సిటీబ్యూరో, జూన్ 15 (నమస్తే తెలంగాణ): భవన నిర్మాణ, లేఅవుట్ల అనుమతుల కోసం హెచ్ఎండీఏ పరిధిలో సింగిల్ విండో విధానాన్ని మాత్రమే అమలు చేయనున్నారు. హెచ్ఎండీఏ పరిధిలో భవన నిర్మాణ అనుమతుల కోసం 2016 నుంచి డెవలప్మెంట్ పర్మిషన్ మేనేజ్మెంట్ సిస్టం (డీపీఎంఎస్)ను ప్రారంభించగా, దాని స్థానంలో కొత్తగా టీ ఎస్ బీపాస్ విధానాన్ని తీసుకొచ్చారు. ఇప్పటి వరకు రెండు విధానాల్లో అనుమతులకు అవకాశం ఉన్నది.
జూలై 1 నుంచి కేవలం టీఎస్ బీపాస్ ద్వారానే ఆన్లైన్లోనే దరఖాస్తు చేసుకోవాలని అధికారులు తెలిపారు. ప్రస్తుతం హెచ్ఎండీఏ 7 జిల్లాలు, 70 మండలాలు, 1032 గ్రామాల్లో విస్తరించి ఉన్నది. ఇందులో జీహెచ్ఎంసీతో పాటు 7 కార్పొరేషన్లు, 30 మున్సిపాలిటీలు, 697 గ్రామాలు ఉన్నాయి. ఇప్పటి వరకు గ్రామ పంచాయతీల్లో భవన నిర్మాణ, లే అవుట్ల అనుమతులు డీపీఎంఎస్ ద్వారా ఇస్తుండగా, ఇక నుంచి హెచ్ఎండీఏ పరిధిలోని గ్రామ పంచాయతీల పరిధిలో ఇచ్చే అనుమతులన్నీ టీఎస్ బీపాస్ ద్వారా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. దానికనుగుణంగానే వెబ్సైట్ మార్పులు చేస్తున్నారు.