రంగారెడ్డి, జూలై 2 (నమస్తే తెలంగాణ) ; ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో చాలావరకు ఆవాసాలు ఆర్టీసీ సేవలకు నోచుకోవడం లేదు. మున్సిపాలిటీలు, మండలాలు, మేజర్ పంచాయతీలు మినహా.. అనేక గ్రామాలు, హ్యాబిటేషన్లకు బస్సు సౌకర్యమే లేదు. ఫలితంగా బడులకెళ్లే విద్యార్థులు కిలోమీటర్ల మేర నడుచుకుంటూ స్కూళ్లకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొన్నది. ఉదయం, సాయంత్రం సమయాల్లో బస్సు సౌకర్యం కల్పించాలని ఆర్టీసీ అధికారులను వేడుకున్నా.. ధర్నాలు, రాస్తారోకోలు చేపట్టినా ఫలితం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే చాలామంది విద్యార్థులు నడుచుకుంటూ బడులకు వెళ్తుండగా, మరికొందరు ఆటోలాంటి ప్రైవేట్ వాహనాల ను ఆశ్రయిస్తున్నారు. వాటిలో ఉదయం, సాయంత్రం సమయాల్లో వెళ్లి వచ్చినందు కు ప్రతి విద్యార్థికి ప్రతినెలా కనీసం రూ. వెయ్యి వరకు ఖర్చు అవుతుండడం పేద కుటుంబాలకు భారంగా మారింది. అయితే కొన్ని గ్రామాలకొక బస్సు ఉండడం కూ డా విద్యార్థులకు ఇబ్బందిగా మారింది. రూట్కు ఒక్క బస్సు మాత్రమే ఉండడంతో అందులో నిలబడేందుకు కూడా స్థలంలేక ఫుట్బోర్డు ప్రయాణం చేయాల్సిన దుస్థి తి నెలకొన్నది. కాగా వికారాబాద్ జిల్లాలోని 96 గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యమేలేదు.
రంగారెడ్డి జిల్లాలో నేటికీ చాలా గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యమే లేదు.. వికారాబాద్ జిల్లాలోని 96 గ్రామాలకు బస్సులే వెళ్లడం లేదు. దీంతో విద్యార్థులు చదువుకునేందుకు 5-6 కిలోమీటర్ల దూరంలో ఉన్న బడులకు కాలినడకనే వెళ్తున్నారు. కొన్ని గ్రామాలకు బస్సు సౌకర్యం ఉన్నా పాఠశాలల వేళల్లో లేకపోవడంతో ఆటోలను ఆశ్రయించాల్సిందే. ఇందుకుగాను ప్రతి విద్యార్థి ప్రతినెలా కనీసం రూ. వెయ్యి వరకు వెచ్చిస్తున్నారు. బస్పాస్లు ఉన్నా నామమాత్రంగానే మిగులుతున్నాయి. మారుమూల ఆవాసాలకు ఆర్టీసీ అధికారులు బస్సులను తగ్గించారు. దీంతో పాఠశాలలకు వెళ్లే విద్యార్థులకు సరిపడా బస్సులు ఉండడంలేదు. బస్సుల్లేక ప్రైవేట్ వాహనాల్లో బడులకెళ్లిన విద్యార్థులు ఇంటికొచ్చేవరకు తల్లిదండ్రులు ఆందోళనతో గడపాల్సి వస్తున్నది.
వికారాబాద్ జిల్లాలోని 96 గ్రామాలకు బస్సు సౌకర్యమే లేదు..
వికారాబాద్ జిల్లాలోని 96 గ్రామాలకు బస్సు సౌకర్యమే లేదు. పరిగి సెగ్మెంట్ పరిధి ..పరిగి మండలంలోని బర్కత్పల్లి, రుక్కుంపల్లి, యాబాజిగూడ, నారాయణపూర్, లక్ష్మీదేవిపల్లి, రంగంపల్లి, రూప్ఖాన్పేట, బసిరెడ్డిపల్లి.. దోమ మండలంలోని గంజిపల్లి, గుండాలతండా, లింగంపల్లి, బట్లచందరం, ఖమ్మంనాచారం, పోతిరెడ్డిపల్లి, శివారెడ్డిపల్లి, బొంపల్లి పెద్దతండా, మైలారం, మైలారంతండా.. కులకచర్ల మండలంలోని ఘనాపూర్, సాల్వేడ్, చెల్లాపూర్, అనంతసాగర్.. పూడూరు మండలంలోని కండ్లపల్లి, మీర్జాపూర్, ఎన్కెపల్లి, గొంగుపల్లి, తిర్మలాపూర్, కెరవెళ్లి గ్రామాలకు ఇప్పటికీ బస్సు సౌకర్యమే లేదు.
అదేవిధంగా వికారాబాద్ సెగ్మెంట్..వికారాబాద్ మండలంలోని ఎర్రవల్లి, పుల్మద్ది, కామారెడ్డిగూడ, పులుసుమామిడి, పీరంపల్లి, ద్యాచారం, ఐనాపూర్, సర్పన్పల్లి, కోటాలగూడ, నారాయణపూర్, పెండ్లిమడుగు.. నవాబుపేట మండలంలోని చిట్టిగిద్ద, దాతాపూర్, కేశవపల్లి, మూలమాడ, కరీంగూడ, అర్కతల, నాగిరెడ్డిపల్లి, తిమ్మారెడ్డిపల్లి, మాదారం గ్రామాలకు..ధారూరు మండలంలోని నాగ్సాన్పల్లి, కుమ్మరిపల్లి, ఎబ్బనూరు, ధర్మపూర్, కొండాపూర్ కుర్దు, అల్లీపూర్, నర్సాపూ ర్, కుక్కింద, అవుసుపల్లి, దోర్నాలతండా.. మర్పల్లి మండలంలోని కోట్మర్పల్లి, షాపూర్, తిమ్మాపూర్, రావులపల్లి, నర్సాపూర్, పిల్లిగిండ్ల, దార్గులపల్లి, రాంపూర్, కొంషెట్టిపల్లి గ్రామాలకు.. కొడంగల్ సెగ్మెంట్, దౌల్తాబాద్ మండలంలోని లొట్టిగుంటతండా, ర్యాలగుట్ట తండా, ఊరకుంటతండా..బొంరాస్పేట మండలంలోని లింగంపల్లి, ఎన్కెపల్లి , కొడంగల్ మండలంలోని చిన్ననందిగామ, ప్యాలమద్ది, పాతకొడంగల్, ఇందనూ రు, పడుగురాళ్లతండా, బోనమ్మతండా తాండూరు సెగ్మెంట్లోని ఖాంజాపూర్, వీరారెడ్డిపల్లి, గోనూర్, సిరిగిరిపేట్, అన్నసాగర్, బండమీదిపల్లి, రేలగడ్డతండా, విశ్వనాథపూర్, బమ్లానాయక్తండా, కంసాన్పల్లి, దుగ్గాపూర్, ఖానాపూర్, చైతన్యనగర్ గ్రామాలకు పల్లె వెలుగు బస్సు సౌకర్యం లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు.
రంగారెడ్డి జిల్లాలో పలుచోట్ల ఇదీ పరిస్థితి..
బస్సు సౌకర్యం కల్పించండి మహాప్రభో..
మా స్వగ్రామం గంజిపల్లి. నేను పరిగి పట్టణంలోని ఓ కళాశాలలో ఇంటర్ మొదటి ఏడాది చదువుతున్నా. మా గ్రామానికి బస్సు సౌకర్యం లేక 30 మందిమి ఐదు కిలోమీటర్ల దూరం ఉన్న గడిసింగాపూర్, రంగారెడ్డిపల్లి ప్రధాన రహదారికి నడుచుకుంటూ వెళ్లి అక్కడ బస్సు ఎక్కి పరిగి పట్టణానికి వెళ్లాలి. తిరిగి ఇంటికి నడుచుకుంటూ వస్తాం. ఆర్టీసీ అధికారులు స్పందించి బస్సు సౌకర్యాన్ని కల్పించాలి.
– జే ప్రవీణ్కుమార్, గంజిపల్లి, దోమ,వికారాబాద్ జిల్లా
పర్వేదకు నడిచి వెళ్లాల్సిందే..
మాది సంకేపల్లి. మా ఊరి నుంచి పర్వేద గ్రామంలో ఉన్న జడ్పీహెచ్ఎస్ వరకు సుమారు పది కిలోమీటర్ల దూరం ఉంటుంది. అక్కడికి బస్సు సౌకర్యం లేకపోవడంతో ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం సమయాల్లో నడుచుకుంటూ వెళ్లి రావాల్సిందే. వర్షాలు పడితే బడికి వెళ్లలేని పరిస్థితి ఉంటుంది. ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో ఆర్టీసీ బస్సులను నడపాలి.
– కీర్తన, టెన్త్ కాస్ల్, సంకేపల్లి, శంకర్పల్లి, రంగారెడ్డి జిల్లా
సకాలంలో బడికి వెళ్లలేకపోతున్నాం.
మా ఊరు మల్కీజ్గూడ.. అక్కడి నుంచి మేడిపల్లికి వెళ్లేందుకు సుమారు నాలుగు కిలోమీటర్ల దూరం ఉంటుంది. మేడిపల్లిలో ఉన్న ప్రభుత్వ పాఠశాలకు వెళ్లేందుకు ఆర్టీసీ బస్సులు అందుబాటులో లేకపోవడంతో ప్రతిరోజూ నాతోపాటు చాలా మంది విద్యార్థులం కాలినడకనే పాఠశాలకు వెళ్లి వస్తూ అలసిపోతున్నాం. ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత హోంవర్క్ సరిగ్గా చేయలేకపోతున్నాం. వర్షం పడితే పాఠశాలకు డుమ్మానే. సకాలంలో బడికి వెళ్లలేక చదువులో వెనుకబడిపోతున్నాం. ప్రభుత్వం స్పందించి ఉదయం, సాయంత్రం పాఠశాలల సమయాల్లో ఆర్టీసీ బస్సులు నడిచేలా చర్యలు తీసుకోవాలి.
-అర్చన, తొమ్మిదోతరగతి విద్యార్థిని, మల్కీజ్గూడ
నడిచి..నడిచి అలసిపోతున్నాం..
గ్రామీణ ప్రాంతాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. అగ్గనూరులోని జడ్పీహెచ్ఎస్లో చదువుతున్నాం. నిత్యం ఐదారు కిలోమీటర్ల దూరంలో ఉన్న జాతీయ రహదారి వరకు నడుచుకుంటూ వెళ్లి.. అక్కడ ఆర్టీసీ బస్సు ఎక్కి లక్ష్మీనారాయణపురం స్టేజీ వద్ద దిగుతాం. అక్కడి నుంచి మళ్లీ నడిచి అగ్గనూరులోని జడ్పీ హెచ్ఎస్కు చేరుకుంటాం. దీంతో ప్రతిరోజూ పది కిలోమీటర్లకుపైగా నడవాల్సి రావడంతో తొందరగా అలసిపోతున్నాం. ఇంటికి వచ్చాక చదివే ఓపిక ఉండడం లేదు. ప్రభుత్వం స్పందించి విద్యార్థుల కష్టాలు తీర్చేందుకు ఆర్టీసీ బస్సులను గ్రామీణ ప్రాంతాల్లో నడపాలి.
– వంశీకృష్ణ, తిమ్మాయిపల్లి/వినయ్ కుమార్, బండమీదిపల్లి, యాలాల