ఈ నెల 6న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల ముఖ్యమంత్రులు ఇరువురు హైదరాబాద్లోని ప్రజాభవన్లో సమావేశమవుతారు. రెండు రాష్ర్టాలు ఏర్పడి పదేండ్లు పూర్తవుతున్నా రెండు రాష్ర్టాల మధ్య పరిష్కారం కానీ సమస్యలు ఇంకా ఎన్నో ఉన్నాయి. ఆ సమస్యలను పరిష్కరించుకుందాం. 6న సమావేశం అవుదామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లేఖ రాయగా, దానికి బదులుగా తెలంగాణ ముఖ్యమంత్రి అనుముల రేవంత్రెడ్డి సరే అని లేఖ రాయడంతో ఇరువురి సమావేశం ఖరారైంది. రెండు రాష్ర్టాల ముఖ్యమంత్రుల సమావేశం మంచిదే. ఈ సమావేశంతో సమస్యలన్నీ తీరిపోతాయనే అత్యాశలేమీ పెట్టుకోవద్దు. సమావేశం తర్వాత కూడా కొన్ని సమస్యలు అలానే ఉంటాయి. నిజానికి అధికారుల స్థాయి లో నాలుగైదు సార్లు సమావేశాలు జరిపి ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత చివరలో ముఖ్యమంత్రుల స్థాయిలో సమావేశం జరగాలి. అయితే ఇక్కడ పరిష్కారం నోచుకోని సమస్యలకు ఇరువురి సమావేశంలో పరిష్కారం దొరుకుతుందనే ఆశ కన్నా సుహృద్భావ పరిస్థితుల్లో ఇరు రాష్ర్టాల ముఖ్యమంత్రుల సమావేశం జరగడమే శుభసూచకం అనుకోవాలి. ఈ సమావేశంతో రెండు రాష్ర్టాలకు మంచే జరుగుతుందని నమ్ముదాం.
రాజకీయాల్లో, జీవితంలో సినిమాలను మించిన ఊహించని మలుపులుంటాయి. సినిమాలో హీరో ఎవరో, విలన్ ఎవరో ప్రేక్షకునికి ముందే తెలుసు కాబట్టి సినిమా కథలో దర్శకుడు ఎన్ని ట్విస్ట్లు పెట్టినా ప్రేక్షకునికి అవి తెలిసి పోతుంటాయి. రాజకీయాల్లో, జీవితంలో ట్విస్ట్లను ముందే ఊహించలేం కాబట్టి అవి ఎప్పుడూ సినిమాలకన్నా ఆసక్తిగా ఉంటాయి. చంద్రబాబు, రేవంత్రెడ్డి ముఖ్యమంత్రులుగా సమావేశం కావడమే రాజకీయాల్లో ఊహించని మలుపు. ఇరు రాష్ర్టాల ముఖ్యమంత్రులు సమావేశం కావడం వింతేమీ కాదు. కానీ, ఒక పార్టీలో పనిచేసిన ఇద్దరు నాయకులు రెండు వేర్వేరు పార్టీల ద్వారా రెండు వేర్వేరు రాష్ర్టాలకు సీఎంలుగా సమావేశం కావడం ఆసక్తికరం.
రేవంత్రెడ్డి ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత మీడియా సమావేశంలో ఓ విలేకరి రేవంత్రెడ్డి రాజకీయ గురువు బాబు అని ఏదో ప్రశ్నిస్తుంటే… ‘చంద్రబాబు తనకు రాజకీయ గురువు అంటే వంగబెట్టి గుద్దుతా’ అంటూ సీరియస్గా స్పందించారు. అంతకుముందు మరో మీడియా సమావేశంలో ‘తనకు బాబుతో మంచి సంబంధాలే ఉన్నాయని, మీరు తిట్టించాలని ప్రయత్నించినా నేను తిట్టను’ అన్నారు. ఇద్దరి మధ్య వ్యక్తిగతంగా ఎలాంటి సంబంధ బాంధవ్యాలున్నా తెలంగాణ ప్రయోజనాలను కాపాడటం సీఎంగా రేవంత్రెడ్డి బాధ్యత. అలానే ఆంధ్రా ప్రయోజనాలు కాపాడటం చంద్రబాబు బాధ్యత.
రేవంత్రెడ్డి టీడీపీ అధ్యక్షునిగా ఉన్నప్పుడు తనది చంద్రబాబుది కర్ణ, దుర్యోధన స్నేహం లాంటిదని, ఆ స్నేహం ఎప్పుడూ వదులుకోనన్నారు. బాబు శిష్యుడిని అంటే వంగో బెట్టి గుద్దుతా అని అన్నా, వైఎస్ఆర్ పావురాల గుట్టలో కనిపించకుండా శవమయ్యాడని అన్నా ఈ రెండు సామాజికవర్గాల మద్దతు సాధించడంలో రేవంత్రెడ్డి విజయం సాధించారు. కాంగ్రెస్ సామాజికవర్గం విజయం కోసం టీడీపీ సామాజిక వర్గం కృషి చేస్తుందని రాష్ట్ర విభజనకు ముందు ఊహకందని విషయం.
రేవంత్రెడ్డి, చంద్రబాబుల మధ్య వ్యక్తిగత బాంధవ్యాలు ఎలా ఉన్నా.. ఇరువురికి తమ తమ రాష్ర్టాల ప్రయోజనాలు కాపాడే బాధ్యత ఉంటుంది. చంద్రబాబు, రేవంత్ రెడ్డిలది వ్యక్తిగత సంబంధాలు, అనుబంధాలు తప్ప రెండు పార్టీల మధ్య అనుబంధంగా చూడలేం. ‘కాంగ్రెస్ ముక్త్ భారత్’ తమ లక్ష్యమని బీజేపీ ప్రకటించుకున్నది. అలాంటి బీజేపీ కేంద్రంలో అధికారం చేపట్టడానికి మద్దతు ఇచ్చింది చంద్రబాబు. బీజేపీ ప్రభుత్వాన్ని నిలబెడుతున్న చంద్రబాబుకు కాంగ్రెస్ నుంచి పార్టీ పరంగా అండ ఉంటుందని భావించలేం. రేవంత్రెడ్డి వ్యక్తిగత స్థాయిలో స్నేహాన్ని కొనసాగించవచ్చు కానీ, అంతకుమించి అడుగు వేయడానికి కాంగ్రెస్ హైకమాండ్ అంగీకరించదు. ప్రస్తుతానికి కాంగ్రెస్ హైకమాండ్ వద్ద రాష్ట్ర కాంగ్రెస్లో ఏ సీనియర్కూ లేనంత పలుకుబడి రేవంత్రెడ్డికి ఉన్నది. ఇరు రాష్ర్టాల ముఖ్యమంత్రులు సమస్యలపై ఏం చర్చిస్తారో, ఏ నిర్ణయాలు తీసుకుంటారో, రాజకీయాలపై ఏం చర్చిస్తారో చూడాలి.
బుద్దా మురళి