తాండూరు, జూలై 1: జిల్లాలో అక్రమాలు, అన్యాయాలపై ఉక్కుపాదం మోపుతామని వికారాబాద్ ఎస్పీ కె.నారాయణరెడ్డి పేర్కొన్నారు. సోమవారం తాండూరు పోలీస్ స్టేషన్ను సందర్శించిన ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన చట్టాల అమలుతో పాటు వాటిపై ప్రజలకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పిస్తామన్నారు. భారతీయ న్యాయ సంహిత-2023, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత-2023, భారతీయ సాక్ష్య అధినియన్-2023 చట్టాలపై ఈ నెల 10వ తేదీ వరకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు.
జిల్లాలోని 14 బృందాలతో 600 మంది సిబ్బందికి శిక్షణ ఇచ్చినట్లు పేర్కొన్నారు. జిల్లాలో మత్తు పదార్థాల రవాణాపై ప్రత్యేక నిఘా పెట్టామన్నారు. నిషేధిత గుట్కా, మట్కాపై కూడా ఉక్కుపాదం మోపుతామన్నారు. తెలంగాణ-కర్ణాటక సరిహద్దుల్లో తనిఖీల కోసం ప్రత్యేక బృందాలు ఉంటాయన్నారు. జిల్లాలోని ఖాళీ పోస్టులను భర్తీ చేస్తామన్నారు. తాండూరులో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఇప్పటికే మంజూరైందని, వెంటనే స్థలం చూసి నిర్మాణానికి కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ బాలకృష్ణారెడ్డి, సీఐ సంతోష్కుమార్, ఎస్ఐ కాశీనాథ్ తదితరులు పాల్గొన్నారు.