వికారాబాద్, జూన్ 28 (నమస్తే తెలంగాణ) : బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణకు హరితహారం కింద మొక్కలను నాటే కార్యక్రమానికి అత్యంత ప్రాధాన్యతనిచ్చి పచ్చదనం పెంపొందించేందుకుగాను బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టింది. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం హరితహారం వంటి కార్యక్రమాలను కూడా నిర్లక్ష్యం చేస్తూ వస్తున్నారు. ఏటా జూన్ మొదటి వారంలోనే హరితహారం కార్యక్రమం ప్రారంభ తేదీలను ఖరారు చేసి జూన్ రెండో వారంలో మొక్కలను నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టేది. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం మొక్కలను నాటే కార్యక్రమాన్ని నిర్లక్ష్యం చేస్తున్నది. తెలంగాణకు హరితహారం కార్యక్రమం పేరును వనమహోత్సవంగా మార్చిన ప్రభుత్వం ఇప్పటివరకు వనమహోత్సవంపై అధికారులకు దిశానిర్దేశం చేయలేదు.
ప్రభుత్వ నిర్లక్ష్యంతో గతనెల చివర్లోనే నాటేందుకు నర్సరీల్లో మొక్కలు సిద్ధంగా ఉన్నప్పటికీ వనమహోత్సవం కార్యక్రమ నిర్వహణపై స్పష్టత లేకపోవడంతో నర్సరీల్లోనే మొక్కలు వృథాగా పడి ఉన్నాయి. ఆలస్యం చేస్తుండడంతో మెయింటెనెన్స్కు కూడా ఖర్చు చేయాల్సి వస్తుందని సంబంధిత అధికారులు చెబుతున్నారు. నర్సరీల్లో మొక్కలు పెంచేందుకుగాను నిర్ణీత గడువు దాటిన అనంతరం సంబంధిత మొక్కల సంరక్షణను గాలికి వదిలేయడంతో కూడా వృథా అవుతున్నాయి. ఇంకా ఆలస్యమైతే నర్సరీల్లోని చాలా వరకు మొక్కలు వృథా అయ్యే అవకాశాలున్నాయి. మరోవైపు మొక్కలు నాటేందుకు ఈనెల మొదటి వారం నుంచి గుంతలు తీసే ప్రక్రియ ప్రారంభం కాగా, కొన్ని చోట్ల తీసిన గుంతలు మూసుకుపోయే పరిస్థితులున్నాయి. జిల్లావ్యాప్తంగా 580 నర్సరీల్లో మొక్కలను పెంచారు. వీటిలో గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీల్లో 566 నర్సరీల్లో 24 లక్షల మొక్కలు, అటవీ శాఖ ఆధ్వర్యంలోని 14 నర్సరీల్లో 17 లక్షల మొక్కలు వృథాగా ఉన్నాయి.
ఈ ఏడాది 10 లక్షల మేర తగ్గిన లక్ష్యం..
గత ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను ఆనవాళ్లు లేకుండా చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణకు హరితహారం కార్యక్రమానికి పేరు మార్చడంతోపాటు మొక్కలను నాటే కార్యక్రమంపై నిర్లక్ష్యం వహిస్తున్నట్లు తెలుస్తున్నది. ఇందులో భాగంగానే ఈ ఏడాది జిల్లావ్యాప్తంగా నాటాల్సిన మొక్కలకు సంబంధించి లక్ష్యాన్ని భారీగా తగ్గిస్తూ నిర్ణయించడం గమనార్హం. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది సుమారు 10 లక్షల మొక్కల మేర లక్ష్యాన్ని తగ్గిస్తూ నిర్ణయించారు. మొదట ఈ ఏడాది 29.33 లక్షల మొక్కలను నాటాలని జిల్లా అటవీ శాఖ అధికారులు లక్ష్యాన్ని నిర్దేశించినప్పటికీ తదనంతరం ప్రభుత్వ ఆదేశాల మేరకు లక్ష్యాన్ని భారీగా తగ్గించినట్లు తెలిసింది. పచ్చదనం పెంపొందించడమే లక్ష్యంగా సదుద్దేశంతో తీసుకొచ్చిన మొక్కలు నాటే కార్యక్రమంపై నిర్లక్ష్యం చూపడంపై జిల్లా అంతటా విమర్శలు వెలువడుతున్నాయి.
గత ప్రభుత్వం మొక్కలను నాటడంతోపాటు సంరక్షణ చర్యలు చేపట్టడం, జియో ట్యాగింగ్ ప్రక్రియ చేపట్టగా, ఈ ఏడాది జియో ట్యాగింగ్ ప్రక్రియతోపాటు మొక్కల సంరక్షణకు సంబంధించి ఎలాంటి ప్రస్తావన లేదు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి 29.33 లక్షల మొక్కలను నాటాలని లక్ష్యంగా నిర్ణయించగా, గతేడాది జిల్లావ్యాప్తంగా 40.49 లక్షల మొక్కలను నాటాలని టార్గెట్గా నిర్ణయించగా, 39.69 లక్షల మొక్కలను నాటారు. జిల్లాలో తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో భాగంగా 2015-16లో 73.78 లక్షల మొక్కలు, 2016-17 సంవత్సరంలో 1.39 కోట్ల మొక్కలు, 2017-18 సంవత్సరంలో 71.04 లక్షలు, 2018-19 సంవత్సరంలో 86.12 లక్షల మొక్కలు, 2019-20 సంవత్సరంలో 1.02 కోట్ల మొక్కలు, 2021-22 సంవత్సరంలో 74 లక్షలు, 2022-23 ఆర్థిక సంవత్సరంలో 40.25 లక్షల మొక్కలు, 2023-24 ఆర్థిక సంవత్సరంలో 39.60 లక్షల మొక్కలను జిల్లాలో నాటారు.