రంగారెడ్డి, ఆగస్టు 22 (నమస్తే తెలంగాణ) : రుణమాఫీ కాక.. అష్టదిగ్బంధనలో చిక్కుకున్న రైతన్నకు బీఆర్ఎస్ పార్టీ అండగా నిలిచింది. కష్టకాలంలో మేమున్నామంటూ.. గురువారం రంగారెడ్డి జిల్లాలోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో రైతులతో కలిసి ధర్నాలు నిర్వహించింది. కొన్ని చోట్ల మండల కేంద్రాల్లోనూ ధర్నాలు నిర్వహించారు.
చేవెళ్లలో నిర్వహించిన ధర్నాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, మహమూద్ అలీలు పాల్గొన్నారు. మిగతా చోట్ల మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్సీలు పాల్గొనగా.. బీఆర్ఎస్ శ్రేణులు రైతన్నలతో కలిసి కదం తొక్కారు. నినాదాలతో ధర్నా ప్రాంగణాలు దద్దరిల్లాయి. ఎటువంటి ఆంక్షలు లేకుండా రూ.2లక్షల రుణమాఫీని చేసి తీరాల్సిందేనని, ప్రభుత్వం మెడలు వంచే వరకు పోరు ఆగదని నేతలు ఈ సందర్భంగా స్పష్టం చేశారు. అన్ని చోట్లా ధర్నాలు సూపర్ సక్సెస్ కావడంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో జోష్ కనిపించింది.
కన్నెర్రజేసిన రైతన్నలు..
ఎన్నికలకు ముందు ఎటువంటి షరతులు లేకుండా రుణమాఫీ చేస్తామని చెప్పి తీరా.. అధికారంలోకి వచ్చాక మాటమార్చిన కాంగ్రెస్ ప్రభుత్వంపై జిల్లా రైతులు కన్నెర్ర జేశారు. అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో నిర్వహించిన ధర్నాలకు స్వచ్ఛందంగా రైతులు పెద్ద ఎత్తున తరలివచ్చి నిరసన గళాన్ని విప్పారు. గత కేసీఆర్ ప్రభుత్వంలో రూ.లక్ష లోపు రుణాలను అమలు చేయగా.. జిల్లాలో 74,701 మంది రైతులకు రూ.420కోట్ల వరకు రుణాలు మాఫీ అయ్యాయి.
కానీ.. ప్రస్తుత రేవంత్ సర్కార్ రూ.2 లక్షల వరకు రుణాలు మాఫీ చేస్తున్నట్లు ప్రకటించి మూడు విడుతల్లో కలిసి జిల్లాలో 87,612 మందికి రూ.660.72కోట్లను మాత్రమే మాఫీ చేసి ప్రభుత్వం చేతులు దులుపుకొన్నది. అర్హులు లక్షల్లో ఉండగా.. వేలల్లోనే మాఫీ చేసింది. రేషన్ కార్డు లేనివారికి రుణమాఫీ వర్తింపజేయకుండా ప్రభుత్వం పక్కన పెట్టింది. దీంతోపాటు ఆధార్ సీడింగ్, ఇతర సాంకేతిక సమస్యలు ఉన్నవారికి సైతం రుణమాఫీ చేయలేదు. దీంతో బాధిత రైతులు నిత్యం బ్యాంకులు, వ్యవసాయ అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.
ఈ పరిస్థితుల నేపథ్యంలోనే బీఆర్ఎస్ పార్టీ గురువారం నిర్వహించిన ధర్నాకు పెద్ద ఎత్తున రైతులు తరలివచ్చి మద్దతు పలికారు. ఆర్థిక భారం తగ్గించుకునేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం పలు రకాల కొర్రీలు పెట్టి రుణమాఫీని మమ అనిపించిందని ధర్నాలో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సగం మందికి మాఫీ చేసి సగం మందిని దూరం పెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వానికి రానున్న రోజుల్లో తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు.
మాఫీ చేసేదాకా కొట్లాడుడే..
రుణమాఫీ కాక గుండె చెదిరిన రైతన్నకు బాసటగా నిలువాలని సంకల్పించిన కేటీఆర్ స్వయంగా తానే రంగంలోకి దిగారు. రైతాంగం కోసం పోరుబాట పట్టారు. అప్పులు మాఫీ కాక.. అరిగోస పడుతున్న రైతాంగానికి భరోసా కల్పించేందుకు ధర్నాలు నిర్వహించాలని సంకల్పించి రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండల కేంద్రంలో నిర్వహించిన ధర్నాలో కేటీఆర్ పాల్గొన్నారు. మాఫీ చేసేదాకా కాంగ్రెస్ ప్రభుత్వంతో కొట్లాడుడేనని స్పష్టం చేశారు. గ్రామ స్థాయిలోనూ ఉద్యమ కార్యాచరణను అమలు చేస్తామని స్పష్టం చేశారు.
చేవెళ్లలో నిర్వహించిన ధర్నాలో మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, మహమూద్ అలీ, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, మాజీ ఎమ్మెల్సీ స్వామి గౌడ్, బీఆర్ఎస్ యువ నాయకుడు పట్లోళ్ల కార్తీక్ రెడ్డిలు పాల్గొన్నారు. ఇబ్రహీంపట్నంలో సాగర్- హైదరాబాద్ ప్రధాన రహదారిపై మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. షాద్నగర్ పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిర్వహించిన ధర్నాలో మాజీ ఎమ్మెల్యే వై. అంజయ్య యాదవ్ పాల్గొన్నారు. అన్ని చోట్లా బీఆర్ఎస్ శ్రేణులతోపాటు రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం దిగొచ్చి ఆంక్షలు లేకుండా రూ.2లక్షల రుణమాఫీని అమలు చేసేవరకు నిరసన కార్యక్రమాలను కొనసాగిస్తామని బీఆర్ఎస్ నేతలు స్పష్టం చేశారు.