రంగారెడ్డి, జూన్ 30 (నమస్తే తెలంగాణ): ఏండ్ల తరబడిగా నిలిచిపోయిన ఉపా ధ్యాయుల బదిలీల్లో కదలిక రావడంతో రంగారెడ్డి జిల్లాలోని ఉపాధ్యాయుల్లో సంతోషం వ్యక్తమవుతుండగా.. బదిలీల ప్రక్రియ నిర్వహణపై మాత్రం వారిలో అసంతృప్తి వ్యక్తమవుతున్నది. కేవలం 8రోజుల్లోనే బదిలీల ప్రక్రియను పూర్తి చేసేలా షెడ్యూల్ను విడుదల చేయడంపై విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
వెబ్ఆప్షన్, ఎడిట్ ఆప్షన్, బదిలీ పోస్టింగ్లకు వ్యవధి ఇవ్వకుండా హడావిడిగా నిర్వహించనుండడంపై టీచర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఖాళీల వివరాలు, సీనియారిటీ వివరాలు ఎప్పటికప్పుడు మారుతుండడం.. కొన్ని పోస్టులను చూపించక బ్లాక్లో పెడుతున్నా రన్న ఆరోపణల నేపథ్యంలో పారదర్శకంగా నిర్వహించాలన్న డిమాండ్ ఉపాధ్యా యుల నుంచి వినిపిస్తున్నది. అలాగే.. షెడ్యూల్ తేదీని పొడిగించాలని ఉపా ధ్యాయులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
ఏండ్ల తరబడి ఎదురుచూపులకు తెర..
2018లో చివరిసారిగా ప్రభుత్వం బదిలీల ప్రక్రియను చేపట్టింది. ఆ తర్వాత కోర్టు కేసుల నేపథ్యంలో బదిలీలు ముందుకు సాగలేదు. తాజాగా హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో కాలయాపన చేయకుండా విద్యాశాఖ వెనువెంటనే బదిలీల ప్రక్రియను మొదలుపెట్టింది. జిల్లాలో ఎనిమిదేండ్లుగా స్థానచలనానికి నోచుకోని ఉపాధ్యాయు లు చాలామందే ఉన్నారు.
2018లో చేపట్టిన బదిలీల సందర్భంగా ఎనిమిదేండ్ల కటాఫ్ పూర్తికాక చాలామంది 2010, 2011 సంవత్సరం నుంచి పనిచేస్తున్న చాలా మంది టీచర్లు బదిలీకి నోచుకోలేకపోయారు. దీంతో వారంతా గత 13 ఏండ్లుగా ఒకేచోట విధులు నిర్వర్తిస్తున్నారు. ఇక భార్యాభర్తలు కూడా వేర్వేరు ప్రాంతాల్లో పనిచేస్తున్నారు. వీరంతా బదిలీల కోసం ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం తాజా గా.. షెడ్యూల్ విడుదల చేయడంతో ఏండ్ల నాటి వారి నిరీక్షణకు తెరపడనున్నది.
8 రోజుల్లో బదిలీలు ఎలా..
జిల్లాలో పోస్టులు లేకున్నా ఇతర జిల్లాలకు చెందిన టీచర్లు రంగారెడ్డికి బదిలీపై వచ్చి తిష్ట వేశారు. దీనివల్ల బదిలీలు, ఉద్యోగోన్నతుల్లో స్థానిక ఉపాధ్యాయులకు అన్యాయం జరుగుతుండడంతో వారిలో కొంతమంది కోర్టును ఆశ్రయించారు. దీనివల్ల ప్రభు త్వం ప్రతిసారీ రాష్ట్రవ్యాప్తంగా షెడ్యూల్ విడుదల చేసినా జిల్లాలో మాత్రం బదిలీల ప్రక్రియ నిలిచిపోతుండడం పరిపాటిగా మారుతున్నది.
కాంగ్రెస్ ప్రభుత్వం సైతం గత నెల 8న షెడ్యూల్ను విడుదల చేయగా..రంగారెడ్డి జిల్లాలో మాత్రం ఆ ప్రక్రియ నిలిచిపోయింది. అయితే ప్రభుత్వం తాత్కాలికంగా స్టేను వెకెట్ చేయించి రెండు రోజుల క్రితం హడావిడిగా షెడ్యూల్ను విడుదల చేసింది. ఇతర జిల్లాల్లో షెడ్యూల్ 20 రోజుల వరకు ఉండగా.. రంగారెడ్డి జిల్లాలో మాత్రం 8 రోజులే ఉండడంతో ఉపాధ్యాయుల్లో అసంతృప్తి వ్యక్తమవుతున్నది. 29న సీనియారిటీ జాబితాకు సం బంధించిన అభ్యంతరాల స్వీకరణకు అవకాశం ఇవ్వగా.. 30న ఫైనల్ సీనియర్ జాబితాను ప్రదర్శించడంతోపాటు వెబ్ ఆప్షన్లు, ఎడిట్ చేసుకునే చాన్స్ ఇచ్చారు.
అయితే ఒకేరోజు ఆప్షన్కు, ఎడిట్కు అవకాశం ఇచ్చి అదే రోజు రాత్రి పోస్టింగ్లు ఇస్తుండడంతో ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు. ఖాళీల వివరాలు, సీని యారిటీ లిస్ట్ క్షణక్షణానికి మారుతుండడం.. కొన్ని ఖాళీలను చూపించకుండా బ్లాక్లో పెట్టడం వల్ల అయోమయానికి గురి కావాల్సి వస్తున్నదని ఉపాధ్యాయులు వాపోతున్నారు. బదిలీల కోసం ఆప్షన్ పెట్టుకోవాల్సిన ఎస్జీటీలు 2000 మంది ఉండగా.. వారంతా ఒకే రోజున ఆప్షన్ ఎలా? పెట్టు కోగలుగుతారని టీచర్లు ప్రశ్ని స్తున్నారు. ఏ చిన్న తప్పిదం జరిగినా ఎనిమిదేండ్లపాటు ఇబ్బందులు పడాల్సి వస్తుందని పేర్కొంటున్నారు.
111 హెచ్ఎంల ఉద్యోగోన్నతులు పూర్తి..
జిల్లాలో బదిలీల కోసం 2000 మంది, పదోన్నతుల కోసం మరో 700 మంది ఉపాధ్యాయలు ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే హెచ్ఎంల ఉద్యోగోన్నతులకు సంబం ధించిన ప్రక్రియను అధికారులు పూర్తి చేశారు. జిల్లావ్యాప్తంగా 111 మంది స్కూల్ అసిస్టెంట్లకు హెచ్ఎంలుగా ఉద్యోగోన్నతి కల్పించారు. అయితే అనుకున్న పాఠశాల రాకపోవడంతో ఐదుగురు ఉపాధ్యాయులు ప్రమోషన్కు దూరంగా ఉన్నారు. రూ రల్ ప్రాంతాల్లో పనిచేసే ఉపాధ్యాయులకు ఏడాదికి 3 పాయింట్లుండగా, పట్టణ ప్రాంతాల్లో పనిచేసే వారికి ఏడాదికి 2 పాయింట్లు కలుస్తాయి.
కానీ..ప్రివరెన్షియల్ కేటగిరీకి మాత్రం వీరందరి కన్నా ముందు ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతుంది. ఇదే అదనుగా భావించిన కొందరు అడ్డదారుల్లో బెస్ట్ స్కూళ్లలో పోస్టింగ్ పొందేందుకు చర్యలను ముమ్మరం చేశారన్న టాక్ వినిపిస్తున్నది. అలాగే..రీలింక్విష్మెంట్ విధా నం అమలుపైనా ఉపాధ్యాయులు అనేక సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. తుది తీర్పు వచ్చేవరకు జిల్లాలో కోర్టుకెళ్లిన 40 పోస్టులను ఖాళీగా ఉంచి బదిలీలు, పదోన్నతుల ప్రక్రియను చేపట్టాలని హైకోర్టు స్పష్టం చేసింది.
పారదర్శకంగా బదిలీల ప్రక్రియ
జిల్లా విద్యాశాఖ వద్ద పూర్తి సమాచారం ఉన్నది. అందువల్ల 8 రోజుల షెడ్యూల్ తో ఎటువంటి ఇబ్బందులు ఉండవు. బదిలీలు, ఉద్యోగోన్నతుల ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నాం. కోర్టు ఆదేశాలకు అనుగుణంగా ప్రక్రియను చేపడుతున్నాం. ప్రివరెన్షియల్ కేటగిరీలో అక్రమాలపై ఎటువంటి ఫిర్యాదులు రాలేదు. అక్రమ పద్ధతిలో ఎవరైనా బదిలీలు పొందినట్లు మా దృష్టికి తెస్తే..వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.
-సుశీందర్రావు, రంగారెడ్డి డీఈవో