Telangana | ఊరించిన కాంగ్రెస్ పార్టీ కుర్చీలో కూర్చున్నాక ఖాళీ విస్తరాకు ముందేసి మోసం చేస్తున్నది. మరోసారి గద్దెనెక్కిన మోదీ ప్రభుత్వం పరీక్షల్లో పట్టపగలే చుక్కలు చూపిస్తూ హింసిస్తున్నది. దీంతో రాష్ట్రంతో రోదన, కేంద్రంతో వేదన చవిచూస్తున్న నవతరంలో.. నిరాశ నిప్పును రాజేస్తున్నది. తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి సర్కార్ గద్దెనెక్కిన ఆరు నెలల్లోనే నమ్మిన నిరుద్యోగులను ధర్నా చౌక్కు చేర్చింది. అలాగే నరేంద్ర మోదీ ప్రభుత్వం సైతం పట్టాభిషేక పూలమాలల సుగంధాలు ఉక్కిరిబిక్కిరి చేస్తుండగానే విద్యార్థి లోకాన్ని నడిరోడ్డుపై నిలబెట్టింది. వెరసి రాష్ట్ర, కేంద్రాల్లోని కాంగ్రెస్, కాషాయ సర్కారులు దేశవ్యాప్తంగా యువలోకంలో కల్లోలం కలిగించాయి. ఢిల్లీలో జంతర్ మంతర్, హైదరాబాద్లో ఇందిరా పార్క్లు ధర్నాల దండలు ధరించి న్యాయం కావాలని నినదిస్తున్నాయి. కోరి చేసుకున్నోడు ఎగిరెగిరి తంతుంటే ఎటుపోవాలో, ఎవరితో చెప్పుకోవాలో ఎరుగని దుఃఖం నవలోకానికొచ్చింది.
తెలంగాణ రాష్ట్రంలో అపోహల పొగ పెట్టి, అదిగో, అల్లదిగో ఆశల సౌధం అని నవతరాన్ని నిండా భావావేశంలో ముంచి ఓట్లన్నీ మలుపుకొన్నది కాంగ్రెస్ పార్టీ. అధికారంలోకి రాగానే రేవంత్ రెడ్డి సర్కార్ ‘లేస్తే మనిషిని కాననే’ నానుడిలా నానా హంగామా చేసింది. ఇంకా గమ్మత్తుగా ‘కలువలేనంత దూరంలో లేను, చేరుకోనంత దుర్భేద్యం కాను’ అనే భారీ ట్యాగ్లైన్ డైలాగ్ను వినిపించింది. కానీ ఆరు నెలల పాలన ఎంత చెంతకు చేరిందో అందరికీ, మరీ ముఖ్యంగా యువకులకు అర్థమైపోయింది. చూస్తున్నాం కదా… ముఖ్యమంత్రి ఇంటి ముందు మోకాళ్లపై గంటల పాటు కూర్చొని ‘ఎక్కడున్నావయ్యా స్వామి, మమ్ముల కరుణించవేమి’ అని ప్రాధేయపడాల్సిన దారుణ పరిస్థితి గురుకుల ఉపాధ్యాయ పరీక్షలు రాసిన నిరుద్యోగులకు వచ్చింది.
విడుదల చేసిన నోటిఫికేషన్లో మిగిలిన ఉద్యోగాలను, తర్వాతి వరుసలోని అర్హులైన వారితో భర్తీ చేయమని అభ్యర్థిస్తున్న వీరి గోడు, వినేవారు లేక అరణ్య రోదనగా మారింది. డైలాగులు, ఢిల్లీ ట్రిప్పులతో తప్ప, ప్రజల మధ్యలో పాదం మోపని ఫ్లైట్ మోడ్ గవర్నమెంట్ తెలంగాణ నిరుద్యోగులకు నరకాన్ని రుచి చూపిస్తున్నది. సీఎం కానరాక, సీఎంవోలో ఎవరున్నారో తెలియక, విద్యాశాఖకు పెద్ద దిక్కు లేక గురుకుల ఉపాధ్యాయ అభ్యర్థులు గుండెలు బాదుకుంటున్నారు. ప్రచారంలో ప్రజా పాలన, అనుభవంలో ప్రజలెరుగని పాలనగా పట్టపగలే చుక్కలు లెక్కబెట్టిస్తున్నది టోపీ పార్టీ ప్రభుత్వం. ‘కుమారి ఆంటీ సమస్య కనిపించిన మీకు వందలాది నిరుద్యోగుల కన్నీళ్లెందుకు కనిపించడం లేద’ంటూ గురుకుల ఉపాధ్యాయ అర్హత పరీక్ష రాసిన ఒక నిరుద్యోగ మహిళ ఆవేదనతో సూటిగా సీఎం రేవంత్ రెడ్డి తీరును తూర్పారబట్టింది. ఇలా మూగ, చెవిటి, గుడ్డి గుణాల గవర్నమెంట్ లక్షలాది మంది నిరుద్యోగుల మోచేతికి బెల్లం పెట్టి నాకమని చెప్పి తమాషా చూస్తున్నది.
ఒక్క గురుకులాల ఉపాధ్యాయ అభ్యర్థులే కాదు, గ్రూప్-1 ప్రిలిమ్స్ రాసిన వేలాదిమంది నిరుద్యోగులు న్యాయం కోసం నలుదిక్కులా నినదిస్తున్నారు. విపక్ష పార్టీగా ఉన్ననాడు అధికారంలోకి వస్తే 1:100 విధానంలో గ్రూప్-1 మెయిన్స్కు క్వాలిఫై చేస్తామని ఇచ్చిన హామీని అమలుపరచాలని చేతులు జోడించి వేడుకున్నా కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలకు కనికరం కలుగడం లేదు. ఇంత న్యాయమైన అభ్యర్థనలను, ఏ ఆర్థిక అదనపు భారం పడని డిమాండ్లను సైతం సానుకూల ధోరణితో పరిష్కరించే మానవీయ వైఖరి కూడా కాంగ్రెస్ పార్టీ పాలకులకు లేకపోవడం ఆవేదన కలిగించే అంశం. దీనికి తోడు గ్రూప్-2, గ్రూప్-3, గ్రూప్-4 నోటిఫికేషన్లలో ఖాళీల సంఖ్యను పెంచాలని నిరుద్యోగ లోకం గొంతెత్తి దిక్కులు పిక్కటిల్లేలా డిమాండ్ చేస్తున్నది.
కృష్ణుడికి మేనమామ గండంలా యువతరానికి రేవంత్ రెడ్డి సర్కార్ గండం పట్టుకున్నది. కోటి కలలతో కాంగ్రెస్కు పట్టంగట్టిన నవతరానికి, భూ లోకంలో యమలోకం సినిమా చూపిస్తున్నది హస్తం పార్టీ ప్రభుత్వం. న్యాయమైన, సాధారణ డిమాండ్లను సైతం జఠిలపరుస్తూ, యువజనాన్ని ఉద్యమాల వైపు నెడుతున్నారు. జాతరలా మారిన సచివాలయంలో పైరవీకారుల గుంపులకు తప్ప, ఫిర్యాదుదారులకు కుర్చీ ఇచ్చే నాథుడే కరువయ్యాడు. ‘విన్నపాలు వినవలే.. వోరి నాయనా.. మా కష్టాలు కనవలే కాంగ్రెసాయన’ అంటూ యువకులు భారీగా ప్రభుత్వ పెద్దల చుట్టూ తిరుగుతున్నారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం నోటిఫికేషన్లు జారీ చేసిన, దాదాపు భర్తీ ప్రక్రియ పూర్తిచేసిన లేదా భర్తీకి ఖాళీలు గుర్తించి సర్వం సిద్ధం చేసిన ఉద్యోగాల భర్తీనే సమస్యల్లోకి నెడుతుంటే.. ఇక ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగ ఖాళీల భర్తీ హామీ ఏ దరికి చేరునో నిరుద్యోగులకు అర్థమవ్వదా…? చిన్నతనంలో అమ్మ చందమామను చూపి గోరు ముద్దలు తినిపించేది, కానీ కాంగ్రెస్ పాలకులు చుక్కలు చూపించి నోటి కాడి ముద్దను లాగేశారు.
లక్షా అరవై వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసి, మరో అరవై వేలకు పైగా సర్కార్ కొలువుల రిక్రూట్మెంట్ ప్రక్రియను 90 శాతం పూర్తిచేసిన కేసీఆర్ సర్కార్పై నిందలేసి, గందరగోళం సృష్టించి, గులాబీ పార్టీకి యువలోకాన్ని ఎడం చేశారు. మరి అధికారంలోకి రాగానే నవతరానికి అందజేస్తామని నమ్మబలికిన వాటిలో ఎన్నింటిని ఇచ్చారు..?
కొత్తగా ఏవీ ఇవ్వక ఉక్కు సంకల్పాలను కంటనీరు పెట్టిస్తున్నారు కదా…?
మాయ ఫెస్టో లాంటి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోతో యువ తెలంగాణకు ఈస్ట్ మన్ కలర్స్ చూపించి, తీరా గద్దెనెక్కిన తర్వాత గోదారి చూపెట్టడం ఎంతటి అన్యాయం..? సరూర్నగర్ స్టేడియంలో గాంధీల చేతులమీదుగా యూత్ డిక్లరేషన్ విడుదల చేసి, చేతిలో చెయ్యేసి చేసిన బాసలన్నీ గుర్తున్నాయా..? మోసం చేస్తేనే జనం ఆదరిస్తారని ఏనాడో శలవిచ్చిన సీఎం రేవంత్ రెడ్డి నుంచి వాగ్దానాల అమలును ఆశించడం అవివేకమే. యూత్ డిక్లరేషన్లో అరచేతిలో వైకుంఠం చూపి, ముందుంది మంచికాలమని నమ్మించారు. సింహాసనంపై ఆసీనులవ్వగానే ముంచే కాలం అంటే ఎట్లుంటుందో అందరికీ అర్థం చేయిస్తున్నారు. ఎన్ని హామీలు…?, ఎన్నెన్ని వంచనా వలలు..? యువజనులను వ్యామోహంలో ముంచడానికి కాంగ్రెస్ పార్టీ శకుని పాచికలను తలదన్నే మాయోపాయాలన్నిటినీ వాడింది.
ఆ ఎత్తుగడలో భాగంగానే నిరుద్యోగులకు తలా ప్రతీనెలా రూ.4,000 అందజేస్తామని నమ్మబలకడమే కాక ఉద్యోగ ఖాళీల భర్తీ తేదీలను సైతం ముందే ప్రకటించింది. రెండు లక్షల ఖాళీల భర్తీ, వర్సిటీలకు నిధులు, విద్యార్థినులకు స్కూటీలు ఇలా ఎన్నో హామీలు ఇచ్చి అధికార పీఠాన్ని అలంకరించింది కాంగ్రెస్ పార్టీ. కానీ, ఆరు నెలలు ముగిసినా ఆ హామీల అమలు దిశగా ఒక్క అడుగూ పడిందే లేదు. 37 మంది కార్పొరేషన్ చైర్మన్ నియామకాల పేర్లు సీఎం కార్యాలయం నుంచి విడుదలై అరవై రోజులు ముగిసినా, సంబంధిత నియామకాల అధికారిక జీవోలే విడుదల చేయలేని అసమర్థత రేవంత్ రెడ్డి సర్కార్ది. నామినేటెడ్ పోస్టుల నియామకంలోనే కిందమీద పడుతున్న ప్రభుత్వ పెద్దలు, లక్షలాది ఉద్యోగ నియామకాలను సమర్థవంతంగా భర్తీ చేయగలరని ఎవరైనా నమ్మగలరా..? ప్రతిపక్షంలో ఉండగా పెంచుకున్న ‘ప్రశ్నించే చిలుకలు’ కొన్ని రేవంత్ పంజరంలోనే సేదతీరుతూ, కుర్చీ కలలు కంటున్నాయి.
నిరుద్యోగుల కోసమే తమ పోరాటమని ప్రగల్భాలు పలికిన కొందరు కుహనా మేధావులకు ధర్నాచౌక్లోని నినాదాలు వినపడటమే లేదు. వెరసి కూసే గాడిదలొచ్చి, మేసే ఆవు దూడలను చెడగొట్టినట్లుగా తెలంగాణ యువతతో కొందరు చెలగాటమాడారు. దీని ఫలితంగా నేడు ఒకవైపు కొలువుల కోసం కొట్లాట జరుగుతుండగా.. మరోవైపు ప్రైవేట్ కంపెనీలూ పక్క రాష్ర్టాలకు తరలిపోతున్నాయి. రియల్ ఎస్టేట్ రంగం కూడా అమరావతిపై ఆశపడుతూ, అటువైపే అడుగులు వేస్తున్నది. మొత్తంగా రేవంత్ రెడ్డి సర్కార్తో ‘న ఘర్కా న ఘాట్కా’ అన్నట్లయింది. ఏడాదిలోపే యువతరం గుండెలపై తన్నిన ఘన చరిత్రను కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం లిఖించుకున్నది. తండ్లాడుతున్న తెలంగాణ నవతరానికి నీడగా నిలబడే నాథుడే సర్కార్లో కరువైపోయాడు. ఇప్పుడు కాంగ్రెస్ చేతిలో నమ్మక ద్రోహానికి గురై, తిరగబడిన యువ తెలంగాణ ఉద్యమిస్తున్నది. బీఆర్ఎస్ పార్టీతో పాటు బుద్ధిజీవులందరూ మండుతున్న నవలోకానికి అండగా నిలబడితీరుతారు.
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన ఇలా యువతరాన్ని నిప్పుల కుంపటిలోకి తోసేస్తే, జాతీయ స్థాయిలో మోదీ సర్కార్ సైతం లక్షలాది మంది విద్యార్థులు, వారి కుటుంబాల ఆకాంక్షలకు అగ్గి పెట్టింది.
23 లక్షల మంది నీట్ విద్యార్థులు, 9 లక్షల మంది నెట్ విద్యార్థులతో పాటు వారి కుటుంబాలు సైతం రోడ్లపైకొచ్చి న్యాయం కోసం పోరాడుతున్నాయి. అగ్నిపథ్కు మించిన అవలక్షణం జాతీయస్థాయి పరీక్షల నిర్వహణలో బయటపడటంతో యావత్ దేశం ఉలిక్కిపడింది. మోదీ సర్కార్ ఘనంగా మొదలుపెట్టిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ.. విద్యార్థులు, యువకుల పాలిట నేషనల్ ట్రబులింగ్ ఏజెన్సీగా మారి వారి జీవితాలతో ఆటలాడుతున్నది. ‘మన్ కీ బాత్’ ప్రోగ్రాంలో చివరికి పరీక్షల మెలకువలనూ బోధిస్తూ, ప్రధాని ప్రచారానికి కాదేదీ అనర్హం అని చాటిచెప్పిన నరేంద్ర మోదీకి నీట్, నెట్ ఉదంతాలపై మాట్లాడేందుకు తీరికలేకుండా పోయింది.
పోనీ, సౌండ్ ఇంజినీరింగ్లో డాక్టరేట్ పట్టా పొందిన సంజయ్, అరవింద్, రఘునందన్ లాంటి కమలం పార్టీ నేతలైన రాష్ట్ర, జాతీయ స్థాయిలో యువకులకష్టాలపై నోరారేసుకుంటారనుకుంటే, వారి గొంతులో కూడా భాస్వరం కాస్తా పాయసమై పోయింది. అంతిమంగా నమ్మితిరా సిద్ధా అంటే గుద్దితిరా సిద్ధా అన్నట్టుగా.. వెన్నుపోటుకు గురైన యువత రాష్ట్రంతో పాటు దేశమంతటా పోరు దారిలో హోరై పోయారు. యువలోకంలో రగిలిన ఈ కల్లోలం ఆగనే ఆగదు. రేవంత్ రెడ్డి సర్కార్ హామీలను అమలుచేయనేలేదు, నవతరం ఆగ్రహ జ్వాలలను తప్పించుకోనూలేదు. మోదీ, రేవంత్ సర్కార్ల ప్రయాణం పాతాళంలోకి వేగంగా సాగిపోతుంది. ఈ రెండు సర్కార్ల అంతిమ గమ్యం ఊహించజాలనిదేం కాదు గదా…?
– (వ్యాసకర్త: రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ మాజీ చైర్మన్)
– డాక్టర్ ఆంజనేయ గౌడ్