షాద్నగర్, జూన్ 28 : బుక్కెడు మెతుకులను వెతుక్కుంటు రాష్ర్టాలు దాటి పరాయిచోటికి వచ్చి పరిశ్రమల్లో పని చేస్తున్న కార్మికులు విగత జీవులై కుటుంబాలకు విషాదాన్ని మిగుల్చుతున్నారు. పరిశ్రమల నిర్వాహకుల నిర్లక్ష్యం ప్రమాదాలను సృష్టిస్తుంటే ఆ ప్రమాదాలు కార్మికుల ప్రాణాలను హరిస్తున్నాయి. పరిశ్రమల ప్రమాదాలకు శాశ్వత పరిష్కారాలు చూపక, బాధిత కార్మికులకు పరిహారాలు ఇవ్వక వేధించే యాజమాన్యాలు కూడా ఉన్నాయి. తరచూ ప్రమాదాలు జరుగుతున్నా సంబంధిత అధికారులు కానీ, పరిశ్రమల యాజమాన్యాలు కానీ శాశ్వత పరిష్కారాలను చూపడంతో విఫలమవుతున్నారు. తాజాగా శుక్రవారం షాద్నగర్ గ్లాస్ ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాదంతో కార్మికుల భద్రతపై యాజమాన్యాల నిర్లక్ష్యం మరోసారి చర్చనీయాంశమైంది.
ఉపాధికి నెలవుగా షాద్నగర్ పారిశ్రామికం..
షాద్నగర్ ప్రాంతం పారిశ్రామిక రంగంలో రాష్ట్ర రాజధానికి దీటుగా అభివృద్ధి చెందుతున్నది. ఇక్కడి పారిశ్రామిక ప్రాంతంలో వందలకుపైగా చిన్న, మధ్యతరహా, భారీ పరిశ్రమలు ఉన్నాయి. కాస్మెటిక్స్, బ్యాటరీలు, ఫార్మా, ఇనుము, వంట నూనెలు, చాక్లెట్, బిస్కెట్ వంటి తినుబండారాలు, టెక్స్టైల్ పరిశ్రమలు ఈ ప్రాంతంలో వెలిశాయి. రాష్ట్రం నుంచే కాకుండా కర్ణాటక, తమిళనాడు, బీహార్, పశ్చిమబెంగాల్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, అస్సాం, ఒడిశా, కేరళ, మహారాష్ట్ర, గుజరాత్ వంటి రాష్ర్టాల నుంచి వేలాది మంది ఈ ప్రాంతంలో ఉపాధి పొందుతున్నారు. నిత్యం 40 వేలకు పైగా దినసరి కూలీలతో పాటు కార్మికులు, ఉద్యోగులు విధులు నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నారు. ఆయా పరిశ్రమల యాజమాన్యాలు కార్మికుల భద్రతను విస్మరించడంతో తరచుగా ప్రమాదాలు జరిగి మృతి చెందుతున్నారు. అయినా సంబంధిత శాఖ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు.
మృత్యుఘంటికలు..
షాద్నగర్ నియోజకవర్గంలోని వందలాది పరిశ్రమల్లో తరచుగా ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. గతంలో 2012 ఆగస్టు 15 రోజున షాద్నగర్ శివారులోని స్టీమ్కోర్ ఇస్పత్ ఐరన్ పరిశ్రమలో జరిగిన సంఘటన దేశంలోనే ఓ సంచలనంగా మారింది. అప్పటి గాయం ఇప్పటికీ కార్మికులు, స్థానికుల్లో మెదులుతూనే ఉన్నది. నిబంధనలకు విరుద్ధంగా స్వాతంత్య్ర దినోత్సవం రోజున కార్మికులతో పని చేయించిన యాజమాన్యం కనీస విలువలు పాటించకుండా ఒకేసారి 12 మంది కార్మికులను బలి తీసుకున్నది. ఈ పరిశ్రమలో కొలిమి పేలి ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ర్టాలకు చెందిన కార్మికులు మృత్యువాతపడ్డారు. 2012 డిసెంబర్ 4న షాద్నగర్ శివారులోని ఎలికట్ట దేవశ్రీ స్టీల్పరిశ్రమలో వీరేందర్రాము అనే కార్మికుడు యాజమాన్య నిర్లక్ష్యానికి గురై మృత్యువాతపడ్డారు. 2011 అక్టోబర్ 18న కొత్తూరు మండల కేంద్రంలోని వినాయకస్టీల్ పరిశ్రమలో ఇనుప ద్రవపాత్ర పేలి నలుగురు కార్మికులు మృత్యువాతపడ్డారు.
2011లో కొత్తూరులోని ఆర్ఎం సిలిండర్స్ పరిశ్రమలో సిలిండర్ పేలి ఉత్తరప్రదేశ్కు చెందిన సుధీర్ అనే కార్మికుడు, 2010 జూలై 6న శివశక్తి స్టీల్ పరిశ్రమలో నర్సింహరాజు అనే కార్మికుడు బంకులో పడి మృతి చెందాడు. 2009 ఆగస్టు 7న కొడిచెర్ల గ్రామంలోని ఆనంద్ ఇస్పత్ ఐరన్ పరిశ్రమలో సంపులో పడి మరో కార్మికుడు మృత్యువాతపడ్డాడు. తాజాగా కొత్తూరు మండలం నందిగామ పిత్తి ల్యామినేషన్ పరిశ్రమలో మిషనిస్ట్ గ్రైండర్ వద్ద పని చేస్తుండగా మహారాష్ట్రలోని సోలీపూర్కు చెందిన సాయిబనా శంకర్ పటేల్ (23) అనే కార్మికుడు, కొందుర్గు మండలం దివ్యశక్తి పేపర్ మిల్లో పని చేస్తున్న జార్ఖండ్ రాష్ట్రం గొడ్డా జిల్లా సేతుబంద గ్రామానికి చెందిన సునేలాల్ (24) అనే కార్మికుడు పరిశ్రమలో జరిగిన ప్రమాదాలకు బలయ్యారు. ఇవేకాకుండా ప్రమాదాల్లో మృతి చెందిన ఎంతో మంది కార్మికుల వివరాలను బయటకి పొక్కకుండా పరిశ్రమల యాజమాన్యాలు ప్రయత్నించిన ఘటనలు ఉన్నాయి.
ఐదుగురి మృతితో విషాదఛాయలు
ఫరూఖ్నగర్ మండలం చింతగూడ గ్రామ పంచాయతీ పరిధిలోని సౌత్ గ్లాస్ లిమిటెడ్ పరిశ్రమలో గ్లాస్ నాణ్యతను పరిక్షించే అటో క్లివ్ అనే గ్యాస్ గది పేలి ఉత్తరప్రదేశ్కు చెందిన నికిత్కుమార్ (22), రామ్సేత్ (24), బీహార్ రాష్ర్టానికి చెందిన చిత్తరంజన్ (31), రాంప్రకాష్ (31), ఒడిశా రాష్ర్టానికి చెందిన రతికాంత్ (25) అనే వలస కార్మికులు తమ ప్రాణాలను కోల్పోయారు. ఈ సంఘటనతో స్థానికంగా విషాదఛాయలు నెలకొన్నాయి.
మూడు నెలల కింద కాశిరెడ్డిగూడ గ్రామ పంచాయతీ పరిధిలోని బ్లండ్ కలర్స్ పరిశ్రమలో అగ్ని ప్రమాదం చోటుచేసుకొని బీహార్కు చెందిన ముగ్గురు కార్మికులు మృతి చెందారు. కొందుర్గు మండలం ఐరన్ పరిశ్రమలో ఫర్నస్ పేలి బీహార్ రాష్ర్టానికి చెందిన ఇద్దరు కార్మికులు చనిపోయారు. నెలల వ్యవధిలోనే సుమారు 10 మంది వలస కార్మికులు మృత్యుఒడిలోకి చెరుకోగా పదుల సంఖ్యలో కార్మికులు తీవ్ర గాయాలపాలయ్యారు. నందిగామ మండల కేంద్రంలోని కెమికల్ పరిశ్రమల్లో భారీ అగ్ని ప్రమాదం జరగగా పలువురు కార్మికులు ప్రాణాలతో బయటపడ్డారు. ఇలా నిత్యం ఏదో ఓ పరిశ్రమలో ప్రమాదాలు జరుగుతున్నా సంబంధిత శాఖ అధికారుల పర్యవేక్షణ కరువైందని కార్మికులు, ప్రజలు వాపోతున్నారు.