బడంగ్పేట, జూలై 2: బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్న కాంగ్రెస్ కార్పొరేటర్ల మధ్యన వివాదం ముదిరింది. రెండు వర్గాలుగా విడిపోయారు. వారి మధ్యన విభేదాలు తారస్థాయికి చేరాయి. బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్లో 32 డివిజన్లు ఉన్నాయి. కార్పొరేషన్లో 14 మంది కార్పొరేటర్లు బీఆర్ఎస్, 10 మంది కార్పొరేటర్లు బీజేపీ, ఒకరు స్వతంత్ర అభ్యర్థిగా ఉన్నారు. ప్రస్తుతం మేయర్గా ఉన్న చిగిరింత పారిజాతానర్సింహారెడ్డి కాంగ్రెస్లో గెలిచి బీఆర్ఎస్లో చేరారు. మేయర్తో పాటు రాళ్లగూడం సంతోషీశ్రీనివాస్రెడ్డి, పెద్ద బావి సుదర్శన్ రెడ్డిలు మేయర్తో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆ తర్వాత మేయర్, ఇద్దరు కార్పొరేటర్లతో కలిసి తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి పోయారు. ప్రస్తుతం, కాంగ్రెస్ పార్టీకి ఏడుగురు కార్పొరేటర్లు ఉన్నారు.
కొంత కాలం నుంచి వీరి మధ్యన అంతర్గత విభేదాలు చోటు చేసుకున్నాయి. కార్పొరేటరు వంగేటి ప్రభాకర్ రెడ్డి, బండారు మనోహర్, ఎర్ర మహేశ్వరీజైహింద్, బాలూనాయక్, రాళ్లగూడెం సంతోషీశ్రీనివాస్రెడ్డిలు మేయర్ ఒంటెద్దు పోకడపై కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానానికి ఫిర్యాదులు చేశారు. అసెంబ్లీ ఎన్నికల నుంచే వీరి మధ్యన పచ్చగడ్డి వేస్తే భగ్గు మంటుంది. కొంత కాలం పాటు ఫ్లోర్ లీడర్ వంగేటి ప్రభాకర్ రెడ్డి కార్పొరేటర్లతో ఉంటూనే మేయర్కు అనుకూలంగా వ్యవహరించడం పట్ల నలుగురు కాంగ్రెస్ కార్పొరేటర్లు ఏకమై తిరుగు బావుటా ఎగురవేశారు. మేయర్కు సంబంధం లేకుండా వారే కాంగ్రెస్ పార్టీ మంత్రులను కల్వడం, నియోజకవర్గ ఇన్చార్జి, జిల్లా అధ్యక్షుల టచ్లోకి వెళ్లారు. ఇది గమనించిన మేయర్ చిగిరింత పారిజాతానర్సింహారెడ్డి నలుగురు కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లను పక్కన పెట్టి బీజేపీ కార్పొరేటర్లకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని ఆరోపణలున్నాయి. ఇదే అంశాన్ని కాంగ్రెస్ పార్టీ హై కమాండ్ దృష్టికి తీసుకుపోయారు.
ఐనా కూడా మేయర్, ఫ్లోర్ లీడర్లో మార్పు రాకపోవడంతో ఫ్లోర్ లీడర్ వంగేటి ప్రభాకర్ రెడ్డిని తొలగించి ఎర్ర మహేశ్వరీజైహింద్ను కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్గా ఎన్నుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. ఫ్లోర్ లీడర్గా ఎన్నుకొని బుధవారం బడంగ్పేట కమిషనర్కు లేఖ అందజేయనున్నట్లు తెలిసింది. మేయర్ తీరుపై కూడా గుర్రుగా ఉన్నట్లు తెలుస్తుంది. దీంతో కాంగ్రెస్ కార్పొరేటర్ల మధ్యన ఉన్న విభేదాలు మరోసారి బహిర్గతం అవుతున్నాయి. అధిష్ఠానం కూడా నలుగురు కార్పొరేటర్లకు మద్దతు ఇస్తున్నట్లు సమాచారం. ఇక నుంచి వంగేటి ప్రభాకర్రెడ్డి కార్పొరేటర్గానే ఉంటారు తప్ప ఫ్లోర్ లీడర్గా తాము ఒప్పుకోవడం లేదని తీర్మానం చేసుకున్నట్లు తెలిసింది. బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్లో కాంగ్రెస్ కార్పొరేటర్లలో ముసలం మొదలైంది.