సుల్తాన్బజార్, జనవరి 7: సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ప్రయాణికుల సౌకర్యార్థం ఈ యేడాది 4,233 అదనపు బస్సులను నడుపుతున్నట్లు రంగారెడ్డి రీజియన్ రీజనల్ మేనేజర్ ఏ శ్రీధర్ శనివారం తెలిపారు. ఎంజీబీఎస్లో సంక్రాంతి సందర్భంగా టీఎస్ఆర్టీసీ రాష్ట్రంతో పాటు అంతరాష్ట్ర బస్సులలో అదనపు చార్జీలకు మినహాయింపు ఇచ్చారు. సాధారణ రోజులలో ఉండే చార్జీలతోనే ఆర్టీసీలో సురక్షితమైన ప్రయాణాన్ని కొనసాగించ వచ్చని ఆయన చెప్పారు. ఈ నెల 7వ తేదీ నుంచి 14వ తేదీ వరకు రాష్ట్రంలోని అన్ని జిల్లాలతో పాటు ఇతర రాష్ర్టాలకు అదనపు బస్సులను నడపడానికి ప్రత్యేక ప్రణాళికలను రూపొందించామని వెల్లడించారు.
కమాండ్ కంట్రోల్ ఏర్పాటు..
పండుగకి గ్రామాలకు వెళ్లే ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఉండేందుకు గాను మహాత్మాగాంధీ బస్స్టేషన్లో మొట్టమొదటి సారి టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ సూచనల మేరకు కమాండ్ కంట్రోల్ను ఏర్పాటు చేశారు. ప్రయాణికులకు ఇబ్బందులు కలిగిన వెంటనే పరిష్కరించేందుకు గాను ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసేందుకు ఈ కమాండ్ కంట్రోల్ ఉపయోగపడుతుంది. ఏయే పాయింట్లలో రద్దీగా ఉంది..తదితర విషయాలను తెలసుసుకునేందుకు ప్రయాణికులు 995922 4911 నంబర్లో సంప్రదించి సమాచారాన్ని తెలుసుకోవచ్చని అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా కాలనీలలోని 20 మంది కంటే ఎక్కువగా ప్రయాణికులు ఉంటే స్థానిక డిపో మేనేజర్కు సమాచారం అందిస్తే వారి వద్దకే బస్సును పంపిస్తామన్నారు. ఆన్లైన్లో ప్రయాణికులు టికెట్ బుక్ చేసుకోవడానికి www.tsrtconline.in వెబ్సైట్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. అప్ అండ్ డౌన్ టికెట్లు ఒకేసారి బుక్ చేసుకునే ప్రయాణికులకు రిటర్న్ జర్నీలో పది శాతం రాయితీ పొందవచ్చని ఆర్టీసీ అధికారులు చెప్పారు. ఈ అవకాశానని సద్వినియోగం చేసుకోవాలన్నారు.