మంచాల, జూన్ 30 : మంచాల తహసీల్దార్ కార్యాలయంలో అవుట్ సోర్సింగ్ విధానంలో కంఫ్యూటర్ ఆపరేటర్గా పని చేస్తున్న సురేశ్, హైదరాబాద్ నగరంలోని మీసేవ నిర్వాహకుడు, మరో ఇద్దరితో కలిసి నకిలీ సర్టిఫికెట్లను సృష్టిస్తూ మంచాల తహసీల్దార్కు అడ్డంగా దొరికాడు. అనర్హులకు హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం క్యాస్ట్, ఇన్కం సర్టిఫికెట్లను ఇస్తూ డబ్బులను గుంజుతున్న విషయం అధికారులకు తెలియడంతో గుట్టుచప్పుడు కాకుండా సెలవుపెట్టి పరారయ్యాడు.
మంచాల తహసీల్దార్ కార్యాలయంలో గతేడాది కిందే అవుట్ సోర్సింగ్ ఉద్యోగిగా సురేశ్ చేరాడు. మొదటి నుంచి తోటి ఉద్యోగులతో దురుసుగా ఉండేవాడు. అయితే ధనార్జనే ధ్యేయంగా ఎంచుకున్న అతడు నగరంలోని వనస్థలిపురంలో ఉన్న మీసేవ నిర్వాహకుడైన రాజుతో పాటు మరో ఇద్దరితో కుమ్మక్కయ్యాడు. స్థానికకేతరులకు క్యాస్ట్, ఇన్కం సర్టిఫికెట్లను జారీ చేస్తూ అక్రమార్జనకు పాల్పడ్డాడు. ఇందు కోసం వారినుంచి ఒక్కో సర్టిఫికెట్కు రూ.వెయ్యి నుంచి రూ.5వేల వరకు వసూలు చేస్తున్నట్లు తెలిసింది.
ఈ దందా మిగతా అధికారులకు తెలియకుండా సురేశ్ ఎంతో గోప్యంగా వ్యవహరించాడు. అయితే సురేశ్ సెలవు పెట్టి వారం రోజులుగా విధులకు హాజరుకావడం లేదు. దీంతో అనుమానం వచ్చిన తహసీల్దార్ కేవీవీ ప్రసాద్రావు గత 10 రోజుల నుంచి క్యాస్ట్, ఇన్కం సర్టిఫికెట్లు ఎంతమందికి జారీ చేసిన విషయాన్ని పరిశీలించగా, అందులో 57 మందికి వనస్థలిపురం మీసేవ సెంటర్ నుంచి ఒకే ఫోన్ నంబర్పై జారీ అయినట్లు తహసీల్దార్కు తెలిసింది. దీనిపై ఆరా తీయగా ఈ బాగోతం మొత్తం బయటపడింది. వెంటనే కంఫ్యూటర్ ఆపరేటర్ సురేశ్తో పాటు మీసేవ నిర్వాహకుడిపై రెండు రోజుల క్రితమే తహసీల్దార్ మంచాల పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లా..
మంచాల తహసీల్దార్ కార్యాలయంలో పని చేస్తున్న అవుట్సోర్సింగ్ అయిన సురేశ్ స్థానికేతరులైన 57మందికి నకిలీ సర్టిఫికెట్లు జారీ చేశాడు. అతడిపై కఠిన చర్యలు తీసుకోవాలి. దీనిపై మంచాల పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాటు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లా. సురేశ్ సెలవు పెట్టి వారం రోజులుగా ఆఫీసుకు రావడం లేదు. నకిలీ సర్టిఫికెట్లు అవసరమున్నవారు కార్యాలయానికి వస్తుండడంతో అనుమానం వచ్చి పరిశీలించగా ఈ తతంగం బయటపడింది. మండలంలో క్యాస్ట్, ఇన్కం సర్టిఫికెట్లు జారీ చేసే విషయంలో ఆర్ఐతో పాటు ఇతర అధికారులు ధ్రువీకరించిన తరువాతే వారికి సర్టిఫికెట్లు జారీ చేస్తాం.. కానీ కంఫ్యూటర్ ఆపరేటర్ సురేశ్ అన్నీ తానై ఈ తతంగాన్ని నడిపించాడు. ఈ వ్యవహారంలో పాత్రధారులైన వనస్థలిపురంలోని మరో ముగ్గురిపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని మంచాల పోలీసులకు ఫిర్యాదు చేశా. – కేవీవీ ప్రసాద్రావు, మంచాల తహసీల్దార్