వికారాబాద్, జూలై 1 (నమస్తే తెలంగాణ): తమ భూమిని కబ్జా చేశారని.. న్యా యం చేయాలని డిమాండ్ చేస్తూ తాండూరు మండలంలోని అంతారం తండావాసులు సుమారు 50 మంది వినూత్న నిరసన తెలిపారు. చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు ఇంటిల్లిపాది సోమవారం కలెక్టరేట్ ఆవరణలో ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు బైఠాయించారు. పిల్లలతో కలిసి కలెక్టరేట్ ఆవరణలోనే వారు భోజనం చేసి నిరసన తెలపడం జిల్లా అంతటా చర్చనీయాంశంగా మారింది. ప్రజావాణి కార్యక్రమానికి 178 మంది ఫిర్యాదులను అందజేయగా, వాటిని సత్వరమే పరిష్కరించాలని వివిధ విభాగాల అధికారులను కలెక్టర్ ప్రతీక్జైన్ ఆదేశించారు. వచ్చిన ప్రతి ఒక్కరి సమస్యనూ కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.
ఏండ్లుగా సాగు చేసుకుంటున్న తమ పట్టా భూమిని ఇతరులు కబ్జా చేశారని.. న్యాయం చేయాలని తాండూరు మండలంలోని అంతారంతండాకు చెందిన తౌర్యానాయక్, హెర్యానాయక్ కుటుంబానికి చెందిన సుమారు 50మంది కుటుంబ సభ్యులు కలెక్టరేట్ ఆవరణలో ఉదయం నుంచి సాయంత్రం వరకు బైఠాయించి నిర సన తెలిపారు. తమ పేరుతో ధరణిలో సర్వేనంబర్ 136లో 9.14 ఎకరాల భూమి చూపుతున్నా కబ్జాదారులతో కలిసి పోలీసులు తమ భూమిలోకి వెళ్లనివ్వడంలేదని ఆరోపించారు. తమకు న్యాయం చేయాలని తహసీల్దార్, ఆర్డీవో, కలెక్టరేట్ల చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా ఫలితంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయా లని కలెక్టర్కు విజ్ఞప్తి చేశారు. న్యాయం జరిగే వరకు కలెక్టరేట్లోనే బైఠాయిస్తామని తమ గోడును మీడియాకు చెప్పుకొన్నారు. అయితే ఈ విషయమై జిల్లా అదనపు కలెక్టర్ లింగ్యానాయక్ను సంప్రదించగా.. అంతారంతండా భూసమస్య సివిల్ కోర్టు పరిధిలో ఉన్నదని, కోర్టు ఆదేశాల మేరకు వారు వ్యవహరించాలన్నారు.
భూ సమస్యలపై ఫిర్యాదుల వెల్లువ..
భూ సమస్యలపై ప్రజావాణికి ఫిర్యాదులు వెల్లువలా వస్తున్నాయి. ప్రతి సోమవారం ప్రజావాణికి వందల సంఖ్యలో భూసమస్యలను పరిష్కరించాలంటూ ధరణి దరఖాస్తులపై రైతులు ఫిర్యాదు చేస్తున్నారు. భూ సమస్యలపై తహసీల్దార్లు పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో రైతులు కలెక్టరేట్కు క్యూ కడుతున్నారు. అయితే ధరణి ఆపరేటర్లు చేసిన తప్పిదాలతో రైతులు ఇంకా కష్టాలు పడుతున్నారు. ధరణి దరఖాస్తుల్లో అధిక మొత్తంలో ఆర్ఎస్ఆర్, రైతులకు ఉన్న భూమి కంటే ఎక్కువ లేదా తక్కువ భూమి ఉన్నట్లు ధరణి ఆపరేటర్లు తప్పుగా ఎంట్రీ చేయడంతో ఆర్ఎస్ఆర్ సమస్య ఉత్పన్నమై.. దాని పరిష్కారానికి రైతులు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు.
పాత రికార్డుల ప్రకారం సంబంధిత సర్వేనంబర్లో ఏ రైతుకు ఎంత భూమి ఉందనే వివరాలను తెలుసుకొని ఆర్ఎస్ఆర్ సమస్యను పరిష్కరించొచ్చు.. కానీ, ధరణిలో ఎంట్రీ అయిన వివరాలను ప్రామాణికంగా తీసుకొని ఆర్ఎస్ఆర్ సమస్య పరిష్కారానికి ముందుకు వెళ్లడంపై విమర్శలు వస్తున్నాయి. అయితే ఓ రైతు పేరిట ఎక్కువ భూమి ఉన్నట్లు ధరణిలో ఎంట్రీ కావడంతో గుర్తించడం పెద్ద కష్టంగా మారడంతోపాటు సంబంధిత రైతు సహకరించకపోవడంతో ఆర్ఎస్ఆర్ సమస్య పరిష్కారానికి నోచుకోవడం లేదు. ఆర్ఎస్ఆర్ సమస్య పరిష్కారానికి ధరణి పోర్టల్లో ఆప్షన్ ఇవ్వాల్సిన అవసరం ఉందని రెవెన్యూ అధికారులు అభిప్రాయ పడుతున్నారు.
అంతేకాకుండా ధరణి ఆపరేటర్ల తప్పిదంతో పట్టా భూములూ అసైన్డ్, భూదాన్, వక్ఫ్ భూములుగా తప్పుగా ధరణిలో ఎంట్రీ కావడంతో ఏండ్లుగా ఆఫీసుల చుట్టూ రైతులు తిరుగుతున్నా పరిష్కారం కావడం లేదు. అసైన్డ్గా తప్పుగా ఎంట్రీ అయిన సంబంధిత భూమి..పట్టా భూమి అని తహసీల్దార్లు రిపోర్టు ఇచ్చి.. కలెక్టర్లు ఆమోదం తెలిపినా సీసీఎల్ఏ అధికారులు ఆ ఫైళ్లను పెండింగ్లోనే పెడుతున్నారు. సీసీఎల్ఏలో రిపోర్టు ఆధారంగా కాకుండా డబ్బులను పరిగణనలోకి తీసుకొని టీఎం-33 దరఖాస్తులను పరిష్కరిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. అంతేకాకుండా డిజిటల్ సైన్ దరఖాస్తులూ అధిక సంఖ్యలో పెండింగ్లో ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. జిల్లావ్యాప్తంగా దాదాపు 10 వేల వరకు ధరణి దరఖాస్తులు పెండింగ్లో ఉండడం గమనార్హం.
కలెక్టర్ స్పందించి పరిష్కరించాలి..
మా నాన్న పేరుపై పట్టా ఉండి ధరణిలో సర్వే నంబర్ 136లో 9.14 ఎకరాల భూమి ఉన్నది. గత 4,5 సంవత్సరాలుగా మా భూమిలో ఇతరులు కబ్జా చేశారు. మా భూమిలోకి మమ్మల్ని రానివ్వకుండా భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఈ విషయం కార్యాలయాల చుట్టూ ఎన్ని సార్లు తిరిగినా ప్రయోజనం లేకపోయింది. కుటుంబ సభ్యులం సద్ది కట్టుకుని వికారాబాద్ కలెక్టర్ కార్యాలయం ఎదుట బైఠాయించాం. ఈ సారి మా సమస్య తీరేవరకు కలెక్టరేట్ కార్యాలయం వద్దనే ఉంటాం.
– లక్ష్మణ్, భూ బాధితుడు,
తాండూరు
నా భూమిని ఇప్పించండి..
మర్పల్లి మండలం కొత్లాపూర్ గ్రామం. గత 10 సంవత్సరాలుగా భూ సమస్యల తో ఇబ్బందులు పడుతున్నా. నా పేరుపై 188/అ/1/1/2లో 15 గుంటల భూమి ఉన్నది. ఆ భూమి 10 ఏండ్ల కింద 14 గుంటల భూమి వేరే వారి పేరుపై పడగా, నా పేరుపై ఒక్క గుంటే ఉన్నది. కార్యాలయాల చుట్టు తిరిగినా పరిష్కారం కాలేదు. సర్వే చేసి నాకు రావాల్సిన భూమిని అప్పగించాలని కోరుతున్నా. నా సమస్యను కలెక్టర్కు విన్నవించుకుందామని ప్రజావాణి కార్యక్రమానికి వచ్చా. నా భూమి నాకు కావాలి.
– ఢిల్లీ బుచ్చయ్య, కొత్లాపూర్, మర్పల్లి