Voter Enrollment | రంగారెడ్డి, ఆగస్టు 25 (నమస్తే తెలంగాణ) : ఓటరు నమోదుకు ఎన్నికల సంఘం మరో అవకాశం ఇచ్చింది. త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో కొత్త ఓటర్ల నమోదుకు శ్రీకారం చుట్టింది. ఈ మేరకు షెడ్యూల్ను కూడా విడుదల చేసింది. ఓటరు జాబితా సవరణ ప్రకారం 18 ఏండ్లు నిండే యువతకు ఓటు హక్కు కల్పించడంతోపాటు మార్పులు, చేర్పులు చేపట్ట నున్నారు. ఈ నెల 20 నుంచే జిల్లాలో ఓటరు జాబితా సవరణ ప్రక్రియ మొదలై చురుగ్గా సాగుతున్నది.
జనవరి 1, 2025 నాటికి 18 ఏండ్లు నిండే వారు ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకునేందుకు ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది. త్వరలోనే పంచాయతీ, మండల, జిల్లాపరిషత్, పురపాలికలకు ఎన్నికలు జరుగనున్నాయి. దాంతో కేంద్ర ఎన్నికల సంఘం ఓటర్ల జాబితా సవరణ చేపట్టేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా కొత్త ఓటర్ల నమోదుతోపాటు బోగస్ ఓట్ల తొలగింపు, చిరునామాలు మార్చుకోవచ్చు. ఆగస్టు 20 నుంచి అక్టోబర్ 18 వరకు ఓటరు జాబితా సవరణలో భాగంగా బూత్ లెవల్ అధికారులు(బీఎల్వో) ఇంటింటికీ తిరిగి పేర్లను పరిశీలిస్తారు. అవసరమైతే పోలింగ్ స్టేషన్ల సర్దుబాటు, మార్పులన్నింటినీ అక్టోబర్ 28 కల్లా పూర్తి చేయనున్నారు.
ముసాయిదా ఓటరు జాబితాను అక్టోబర్ 29న ప్రచురిస్తారు. అక్టోబర్ 29 నుంచి నవంబర్ 28వరకు అభ్యంతరాలపై దరఖాస్తులను స్వీకరిస్తారు. డిసెంబర్ 24లోగా దరఖాస్తులను పరిశీలిస్తారు. తుది ఓటరు జాబితాను 2025 జనవరి 6న విడుదల చేస్తారు. సవరణలో భాగంగా ఓటరు గుర్తింపు కార్డులో చిరునామా, తప్పుల సవరణకూ ఇందులో అవకాశం ఉంటుంది. ఓటరు జాబితా సవరణ ప్రక్రియ సజావుగా సాగేందుకు అధికారులు చర్యలు తీసుకోనున్నారు. అదేవిధంగా జిల్లా, డివిజన్, మండల స్థాయిలో ఓటరు సవరణను పర్యవేక్షించనున్నారు. గతంలో చేపట్టిన విధంగానే బూత్ స్థాయిలో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టేలా ఎన్నికల అధికారులు చర్యలు చేపట్టనున్నారు.
గ్రామపంచాయతీ ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారన్న దానిపై స్పష్టత లేనప్పటికీ రాష్ట్ర ఎన్నికల సంఘం మాత్రం ఓటరు జాబితా రూపకల్పనపై దృష్టి సారించింది. పంచాయతీ ఎన్నికల కసరత్తులో భాగంగానే షెడ్యూల్ను విడుదల చేసింది. ఈ క్రమంలో వార్డుల వారీగా ఓటరు జాబితా ప్రక్రియ చురుగ్గా సాగుతున్నది. 2011 జనాభాను పరిగణనలోకి తీసుకుని వార్డుల సంఖ్యను నిర్ధారించారు. గ్రామంలో ఉన్న ఓటర్ల సంఖ్య, అన్ని వార్డుల్లో సమానంగా ఉండేలా చర్యలు తీసు కుంటున్నారు. వార్డుల వారీగా జాబితాను తయారు చేసేందుకు గత అసెంబ్లీ ఎన్నికల్లో ఉప యోగించిన ఓటరు జాబితాను ప్రామాణికంగా తీసుకుంటున్నారు. ఉన్నతాధికారుల పరిశీలన అనంతరం సెప్టెంబర్ 6న ముసాయిదా జాబితాను ప్రకటిస్తారు. వాటిపై అభ్యంతరాలను స్వీక రించనున్నారు. సెప్టెంబర్ 21న తుది జాబితాను ప్రకటిస్తారు.