దశాబ్దాలు గడుస్తున్నాయే గానీ నేతన్నల దశ మాత్రం మారడం లేదు. వారి బతుకు వాకిట్లోకి తొంగిచూస్తే ఎన్నో దైన్యపు చూపులు కనిపిస్తున్నాయి. చితికిన బతుకు చిత్రాలు దర్శనమిస్తున్నాయి. నేతన్నల కుటుంబాల ముఖాల్లో ఇంకిపోయిన కన్నీటి చారల విషాద ఛాయలు కనిపిస్తున్నాయి. స్థూలంగా చెప్పాలంటే కార్మిక క్షేత్రమైన సిరిసిల్ల ముఖచిత్రం ప్రస్తుతం బోసిపోయింది. సిరిసిల్లలోనే ఎందుకిలా? అనే ప్రశ్నలు అందరి మెదళ్లను మళ్లీ తొలిచేస్తున్నాయి. ఈ పరిస్థితిని అర్థం చేసుకోవాలంటే.. ఒక్కసారి 1997-2001ల మధ్యకాలంలోకి వెళ్లాలి. అప్పుడుగాని సిరిసిల్ల నేతన్నల జీవితాలు, వారి కుటుంబాల్లో విషాద గీతికల మరణ మృదంగాలు అర్థం కావు.
విద్యుత్ సబ్సిడీ ద్వారా ఎంతో ప్రయోజనం పొందిన సిరిసిల్ల మరమగ్గానికి 10 హెచ్పీల నిబంధన గొడ్డలిపెట్టులా మారింది. ఈ నిబంధన కారణంగా పరిశ్రమ ఉనికికే ప్రమాదం ఏర్పడింది. అంతేకాకుండా యజమానులు పాత ఉత్పత్తుల వైపు మళ్లినా.. ఆసాములు, కార్మికులు మాత్రం ఏం చేయాలో దిక్కుతోచక కొట్టుమిట్టాడుతున్నారు. సాంచాల పనే తెలిసిన కార్మికులు వేరే పనికి వెళ్లలేని పరిస్థితి తలెత్తింది. ఆర్థిక సమస్యలు చుట్టుముట్టడంతో కార్మికులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
సిరిసిల్ల మరమగ్గాల పరిశ్రమ 60వ వసంతంలోకి అడుగు పెట్టబోతుండగా దేశ యవనికపై మరోసారి విషాద బిందువుగా సిరిసిల్ల నిలువబోతున్నది. ఇటీవల జరిగిన నేత కార్మికుల బలవన్మరణాలు ఈ విషయాన్నే తేటతెల్లం చేస్తున్నాయి. సిరిసిల్ల మరమగ్గాల పరిశ్రమ చరిత్ర సమస్తం ఒడుదొడుకులమయమే. సొంత పెట్టుబడులతో మూడంచెల వ్యవస్థగా నడుస్తున్న సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ ఆరు నెలలు మాంద్యం, ఆర్నెళ్లు గిరాకీతో నెట్టుకొస్తున్నది. అయితే గత మూడు దశాబ్దాల్లో నాలుగు అతి భారీ సంక్షోభాలను పరిశ్రమ చూడటం గమనార్హం.
ఉమ్మడి రాష్ట్రంలో మరమగ్గాలు అత్యధికంగా ఉన్న ప్రాంతం సిరిసిల్ల. ఆ తర్వాతి స్థానం చిత్తూరు జిల్లా నగరిది. మహారాష్ట్రలోని పవర్లూం పారిశ్రామిక కేంద్రాల ప్రభావంతో సిరిసిల్లలోనూ కుటీర పరిశ్రమగా పవర్లూం పరిశ్రమ ఎదిగింది. దేశవ్యాప్తంగా పవర్లూం పరిశ్రమ 80 శాతం వరకు అసంఘటిత రంగం ఆధ్వర్యంలోనే నడుస్తున్నది. అయితే నగరితో పోలిస్తే సిరిసిల్లలో తొలినాళ్ల నుంచి మార్కెటింగ్ సౌకర్యాలు లేకపోవడంతో వస్త్ర ఉత్పత్తిదారులు దూరప్రాంతాల్లోని దళారుల ద్వారా తమ ఉత్పత్తులను విక్రయిస్తున్నారు.
స్టెపల్, కాటన్, టెక్సో ముతక రకం వస్త్ర ఉత్పత్తులకు నిలయంగా పేరొందిన సిరిసిల్ల అద్దకం పరిశ్రమ పెట్టీకోట్ల భారీ విక్రయాలకు చిరునామాగా మారి ఏండ్ల తరబడి మరమగ్గాలను బతికించింది. టెక్సో ఉత్పత్తులు ప్రారంభమయ్యాక సిరిసిల్లలో వస్త్ర ఉత్పత్తుల్లో మౌలిక మార్పు వచ్చింది. ఈ క్రమంలో 80వ దశకంలో వస్త్ర ఉత్పత్తిదారుల్లో కొందరు దివాలా తీయడంతో బలవన్మరణాలకు పాల్పడ్డారు. అలా.. సిరిసిల్లలో విషాద మరణాల పర్వం ఆరంభమైంది. హుండీల వ్యవస్థ, వస్త్ర ఉత్పత్తుల విక్రయాలలో అవాంఛిత పోటీతత్వం కారణంగా ఆత్మహత్యలు కొనసాగుతూ వచ్చాయి. 1997 వరకు ఇదే తంతు కొనసాగింది. 2001లో ఓ నేత కార్మికుడు మరణించగా.. 1997 నుంచి 2001 వరకు 156 మంది బలవన్మరణాలకు పాల్పడ్డారు. అయితే 2001లో రాజీవనగర్లో కొండ కిష్టయ్య కుటుంబం సామూహిక ఆత్మహత్యకు పాల్పడటంతో.. ఆ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. మీడియా ద్వారా ఆ విషాద ఘటన విస్తృతంగా ప్రచారం కావడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టి మొదటిసారిగా సిరిసిల్లపై పడింది.
నాటి కేంద్ర మంత్రి విద్యాసాగర్రావు చొరవ, వాజపేయి సర్కార్ తీవ్ర ఒత్తిడితో అప్పటి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పలు చర్యలు చేపట్టాల్సి వచ్చింది. పవర్లూంలకు సగం విద్యుత్తు సబ్సిడీ, బద్దెనపల్లిలో టెక్స్టైల్ పార్క్, నూలు డిపో తదితర నిర్ణయాలను నాటి సర్కార్ తీసుకున్నది. విద్యుత్తు రాయితీ వల్ల ఎంతో ప్రయోజనం చేకూరింది. రెండు జతల సాంచెలున్న ఆసామి కుటుంబం.. మూడు, నాలుగేండ్లలోనే ఆరు జతల ఆసామిగా ఎదిగింది. ఆ తర్వాత 2004లో వైఎస్సార్ అధికారంలోకి రాగా.. 2006, 2008లో మళ్లీ నేతన్నల మరణ మృదంగం చోటుచేసుకోవడంతో సిరిసిల్ల ప్యాకేజీ, 2,500 ఇండ్ల స్థలాలను వైఎస్సార్ ఇచ్చారు. నేతన్నల కుటుంబాల్లోని మహిళలకు పావలా వడ్డీకే రుణాలతో పాటు ఇతర సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడంతో సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలో చాలా మార్పులు వచ్చాయి.
2009-10 వరకు సిరిసిల్లలో పవర్లూంల సంఖ్య 21 వేలకు పెరిగింది. వలసలు దాదాపుగా నిలిచిపోయాయి. మహారాష్ట్ర, గుజరాత్లకు చెందిన పరిశ్రమ దృష్టి సిరిసిల్లపై పడింది. ఆ తర్వాత 2014లో తెలంగాణ రాష్ట్రం సిద్ధించాక సీఎం కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన పథకాలు, 2017 నుంచి సిరిసిల్ల మరమగ్గానికి ఆర్వీఎం, కేసీఆర్ కిట్, బతుకమ్మ చీరల తయారీ ఆర్డర్లతో కార్మికులకు బతుకుల్లో వెలుగులు నిండాయి. సిరిసిల్లను దేశంలోనే అగ్రపథాన నిలిపిన కేసీఆర్ సర్కార్ అందరి దృష్టిని ఆకర్షించింది. సిరిసిల్లలో పవర్లూంలకు ప్రభుత్వమే ఆర్డర్లు ఇవ్వాలన్న దశాబ్దాల డిమాండ్ నెరవేరింది. అంతేకాకుండా, సిరిసిల్ల మరమగ్గాల పరిశ్రమ విస్తృతికి తీసుకున్న చర్యలు, అప్పారెల్ను అభివృద్ధి చేయడం లాంటివన్నీ సిరిసిల్ల అభివృద్ధికి ఎంతగానో దోహదపడ్డాయి. దేశంలో అన్ని టెక్స్టైల్ కేంద్రాల్లో ఉన్నట్టుగానే సిరిసిల్లలోనూ పవర్లూం సెక్టార్ మూడంచెల విధానంలోనే ఉన్నది. మాస్టర్ వీవర్ అంటే పెట్టుబడి పెట్టే యజమాని, ఆసామి అనే జాబ్ వర్కర్, వీవర్ అనే కార్మికుడు ఉండే ఈ వ్యవస్థలో మాస్టర్ వీవర్పై విమర్శలున్నాయి. మాక్స్ సొసైటీలు, ఎస్ఎస్ఐ యూనిట్లకు ప్రభుత్వ ఆర్డర్లు ఇచ్చింది. అయితే వీటన్నింటినీ మాస్టర్ వీవర్లే అజమాయిషీ చేస్తున్నారన్న ఆరోపణలు రావడంతో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రాగానే బతుకమ్మ చీరల ఆర్డర్లను నిలిపేసింది. దీంతో పాత బకాయిల చెల్లింపు సమస్యగా మారింది.
బతుకమ్మ చీరల ఆర్డర్ల కారణంగా ఆ ఉత్పత్తుల తయారీకి అలవాటు పడిపోయిన మాస్టర్ వీవర్లు బయటి మార్కెట్పై దృష్టి సారించలేదు. ప్రభుత్వం ఆర్డర్లు ఇస్తుందిలే అనే ధీమాతో సొంత ఆలోచన, దూరదృష్టి, ఉత్పత్తుల మార్పు వైపు వారు దృష్టి సారించలేదు. మాస్టర్ వీవర్లు చేతులెత్తేయడంతో జాబ్వర్క్ ద్వారా వస్ర్తాలు తయారు చేసే ఆసాముల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. దీంతో నేడు సిరిసిల్లలో మరమగ్గాలను తూకం కింద అమ్మేయాల్సిన దుస్థితి నెలకొంది. ఫలితంగా 30 వేల మరమగ్గాలు ఉన్న సిరిసిల్లలో సుమారుగా 20 శాతానికి పైగా తూకం కింద అమ్మేసినట్టు పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
మరోవైపు కుటీర పరిశ్రమగా దశాబ్దాలుగా కొనసాగుతూ, విద్యుత్ సబ్సిడీ ద్వారా ఎంతో ప్రయోజనం పొందిన సిరిసిల్ల మరమగ్గానికి 10 హెచ్పీల నిబంధన గొడ్డలిపెట్టులా మారింది. ఈ నిబంధన కారణంగా పరిశ్రమ ఉనికికే ప్రమాదం ఏర్పడింది. అంతేకాకుండా యజమానులు పాత ఉత్పత్తుల వైపు మళ్లినా.. ఆసాములు, కార్మికులు మాత్రం ఏం చేయాలో దిక్కుతోచక కొట్టుమిట్టాడుతున్నారు. సాంచాల పనే తెలిసిన కార్మికులు వేరే పనికి వెళ్లలేని పరిస్థితి తలెత్తింది. ఆర్థిక సమస్యలు చుట్టుముట్టడంతో కార్మికులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. కార్మికుల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని గత దశాబ్ద కాలంలో కేసీఆర్ సర్కార్ తీసుకున్న చర్యలను, అందించిన చేయూతను ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం పరిశీలించాలి. ముఖ్యంగా టెక్సో ఉత్పత్తులతో జరిగిన ప్రయోజనాన్ని, ప్రభుత్వ ఆర్డర్లతో మరమగ్గానికి, తద్వారా నేతన్నకు అందిన చేయూతను పరిగణనలోకి తీసుకోవాలి. ముఖ్యంగా ప్రతి పవర్లూంకు పని అందేవిధంగా, తద్వారా పరిశ్రమలోని మూడంచెలకు సంబంధించిన ప్రతివారు లబ్ధి పొందేలా చూడాల్సి ఉన్నది. ఇందుకోసం రాజకీయాలకతీతంగా అందరి అభిప్రాయాలను తీసుకోవాలి. సిరిసిల్ల పవర్లూం పరిశ్రమ ఎదుగుదల కోసం ఓ విధానాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. తద్వారా ఉరిసిల్లగా మారుతున్న సిరిసిల్లను సిరులసిల్లగా మార్చాలి.
(వ్యాసకర్త: సీనియర్ ఫ్రీలాన్స్ జర్నలిస్ట్)
-మచ్చ ఆనంద్
98665 50819