ఇబ్రహీంపట్నం, జూలై 7 : ఇబ్రహీంపట్నం పెద్దచెరువు పర్యాటకశోభ సంతరించుకోనున్నది. చెరువు పరిరక్షణతో పాటు సుందరీకరణకు కావాల్సిన నిధుల విషయంలో ప్రతిపాదనలను సిద్ధం చేయాలని హెచ్ఎండీఏ అధికారులను రాష్ట్ర సర్కార్ ఆదేశించింది. చెరువులో బోట్లను ఏర్పాటు చేసి పర్యాటకులను ఆకట్టుకునేందుకు హెచ్ఎండీఏ అధికారులు వడివడిగా అడుగులు వేస్తున్నారు. హైదరాబాద్కు అతిసమీపంలో ఉన్న ఇబ్రహీంపట్నం పెద్దచెరువును అభివృద్ధి చేయాలని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి సీఎం కేసీఆర్ను పలుమార్లు కోరారు. దీంతో మంత్రి కేటీఆర్ వెంటనే చర్యలు చేపట్టాలని హెచ్ఎండీఏ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఎంతో చరిత్ర కలిగిన ఇబ్రహీంపట్నం పెద్దచెరువు కట్ట సుందరీకరణ కోసం రూ.9.70 కోట్ల అవసరమున్నట్లు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఇబ్రహీంపట్నం పెద్దచెరువును 1560లో అప్పటి ఖులికుత్బూషా పాలనలో నిర్మించారు. సుమారు 1300 ఎకరాల విస్తీర్ణంలో చెరువు ఉన్నది. హుస్సేన్సాగర్, ఉస్మాన్సాగర్, హిమాయత్సాగర్, మిగతా చెరువుల తర్వాత ఇబ్రహీంపట్నం పెద్దచెరువుకు అంతటి ప్రాధాన్యత ఉన్నది. సుమారు 3 కిలోమీటర్ల పొడవుతో ఉన్న చెరువుకట్టను ట్యాంక్బండ్ తరహాలో అభివృద్ధి చేయాలని అధికారులు నిర్ణయించారు. దీనికి సంబంధించిన టెండర్లనూ ఇటీవల హెచ్ఎండీఏ అధికారులు ఆహ్వానించారు. ఈనెల 3లోగానే టెండర్ల ప్రక్రియ పూర్తి చేశారు. టెండర్లను పరిశీలించిన తర్వాత పనులను ఆయా కంపెనీలకు కేటాయించనున్నారు. టెండర్లు దక్కించుకున్న సంస్థ ఆరు నెలల్లో చెరువు కట్ట అభివృద్ధి పూర్తి చేయాలనే లక్ష్యంతో హెచ్ఎండీఏ కార్యాచరణ రూపొందించింది.
ఔటర్ రింగ్రోడ్డుకు అతి సమీపంలో..
ఇబ్రహీంపట్నం పెద్దచెరువు ఔటర్రింగ్రోడ్డుకు అతిసమీపంలో ఉండటం వల్ల ఈ చెరువును పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తే పర్యాటకులకు ఎంతగానో ఉపయోగపడడంతో పాటు మరింత అభివృద్ధికి నోచుకునే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటివరకు ప్రభుత్వం ఔటర్రింగ్రోడ్డు లోపల ఉన్న చెరువుల సుందరీకరణకే ప్రాధాన్యత ఇచ్చింది. ఈ ఏడాదిలో ఓఆర్ఆర్ బయట మున్సిపాలిటీల పరిధిలో ఉన్న చెరువులను పరిరక్షించడంతో పాటు సుందరీకరించి స్థానికులు సేదతీరేలా తీర్చిదిద్దుతున్నారు. ఇందుకోసం ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని లేక్ ప్రొటెక్షన్ కమిటీ ఇంజినీరింగ్ విభాగం అధికారులకు మంత్రి కేటీఆర్ సూచించారు.
రంగారెడ్డి తూర్పు భాగంలో ఇదే పెద్దచెరువు..
రంగారెడ్డి తూర్పు భాగంలో ఉన్న చెరువుల్లో ఇబ్రహీంపట్నం పెద్దచెరువే అతిపెద్దది. ఇటీవల కురిసిన వర్షాలకు పూర్తిస్థాయిలో నిండి పదిహేను రోజులపాటు అలుగు పారింది. చుట్టుప్రక్కల గ్రామాలతో పాటు ఇతర గ్రామాల నుంచి పెద్ద ఎత్తున వచ్చి చెరువును సందర్శించి ఆనందం వ్యక్తం చేశారు. నైజాం కాలంలో నిర్మించిన చెరువుకు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సుందరీకరిస్తుండడంతో స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
వీలైనంత త్వరలో పనులు ప్రారంభం..
ఎంతో చరిత్ర కలిగిన ఇబ్రహీంపట్నం పెద్దచెరువు సుందరీకరణ పనులకు రూ.9.70కోట్లను ప్రభుత్వం కేటాయించింది. ఇప్పటికే టెండర్ల ప్రక్రియ పూర్తయ్యింది. త్వరలోనే పనులు ప్రారంభించనున్నాం. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవతో నిధులు కేటాయించటం సంతోషకరం.
– మంచిరెడ్డి కిషన్రెడ్డి, ఎమ్మెల్యే ఇబ్రహీంపట్నం
పెరుగనున్న పర్యాటకుల తాకిడి..
ఇబ్రహీంపట్నం పెద్దచెరువు సుందరీకరణ చేయనున్న నేపథ్యంలో పర్యాటకుల తాకిడి పెరుగనున్నది. ఈ ప్రాతవాసుల జీవనాధారమైన పెద్దచెరువు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అబివృద్ధి చెందుతుండడం సంతోషంగా ఉన్నది.
– బూడిద రాంరెడ్డి, సర్పంచ్ ఉప్పరిగూడ