దేశంలో రోజురోజుకు పెరుగుతున్న జనాభాకనుగుణంగా రాష్ర్టాల్లో వ్యవసాయోత్పత్తులు పెరగాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. కాబట్టి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు సాగు చేసే భూములన్నింటికి ఎలాంటి నిబంధనలు లేకుండా సీజన్ల వారీగా రైతుబంధు తరహా పథకాలను ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉన్నది. తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతుబంధు స్థానంలో ‘రైతుభరోసా’ అనే పథకాన్ని అమలుచేయ చూస్తున్నది. అయినా పర్వాలేదు కానీ ఆ పథకాన్ని తొందరగా అమలుచేయాల్సిన అవసరం ఉన్నది.
ప్రభుత్వం రైతులకు అవసరమైన సమయంలో పెట్టుబడి సాయం చేతికందివ్వకపోతే సాగు వెనుకబడిపోయే అవకాశాలున్నాయి. అంతేకాదు సాగు భూములు బీడు భూములుగా మారి, తద్వారా దేశంలో ఆహార కొరతలు ఏర్పడే అవకాశాలున్నాయి. అంతేకాదు, కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి కట్టిన ప్రాజెక్టులకు అర్థం లేకుండా పోతుంది. బీడు భూములకు రైతు భరోసా వర్తించదనే నిబంధనను అమలుచేస్తే సాగు పరిధి పెరిగే అవకాశం కూడా ఉంటుంది. వ్యవసాయం చేయలేని భూ యజమానులు తమ భూమిని కౌలుకు అప్పగిస్తారు. తద్వారా సాగు పరిధి పెరగడమే కాదు, కౌలుదారులకూ కొంత ఉపాధి కల్పించినవారమవుతాం. భూ యజమానులతో పాటు కౌలు రైతులకూ రైతుభరోసాను అమలుచేయాలి. కానీ, ఇద్దరి మధ్య కొంత వ్యత్యాసం ఉండాలి. అలాకాకుండా కౌలుదారులకే రైతు భరోసా ఇస్తే భూ యజమానులు నష్టపోతారు. ఈ క్రమంలో తమ భూమిని కౌలుకు ఇవ్వకుండా పక్షపాతం చూపెట్టే అవకాశాలున్నాయి. తద్వారా ఆహార సంక్షోభం ఏర్పడే అవకాశం ఉంటుంది. అంతేకాదు, వ్యవసాయోత్పత్తుల ఎగుమతి తగ్గి దిగుమతి పెరుగుతుంది. దీంతో పాటు లేబర్ కార్డున్న వ్యవసాయ కూలీలకు నెలకు రూ.1000 చొప్పున ఏటా రూ.12,000 ఇవ్వాలి.
పెద్ద రైతులకు, ఉద్యోగులకు, టాక్స్ పేయర్లకు రైతు భరోసా ఇవ్వకపోవడం సరైన నిర్ణయం కాదు. ఎందుకంటే సాగు విస్తీర్ణంతో పాటు ఖర్చులు కూడా అనులోమానుపాతంగా పెరుగుతాయి. పెట్టుబడికి అయ్యే ఖర్చు కోసం ఉన్న భూమిని అమ్మి సాగు చేసే బదులు, అసలు సాగు చేయకపోవడమే ఉత్తమమని పెద్ద రైతులు భావించే ఆస్కారం కూడా ఉంటుంది. కష్టనష్టాలు, వాతావరణంపై, విపత్తులపై ఆధారపడేదే వ్యవసాయం. ఉద్యోగులు, టాక్స్పేయర్లు సాగుచేసినా రైతుభరోసా అందివ్వమనే నిర్ణయం అన్యాయమైనది. అది వ్యవసాయాన్ని ప్రోత్సహించకుండా నిరుత్సాహపరచడమే అవుతుంది.
కలెక్టర్ స్థాయిలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగికి ప్రారంభ వేతనం రూ.80,000లకు మించి ఉండదు. అందులో శాలరీ, ఐటీ కటింగ్స్ పోను ఆ ఉద్యోగికి జీతం సుమారు రూ.60,000 వరకు వస్తుందేమో! అందులో ఇళ్లు, ద్విచక్రవాహనాల నెలవారీ ఈఎంఐలు, తల్లిదండ్రుల పోషణ ఖర్చులు, పిల్లల స్కూల్ ఫీ, ఇతర దవాఖాన ఖర్చులు పోను వారికి మిగిలేది శూన్యం. ఇలాంటి పరిస్థితిలో భూమి ఉన్నా పెట్టుబడి ఖర్చులు పెట్టుకొని వ్యవసాయం చేయడానికి ఏ ఉద్యోగి ముందుకురారు. తద్వారా ఉద్యోగుల భూములన్నీ బీడు భూములుగా మారే అవకాశం ఉంటుంది. వ్యవసాయం చేసే రైతులకు ప్రభుత్వ ఉద్యోగం ఒక శాపంగా మారకూడదు. కరోనా సమయంలో చాలామంది ప్రభుత్వ ఉద్యోగులు అప్పటి ప్రభుత్వం ఇచ్చిన రైతుబంధును ఆసరాగా చేసుకొని వ్యవసాయరంగంలోకి అడుగుపెట్టారు. ఇప్పుడు పలానా వారికే రైతుభరోసా ఇవ్వాలనే పరిమితిని విధిస్తే వ్యవసాయం కుంటుపడే అవకాశాలు మెండుగా ఉంటాయి. కాబట్టి ప్రభుత్వం నిశితంగా పరిశీలించి సాగుకు యోగ్యమయ్యే భూములన్నింటికి ఎలాంటి పరిమితులు లేకుండా రైతు భరోసా ఇవ్వడమే శ్రేయస్కరం.
రుణమాఫీ అమలు విషయంలోనూ రాష్ట్ర ప్రభుత్వం ఆచితూచి అడుగులు వేయాలి. రైతులు రుణాలు తీసుకున్న భూమి అగ్రికల్చర్ వెబ్సైట్లో నమోదై ఉంటేనే వ్యవసాయం కోసం తీసుకున్న రుణంగా పరిగణించాలి. అప్పుడే ఆయా రుణాలను మాఫీ చేయాలి. అప్పుడే రైతు భరోసా, రుణమాఫీ సంక్షేమ పథకాల అసలు లక్ష్యం నెరవేరుతుంది.
(వ్యాసకర్త: ప్రిన్సిపాల్, ప్రభుత్వ డిగ్రీ కళాశాల, కొల్లాపూర్)
-ఇటిక్యాల రామరాజు యాదవ్
94936 03075