పరిగి, జూన్ 28 : మండలంలోని నస్కల్లోని కస్తూర్బాగాంధీ పాఠశాలకు చెందిన 25 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. వివరాలు ఇలా ఉన్నాయి.. గురువారం మధ్యాహ్నం ఐరన్ ఫోలిక్ యాసిడ్ మాత్రలు ఇచ్చారు. సాయంత్రం స్నాక్స్లో భాగంగా శనగలు ఇవ్వగా అనంతరం మాత్రలు వేసుకున్న వారిలో 25 మంది బాలికలకు కండ్లు తిరగడంతోపాటు వాంతులు చేసుకుని అస్వస్థతకు గురి కాగా, పరిగి సర్కారు దవాఖానకు తరలించారు. కేజీబీవీ పాఠశాలకు చెందిన ఏడుగురు తీవ్ర అస్వస్థతకు గురవడంతో చికిత్స అందజేశారు. వారితోపాటు 18 మంది అస్వస్థతకు గురి కాగా, పరిగి దవాఖానలో చికిత్స అందించారు.
అనంతరం వారిని గురువారం రాత్రి కేజీబీవీ పాఠశాలకు తీసుకెళ్లారు. వారిలో ఇరువురు పరిగి దవాఖానలో శుక్రవారం చికిత్స పొందారు. ఇదిలావుండగా శుక్రవారం సాయంత్రం మరోసారి ఆరుగురు బాలికలు అస్వస్థతకు గురవడంతో వారిని వెంటనే పరిగి దవాఖానకి తరలించారు. ఇదిలావుండగా ఐరన్ ఫోలిక్ యాసిడ్ మాత్రలు వేసుకోవడం వల్ల కొందరికి చిన్నపాటి సైడ్ఎఫెక్ట్ ఉంటుందని, ఎలాంటి ఇబ్బంది లేదని డీసీహెచ్ఎస్ డాక్టర్ ప్రదీప్ అన్నారు. ఒకరిద్దరికి అస్తమా ఉండడం వల్ల ఇబ్బంది కలిగిందని, పూర్తిస్థాయిలో వైద్యం అందించినట్లు తెలిపారు.
నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించిన వికారాబాద్ కలెక్టర్, ఎమ్మెల్యే
అస్వస్థతకు గురైన నస్కల్ కస్తూర్బాగాంధీ పాఠశాల విద్యార్థినులను శుక్రవారం వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్జైన్, పరిగి ఎమ్మెల్యే టి.రామ్మోహన్రెడ్డి, వికారాబాద్ ఆర్డీవో వాసుచంద్ర, జిల్లా విద్యాధికారి రేణుకాదేవిలు పరామర్శించారు. పరిగిలోని దవాఖానలో చికిత్స పొందుతున్న విద్యార్థినులను కలెక్టర్ ప్రతీక్జైన్ పరామర్శించి వారికి అందుతున్న చికిత్సపై డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ ఆసుపత్రిని సందర్శించిన సమయంలో కౌంటర్ వద్ద వైద్యం కోసం వచ్చిన వారు గుంపుగా ఉండడంతో కలెక్టర్ డాక్టర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిగి ఎమ్మెల్యే టి.రామ్మోహన్రెడ్డి కేజీబీవీ పాఠశాలను సందర్శించి అస్వస్థతకు గురైన విద్యార్థినులతో మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు విద్యార్థులకు భోజనం, శుభ్రతలో అలసత్వం వహిస్తే సస్పెండ్ చేస్తామని ఎమ్మెల్యే హెచ్చరించారు.