బీఆర్ఎస్ పాలనలో 24 గంటలూ నాణ్యమైన ఉచిత విద్యుత్తు, సకాలంలో పెట్టుబడి సాయం అందించడంతో రైతులు పంటల సాగును పండుగలా చేసుకున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రైతులకు కరెంట్ కష్టాలు మొదలయ్యాయి. అంతేకాదు ఇప్పటికీ పెట్టుబడి సాయం ఊసేలేదు. దీంతో సాగుకు డబ్బులు లేక, నిరంతర కరెంట్ లేక రైతులు నరకయాతన పడుతున్నారు. ఎడాపెడా కోతలు విధిస్తుండడంతో రైతులు పొలాల వద్ద విద్యుత్తు కోసం రేయింబవళ్లు పడిగాపులు కాస్తున్నారు. ఈ పరిస్థితి స్వరాష్ర్టానికి ముందు కాంగ్రెస్ హయాంలో ఉన్నది.
తెలంగాణ వచ్చినంక కేసీఆర్ ప్రత్యేక చొరవతో విద్యుత్ కొరతను అధిగమించి వ్యవసాయానికి నిరంతర నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేశారు. పదేండ్ల పాటు ఏ లోటూ లేకుండా వ్యవసాయం చేసుకున్న రైతులు.. ప్రస్తుత కాంగ్రెస్ సర్కార్లో మళ్లీ అనాటి అవస్థలు పడుతున్నారు. నాణ్యత లేని విద్యుత్తుతో కొన్ని చోట్ల మోటర్లు కాలిపోతున్నాయి. ఇది అన్నదాతలకు అదనపు భారంగా మారుతున్నది. ‘కేసీఆర్ పాలనలోనే అన్ని వసతులు ఉండే.. ఏ రంది లేకుండా ఏడాది మూడు పంటలు సాగు చేసేటోళ్లం.. కాంగ్రెస్ అసమర్థత పాలన మళ్లీ కష్టాల పాలు చేసింది. ఎప్పుడు వస్తుందో.. ఎప్పుడు పోతుందో తెలియన కరెంట్తో కంటిమీద కునుకు లేకుండా జాగారం చేయాల్సి వస్తుంది’ అని పలువురు రైతులు వాపోతున్నారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం మాదిరిగా ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలి. సమయానికి పెట్టుబడి సాయం అందించాలి. నిరంతర కరెంట్ ఇవ్వాలి. కక్షపూరిత పోకడలు మానుకొని రైతులకు మేలు చేయాలి.
– శంకర్, రైతు నందిగామ
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో విద్యుత్ కోతలకు తావుండేది కాదు. రెప్పపాటున కూడా కరెంట్ సరఫరా నిలిచి పోకుండా గత ప్రభుత్వం చర్యలు తీసుకున్నది. అసత్య ప్రచారాలలు, సాధ్యం కాని హామీలతో కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెనెక్కి చీటికిమాటికి కరెంట్ కోతలు విధిస్తున్నది. గతంలో లేని ఇబ్బందులు ఇప్పుడెందుకొస్తున్నాయో అర్థం కావడం లేదు.
– వీరాంజనేయులు, అంతారం గ్రామం, చేవెళ్ల మండలం
హస్తం పార్టీ అధికారంలోకి వచ్చినంక అస్తమానం విద్యుత్ కోతలు విధిస్తున్నది. ఎప్పుడు వస్తదో.. ఎప్పుడు పోతదో తెల్వని పరిస్థితి. గత కేసీఆర్ ప్రభుత్వంలో 24 గంటలు కరెంట్ సరఫరా ఉండేది. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో మాత్రం కరెంట్ పోకడనే ఉన్నది.. కాని వచ్చుడు లేదు. గంటల తరబడి సరఫరా నిలిచిపోతున్నది.
– నవీన్, అంతారం గ్రామం, చేవెళ్ల మండలం
పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో వ్యవసాయరంగం బాగుపడ్డది. 24 గంటలు కరెంట్ సరఫరా చేయడంతో, అవసరమైనప్పుడు పొలం పారబెట్టుకునే వాళ్లం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినంక కోతలు మొదలయ్యాయి. వ్యవసాయానికి కరెంట్ ఎప్పుడు వస్తుందో, పోతుందో తెలియకుండా ఉంది. కరెంట్ వచ్చిన వెంటనే రైతులందరూ ఒకేసారి మోటర్లు ఆన్ చేస్తే మోటర్లు కాలిపోయే పరిస్థితికి వచ్చింది.
– శ్రీనునాయక్, రైతు, కడ్తాల్ మండలం
కరెంట్ విషయంలో రాష్ట్రం రాక ముందు రోజులు మళ్లీ గుర్తుకొస్తున్నాయి. కేసీఆర్ పదేండ్ల పాలనలో రైతులకు ఏ లోటూ రానివ్వలేదు. కాంగ్రెస్ కక్షపూరితంగా వ్యవహరిస్తూ కేసీఆర్ను ఇబ్బందులు పెట్టాలని చూస్తున్నది. ఆయన వల్లనే నిరంతర ఉచిత కరెంట్ అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం కరెంటు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలుస్తలేదు. షాబాద్ మండలం నాగరగూడలో మా బంధువు రాత్రి పూట చేనుకు నీళ్లు పెట్టడానికి వెళ్లినప్పుడు పాము కాటు వేసింది. దానిని తలుచుకుంటే తెలంగాణ రాష్ట్రం రాక ముందు పాత రోజులు గుర్తుకొస్తున్నాయి. గత ప్రభుత్వం ఇచ్చినట్లుగా కరెంటు రైతులకు నాణ్యమైన కరెంట్ ఇస్తే బాగుంటుంది.
-బొర్ర భిక్షపతి, రైతు, సురంగల్, మొయినాబాద్
కాంగ్రెస్ అంటేనే రైతు వ్యతిరేకి అని మరోసారి నిరూపితమైంది. ఉమ్మడి రాష్ట్రంలో రైతులకు చుక్కలు చూపించిన కాంగ్రెస్ ప్రస్తుతం మళ్లీ అన్నదాతలను ఆగం చేస్తున్నది. సరిపడా కరెంట్ లేక, పెట్టుబడి సాయం అందక రైతులు బిక్కుబిక్కుమంటున్నారు. బీఆర్ఎస్ సర్కారు హయాంలో సకల సౌకర్యాలతో రైతులు దర్జాగా పంటలు సాగు చేసుకుంటే.. కాంగ్రెస్ పాలనలో రైతులు కూలీలుగా మారిపోయారు. కేసీఆర్ 24 గంటల ఉచిత నాణ్యమైన విద్యుత్తును అందిస్తే.. 8 గంటల కోతలు కరెంట్తో కాంగ్రెస్ కష్టాలు పెడుతున్నది.
-చంద్రశేఖర్రెడ్డి, లక్ష్మీనారాయణపూర్, యాలాల మండలం
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కరెంటు కష్టాలను రైతులు మరచిపోయారు. మళ్లీ ఆ కష్టాలను కాంగ్రెస్ గుర్తు చేస్తున్నది. కేసీఆర్ కృషితోనే విదుత్తు సమస్య తొలగి పోయింది. కాంగ్రెస్ రాకతో సమస్య మళ్లీ మొదటికి వచ్చింది. కేసీఆర్ వ్యవసాయాన్ని పండుగ చేస్తే.. కాంగ్రెస్ తన చేతగాని పాలనతో దండుగలా మార్చింది. కాంగ్రెస్ ఇకనైనా కక్షపూరిత ధోరణిని మార్చుకొని రైతుల అభ్యున్నతికి కృషి చేయాలి.
-రాములు, దౌలాపూర్, యాలాల మండలం