చరిత్రాత్మకమైన తెలంగాణ సాయుధ పోరాటం (1946-1951), 1969 ప్రత్యేక తెలంగాణ తొలి ఉద్యమం, 2001 మలిదశ తెలంగాణ ఉద్యమకాలాల్లో అనేకమంది ఉద్యమకారులను, సాధారణ ప్రజలను, కార్యకర్తలను కోల్పోయిన చరిత్ర మన తెలంగాణది. దశాబ్దాల తరబడి ఉనికి, అస్తిత్వం కోసం నిరంతరం పోరాడుతూ.. పోరాటాల వారసత్వాన్ని చాటుకున్నది మన తెలంగాణ.
తెలంగాణ ప్రజలు ఎదుర్కొన్న కష్టాలు, బాధలు, తెలంగాణ రైతాంగం అనుభవించిన క్షోభ చంద్రబాబు పాలనలో మరింత రెట్టింపయ్యాయి. తెలంగాణ చరిత్రను రక్తసిక్తం చేసిన పాలకుడు చంద్రబాబు. బూటకపు ఎన్కౌంటర్ల పేరుతో రక్తం పారించింది చంద్రబాబు పాలన. రెండు, మూడేండ్లలో నీళ్లు ఇచ్చే అవకాశం ఉన్న ఈ ఆధునిక యుగంలో దశాబ్దాల తరబడి ఉద్దేశపూర్వకంగా సాగదీసి తెలంగాణ ప్రాజెక్టులకు పెట్టిన పేరు పెండింగ్ ప్రాజెక్టులు. ఆర్థిక సంస్కరణల పేరుతో, ప్రపంచ బ్యాంకు షరతులతో తెలంగాణ రైతుల నడ్డి విరిచింది చంద్రబాబు ప్రభుత్వం.
బిల్ గేట్స్, బిల్ క్లింటన్, టోని బ్లెయిర్లను చూపి, ఆధునికత ముసుగేసి తెలంగాణ సమాజంపై అత్యంత దుర్మార్గమైన వివక్షను చూపింది చంద్రబాబు పాలన. ప్రజాకళాకారుడు, ప్రజా యుద్ధనౌక గద్దర్ వెన్నులో తూటాలు దించడంతో పాటు మరెందరో మెరికల్లాంటి నూతన ప్రపంచాన్ని నిర్మించగలిగే శక్తియుక్తులున్నటువంటి ఒక తరాన్ని నిర్మూలించింది చంద్రబాబు పాలన. తెలంగాణ జనసభ, మహాసభల పేరు మీద మరోసారి తెలంగాణ గొంతుక పైకి లేవగానే బెల్లి లలితను 16 ముక్కలు చేయించింది చంద్రబాబు పరిపాలన. తెలంగాణ కోసం గొంతెత్తిన కవులు, కళాకారులు, రచయితలు, ఉద్యమకారులను నిర్బంధానికి గురిచేసి తెలంగాణలో విధ్వంసాన్ని సృష్టించింది చంద్రబాబు పాలన.
తెలంగాణకు జరిగిన విధ్వంసాన్ని సరిచేసుకునే ప్రయత్నంలో భాగంగా ఎందరో మహామహులు, మేధావులు, త్యాగధనులు, బుద్ధిజీవులు, కార్మికులు, రైతాంగ ప్రతినిధులందరూ గొంతు విప్పి తెలంగాణ సమాజాన్ని మేలుకొల్పుతున్న సమయమది. ఆ సమయంలో ఆచార్య కొత్తపల్లి జయశంకర్, బియ్యాల జనార్దన్రావు, గద్దర్, కేశవరావు జాదవ్, ఆర్.విద్యాసాగర్ రావు, విమలక్క, రామచంద్రమూర్తి, పొత్తూరి వెంకటేశ్వర్ రావు, గాదె ఇన్నయ్య, వి.ప్రకాష్, పాశం యాదగిరి, మల్లెపల్లి లక్ష్మయ్య, ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి, జలసాధన సమితి దుశ్శర్ల సత్యనారాయణ, ఆ నాటికీ స్వచ్ఛంగా ఉన్న కోదండరాం వంటి మహామహులెందరో తెలంగాణ కోసం పలుపలు విధాలుగా తమ వాదనను, గొంతును భిన్నరూపాలలో వినిపిస్తూ వస్తున్న సందర్భం. ఓ వైపు అణచివేతను ఎదుర్కొంటూనే, నిర్బంధానికి వ్యతిరేకంగా నిలదొక్కుకుంటూనే తెలంగాణ సమాజాన్ని చైతన్యపరిచి ముందుకు తీసుకుపోయే క్రమం.
ఆ సమయంలో విద్యుత్ సంస్కరణలు చంద్రబాబు నాయుడు పాలన పరాకాష్టకు చేరిందనడానికి గొప్ప ఉదాహరణ. బషీర్బాగ్ కాల్పులతో తెలంగాణ సమాజం ఉలిక్కిపడింది. అందరినీ తీవ్ర దిగ్భ్రాంతికి, ఆవేదనకు గురిచేసింది. ఈ ఘటన నేపథ్యంలో అధికార పార్టీలో ఉంటూ ఈ అన్యాయాల పట్ల తొలిసారి నిరసన గళాన్ని విప్పి, 2000 ఆగస్టులో చంద్రబాబుకు బహిరంగ లేఖరాసింది తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, నాటి డిప్యూటీ స్పీకర్ కల్వకుంట్ల చంద్రశేఖర రావు. తెలంగాణ సమాజం ఒక కొత్త ధైర్యాన్ని సంతరించుకునేలా ఆ లేఖ ఒక శంఖారావాన్ని పూరించింది. అనేక మంది తెలంగాణవాదుల్లో కొత్త జవసత్వాలను, కొత్త ఆశలను రేకెత్తించింది.
ఆ తర్వాత జరిగిన మేధోమథనం, చర్చోపచర్చలు వెరసి చంద్రబాబు తీరును నిరసిస్తూ 2001 ఏప్రిల్ 21న తెలుగుదేశం పార్టీ సభ్యత్వానికి, ఎమ్మెల్యే, డిప్యూటి స్పీకర్ పదవులకు కేసీఆర్ రాజీనామా సమర్పించారు. 2001 ఏప్రిల్ 27న ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నినాదంతో హైదరాబాద్లోని కొండా లక్ష్మణ్ బాపూజీ నివాసం జలదృశ్యంలో ‘తెలంగాణ రాష్ట్ర సమితి’ పేరిట పార్టీని ఏర్పాటు చేశారు. టీఆర్ఎస్ ఆవిర్భావం ఒక అద్భుతం. 14 ఏండ్ల ప్రస్థానం ఒక మహాద్భుతం. విజయతీరాలకు చేరడం చెరిగిపోని చరిత్ర. అంతిమంగా రాష్ట్ర ఏర్పాటు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్, ఆ తర్వాత పదేండ్ల పాలన గురించి అందరికీ తెలిసిందే.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన పదేండ్లకే తెలంగాణ ఉద్యమాన్ని, రాష్ట్ర ఏర్పాటును పరిహసించి, వికటాట్టహాసం చేసినవాళ్లు ప్రగతిభవన్లో కలుసుకునే ఒక దుర్దినం, చారిత్రాత్మక ఘోర తప్పిదం మన కండ్లముందే జరగబోతుండటం దురదృష్టకరం. అయితే గతాన్ని నెమరువేసుకుంటే చంద్రబాబు పచ్చి అవకాశవాదంతో తెలంగాణవాదాన్ని అణచివేయాలన్న ప్రయత్నం చేసి విఫలమయ్యారు. గత్యంతరం లేక 2009లో మహాకూటమిని ఏర్పాటు చేశారు. ఓట్ల కోసం తెలంగాణ ప్రజల కాళ్లు మొక్కారు. తెలంగాణ ఏర్పాటును అంగీకరిస్తూ కేంద్రానికి తీర్మానం అందజేశారు. 2009 డిసెంబరు 9న కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన చేయగానే ప్లేటు ఫిరాయించి, భారత రాజకీయ వ్యవస్థలో అత్యంత ఘోరంగా రాజకీయ విలువలకు తిలోదకాలిచ్చిన నాయకుడు చంద్రబాబు.
నిస్సిగ్గుగా అంతకుముందు ఇచ్చిన మాటలు, చేసిన వాదనలకు భిన్నంగా తెలంగాణ వ్యతిరేకతను నరనరాన జీర్ణించుకుని, విషం కక్కి ప్రకటన పూర్తయి, ఏర్పాటు మాత్రమే మిగిలున్న తెలంగాణను నాలుగేండ్ల పై చిలుకు ఆపగలిగింది చంద్రబాబు కోటరీ. చంద్రబాబు నాయుడును నిరంతరం వెన్నంటి ఉండే మీడియా, ఆంధ్రా పాలక, పెట్టుబడిదారీ వర్గాలు తెలంగాణ ప్రజలను, సమాజాన్ని పరిహసించాయి. కానీ, అంతిమ విజయం ధర్మానిదే అయింది. అయితే చరిత్రలో అత్యంత విషాదకర, మరువలేని, మరపురాని ఘటనలు ఈ నాలుగేండ్లలో చోటుచేసుకున్నాయి. నిరాశ, నిస్పృహలకు గురైన వందలాదిమంది యువకుల బలిదానాలు, ఆ కుటుంబాల ఆవేదన, దుఖం ఒక శాశ్వత గాయంగా తెలంగాణ సమాజం మీద ముద్రితమైంది.
ఆ గాయాలు మానకముందే ఈ రోజు చంద్రబాబు నాయుడు, ఆయన శిష్యుడు రేవంత్ రెడ్డి (తెలంగాణను వ్యతిరేకించిన ధీరోధాత్తులు) తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు ప్రతిరూపమైన ప్రగతిభవన్లో (తెలంగాణ వ్యతిరేకుల) కలయిక జరుగబోతున్నది. ఆహా ఎంత అద్భుతం! ఇందుకేనా అంతమంది అమరులైంది? ఇందుకేనా దశాబ్దాల పాటు తెలంగాణ గళాన్ని ప్రజలు వినిపించింది? ఓహో ఇందుకేనా వేల మంది కవులు, కళాకారులు తమ గళం విప్పింది, గర్జన చేసింది, పాటలు పాడింది? ఓహో ఇందుకేనా తెలంగాణ సమాజం సకలజనుల సమ్మె చేసింది? ఓహో ఇందుకేనా అంతా ఒక్కటై నిలిచింది? ఎంతటి విషాదమిది.
ఒకవేళ నిజంగానే రెండు విడిపోయిన రాష్ర్టాలు తమ సమస్యలను పరిష్కరించుకోవాలని అనుకుంటే ఇదే చంద్రబాబు రాష్ట్రం విడిపోయినప్పుడు 2014లో ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్నారు. మరి 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు అప్పటి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ను ఎందుకు కలిసే ప్రయత్నం చేయలేదు? ఈ రోజు చూపిన చొరవ ఆ రోజు ఎందుకు చూపలేదు? ఎందుకు సీలేరును గుంజుకున్నారు? ఎందుకు తెలంగాణలోని ఏడు మండలాలను గుంజుకున్నారు? ఏపీ హైకోర్టు ఏర్పాటులో జరిగిన జాప్యానికి కారణమెవరు? అప్పట్లో గుంజుకోవడమే కాదు, ఇటీవల ఏపీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత పార్టీ ప్రజాప్రతినిధుల సమావేశంలో నిస్సిగ్గుగా తాను ఎలా బెదిరించి ఏడు మండలాలను లాక్కున్నది కూడా ఏపీ ప్రజలు, పార్టీకి ఆయన వివరించారు.
అపరిష్కృత సమస్యలను పరిష్కారం చేసుకోవాలన్న సోయి అప్పట్లో ఎందుకు లేకపోయింది? ఒకవేళ కేసీఆర్ సహకరించలేదనుకుంటే చంద్రబాబు స్నేహహస్తం చాచింది ఎప్పుడు? నాడు ఎన్డీయేలో టీడీపీ భాగస్వామి కాబట్టి, చంద్రబాబు చెప్పినట్టు ప్రధాని మోదీ వినేవారు. అందుకే నదీజలాలు, ఉమ్మడి ఆస్తుల పంపిణీ, హైకోర్టు ఏర్పాటు వంటి వీలైనన్నీ అంశాలను వాయిదా వేయిస్తూ దుర్మార్గానికి పాల్పడ్డారు చంద్రబాబు. జగన్మోహన్రెడ్డి పాలనలో సమస్యల పరిష్కారానికి కొన్ని అడుగులు వేసినా.. కేసీఆర్ అనేకసార్లు చెప్పినట్టు తెలంగాణ వ్యతిరేకులంతా ఎప్పుడూ ఒక్కటే. దాన్ని తెలంగాణ సమాజం ఎన్నడూ మరిచిపోదు. కొద్దిగా ఎక్కువ, తక్కువ అంతే.
ఒకవేళ రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రిగా రెండు రాష్ర్టాల మధ్య అపరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారం కోసం చొరవ తీసుకోదలుచుకుంటే, నిజంగా పరిష్కారం కావాలని అనుకుంటే గనుక.. ఈ రాష్ట్రంలోని రాజకీయ పక్షాలన్నింటినీ పిలిచి మొదట అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి ఉండాల్సింది. ఏయే అంశాలు ఎందుకు అపరిష్కృతంగా ఉన్నాయి? ఏ మేరకు ఉన్నాయి? మనమేం చొరవ చూపాలి? ఏం అడగాలి? అని కనీస కసరత్తు చేయాల్సింది. కానీ, అలా చేయలేదు. ఏ కసరత్తు చేయకుండానే చర్చలకు వెళ్లడం ఎంత వరకు సమంజసం? చంద్రబాబు ఇలా లేఖ రాయగానే అలా రేవంత్ ఎందుకు తలూపుతున్నారు? చంద్రబాబు పంపిన లేఖ పైకి కనిపిస్తున్నది. కానీ, వారి మధ్య మాటామంతీ రోజూ నడుస్తున్నదే. ఇప్పుడు తెలంగాణను పరోక్షంగా పాలిస్తున్నది చంద్రబాబే. రేపూ చంద్రబాబే నడుపుతారు. ప్రగతి భవన్లో కాలుమోపడం ద్వారా హైదరాబాద్లో ‘నా పెత్తన నడుస్తుంది. నాదే నడుస్తది’ అని పరోక్షంగా ఆంధ్రా ప్రాంతానికి తెలియజేయడమే ఆయన ఉద్దేశం. తద్వారా ఆంధ్రా పెట్టుబడిదారి వర్గాలను, తెలంగాణ వ్యతిరేక వర్గాలను సంఘటితం చేయడమే చంద్రబాబు కుటిలనీతి. తెలంగాణ సమాజమా ఇది కాలపరీక్ష. తెలంగాణ వ్యతిరేకుల కుట్రల నుంచి మనల్ని మనం కాపాడుకుందాం. తెలంగాణను కాపాడుకుందాం.
(వ్యాసకర్త: రాష్ట్ర వ్యవసాయ శాఖ మాజీ మంత్రి)
– సింగిరెడ్డి నిరంజన్రెడ్డి