తెలంగాణ మలివిడత ఉద్యమంలో ఆటాపాటా తీసుకొచ్చిన చైతన్యం అంతాఇంతా కాదు. పాట లేకుండా తెలంగాణ ఉద్యమమే లేదు. అయితే ఆ ఉద్యమానికే గొంతుకగా నిలిచిందో స్వరం. తెలంగాణ పల్లెలను ఏకం చేసి ఉద్యమం వైపు మళ్లించిన ‘ధూం ధాం’లో గర్జించిందీ ఆ స్వరమే. పదునైన ఆ కంఠం ఓ ఉప్పెనగా మారి పరమశివున్నే ప్రశ్నించింది. గజ్జె కట్టి ఆడిపాడి.. ఢిల్లీ పీఠాన్నే కదిలించింది. ఆ స్వరం ఎవరిదో కాదు, మలి దశ ఉద్యమంలో నాలుగున్నర కోట్ల ప్రజల్లో ఉద్యమ కాంక్షను రగిలించిన సాయిచంద్ది.
విద్యార్థి ఉద్యమమైనా, సామాజిక చైతన్య వేదిక అయినా, మలి దశ ఉద్యమమైనా.. వేదిక ఏదైనా సరే పాటే సాయిచంద్ ఆయుధం. ఆయన పాటందుకుంటే ప్రత్యర్థుల గుండెల్లో ప్రశ్నల సునామీ పుట్టేది. ‘మేం చెప్పులు కుట్టనిదే మీ కాలు బయటకెళ్లదు.. మా డప్పులు లేనిది మీ శవం కాటికెళ్లదు.. ఎవ్వడు జెప్పిండుర మేం తక్కువ జాతోల్లం అని’ అంటూ సమాజంలో జరుగుతున్న దురాచారాలపై ఆయుధం ఎక్కుపెట్టిన సాయిచంద్ సామాజిక చైతన్యాన్ని రగిలించారు. అంతేకాదు, ‘రాతిబొమ్మల్లోన కొలువైన శివుడా రక్తబంధం విలువ నీకు తెలవదురా’ అంటూ నాడు ఉద్యమంలో ఆయన పాడిన పాట యావత్ తెలంగాణను ఉద్యమం దిశగా నడిపించింది. నాడు ఉద్యమ రథసారథి కేసీఆర్ ఎక్కడికెళ్లినా అక్కడికి సాయిచంద్ వెళ్లేవారు. ధూం ధాంలో కాలికి గజ్జె కట్టి ఆడిపాడే సాయిచంద్ అందరిలో తన ఆటపాటతో ఉద్యమ కాంక్షను రగిలించేవారు. అతడు పాట పాడితే సబ్బండవర్గాలు లయబద్ధంగా ఆడేవి. అతడు గజ్జె కట్టి ఆడితే ముల్లోకాలు ఊగేవి. అతడి గొంతులో అంతటి మాధుర్యం ఉండేది. అతని ఆటలో ఎంతటి మహత్తు ఉందో తెలియదు కానీ, ఊరూవాడా సయ్యాటలాడేవి. ధూం ధాం, అలయ్ బలయ్.. వేదిక ఏదైనా ఉండనీ, అక్కడ సాయిచంద్ ఉండాల్సిందే.
తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని తనదైన శైలిలో పాట ద్వారా ప్రజలకు చాటిచెప్పిన సాయిచంద్.. తెలంగాణ ఎందుకు రావాలో ఘంటాపథంగా వివరించేవారు. అసలు ఒక్క మాటలో చెప్పాలంటే నాటి ఉద్యమానికి పాటలతో ఊపిరులూదారు. తెలంగాణ సమాజాన్ని జాగృతపరిచారు. మహోన్నతమైన బాధ్యతను తలకెత్తుకొని గానమై గర్జించారు.
ఉమ్మడి పాలనలో ఎద నిండా వ్యథలతో కునారిల్లిన పాలమూరు గడ్డపై జన్మించిన సాయిచంద్ స్వరం తెలంగాణకే శ్వాసగా మారి ఎంతో మందిలో ఆత్మవిశ్వాసాన్ని నింపింది. చిన్నతనం నుంచే అభ్యుదయ భావాలను అలవరుచుకున్న ఆయన సమాజానికి గళంగా మారారు. నిత్యం చైతన్యంతో తొణికిసలాడే ఆయన పాట అనేక మందికి భరోసా ఇచ్చింది. ప్రత్యేక రాష్ట్రంతోనే తన గడ్డకు విముక్తి లభిస్తుందని సాయిచంద్ భావించారు.స్వరాష్ట్రంలో, స్వయం పాలనలోనే తమ బతుకులు బాగుపడతాయని నమ్మిన ఆయన తన గొంతును ఉద్యమానికి అరువిచ్చారు. అందుకే మలిదశ ఉద్యమంలో ఆయన గొంతు.. నాలుగున్నర కోట్ల ప్రజల్లో ఆలోచనలను రేకెత్తించింది. సాయిచంద్ పాటలు ఎంత గొప్పగా ఉంటాయో.. ఆయన మాటలు కూడా అంతే గొప్పగా ఉంటాయి.
ఉద్యమంలో వివిధ కళారూపాల్లో స్వరాష్ట్ర కాంక్షను ప్రజలకు అర్థమయ్యేలా చెప్పడంలో తనకు తానే సాటి. తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని ఆటాపాటా, కళారూపాల ద్వారా చాటిచెప్తూ ఉద్యమాన్ని కొత్త పంథాలో తీసుకెళ్తున్న సాయిచంద్ను ఉద్యమ నాయకుడు కేసీఆర్ స్వయంగా అభినందించారు. మలిదశ ఉద్యమంలో సాయిచంద్ గొంతే ఓ ఉద్యమం. కేసీఆర్ సభలైనా, ఇతర కార్యక్రమాలైనా ఆయన వేదికపై ఉంటే చాలు సభ మొత్తం ఉర్రూతలూగేది. తెలంగాణలో అలుముకున్న చీకట్లను తరిమేందుకు నిస్వార్థంగా కేసీఆర్ అడుగుజాడల్లో నడుస్తూ ఆయన చేసిన కృషి ఎనలేనిది. తెలంగాణ సమాజం ఎప్పటికీ మరవలేనిది.
పేద కుటుంబంలో పుట్టిన సాయిచంద్ చిన్నతనం నుంచే సమాజం హితం కోసం పాటుపడేవారు. సమాజాభివృద్ధికి తనవంతు సాయం చేయాలని పరితపించేవారు. అందుకే నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షే తన ఆకాంక్షగా మార్చుకొని ఆయన ఉద్యమ సమరంలో దూకారు. ఉద్యమ నాయకుడి అడుగుజాడల్లో నడిచారు.
దేవతలే పరవశించే మధురమైన ఆయన గొంతు మూగబోయింది. ఆ శివుడినే ప్రశ్నించినందుకో, ఏమో గానీ చిన్న వయసులోనే ఆయన మనకు
దూరమైపోయారు. సాయిచంద్ భౌతికంగా మనకు దూరమైనా.. తన పాటల రూపంలో ఆయన ఎప్పటికీ మన మధ్యలోనే ఉంటారు. ఆయన పాటలకు మరణమే లేదు.
అంబేద్కర్ ఆశయాలు, మహనీయుల మార్గాన్ని అనుసరిస్తూ.. తెలంగాణ సమాజంలో జరుగుతున్న దోపిడీ, కుట్రలను నిరసిస్తూ ఎలుగెత్తి పాడిన ఆయన గళం ఓ నిప్పుకణిక. అది ఎన్నటికీ ఆరని జ్వాల. ఆయన మరణం బీఆర్ఎస్తో పాటు తెలంగాణ సమాజానికి తీరని లోటు. సాయిచంద్ పాటల్లోనే తన రూపాన్ని చూస్తూ.. అతని త్యాగాలను తెలంగాణ గడ్డ శాశ్వతంగా గుర్తుంచుకుంటుంది. తెలంగాణ ఉద్యమ కళాకారునికి జోహార్లు. సాయిచంద్ పాటలనే స్ఫూర్తిగా తీసుకొని అతను కలలుగన్న తెలంగాణ సమాజం కోసం పాటుపడుతున్న ఉద్యమ పార్టీకి అండగా నిలుద్దాం. అదే మనం అతనికిచ్చే అసలైన నివాళి.
-సంపత్ గడ్డం
78933 03516