నెట్వర్క్, నమస్తే తెలంగాణ
కరెంట్ ఎప్పుడు పోతుందో తెలుస్తలేదు..
స్వరాష్ర్టం వచ్చిన నాటి నుంచి పదేండ్ల వరకు తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ రెప్ప పాటు కరెంట్ పోకుండా చర్యలు తీసుకుని రైతులకు అండగా నిలిచారు. 24 గంటలపాటు నాణ్యమైన విద్యుత్తును వ్యవసాయానికి, ఇండ్లకు సరఫరా చేశారు. కానీ.. ప్రభుత్వం మారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో కరెంట్ ఎప్పుడు వస్తుందో.. ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి నెలకొన్నది. దీంతో రైతులు, ప్రజలు, వ్యాపారులు, ఇతర వర్గాల వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. – సీహెచ్ రాము, అంతారం గ్రామం, చేవెళ్ల
రైతుల గోస తీర్చింది కేసీఆర్ సారే..
కేసీఆర్ ప్రభుత్వ పాలనలో విద్యుత్తు సరఫరా నిరంతరంగా ఉండేది. ఇప్పడు కరెంట్ ఎప్పుడు వస్తుందో.. ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి నెలకొన్నది. కేసీఆర్ వచ్చిన తర్వాత 24 గంటల కరెంటిచ్చి చెరువులు, కెనాళ్ల్లకు నీటిని వదిలి బావుల్లో పుష్కలంగా నీరు ఉండేలా చేశారు. రైతులం ఎప్పుడు తీరిక దొరికితే అప్పు డు పోయి పంటలకు నీరు పెట్టుకునేది. కానీ, ఈ కాంగ్రెస్ పాలనలో విద్యుత్తు సరఫరా సక్రమంగా లేక ఇబ్బందిపడుతున్నాం.
– ఇమ్రాన్, సింగప్పగూడ గ్రామం, చేవెళ్ల మండలం
ఇష్టం వచ్చినట్లు కోతలు ..
ప్రతిరోజూ ఇష్టం వచ్చినట్లు విద్యుత్తు సరఫరాలో కోతలు విధిస్తున్నారు. సరఫరాలో కోతల్లేవని పాలకులు చెబుతున్నా మాటల్లో నిజం లేదు. కరెంట్ విషయంలో కేసీఆ ర్ను మరచిపోలేం. ఆయన అధికారంలో ఉన్నప్పుడు విద్యుత్తు సమస్యలు అంటే ఏమిటో తెలియకుండా చర్యలు తీసుకున్నారు. నిరంతర విద్యుత్తు సరఫరా తో ఉదయం నుంచి సాయంత్రం వరకు రైతులు పొలం పనులు చేసుకునే వారు. దీంతో వ్యవసాయం పండుగలా సాగింది.
– మంగలి వెంకటేశ్, ఊరేళ్ల గ్రామం, చేవెళ్ల మండలం