చెరువులోంచి పాత నీరు పోతా ఉంటేనే కొత్త నీటికి అవకాశం దొరుకుతుంది. అంతేకానీ, పాత నీటికి అడ్డుకట్ట వేయాలనే ప్రయత్నాలు చేయడం, అయ్యో.. ఆ నీరు పోతే ఎట్లా..? అని బాధపడుతూ కూర్చోవడంలో అర్థం లేదు. నీళ్లు మలెపడినా కొద్దీ మురుగు వాసన పెరుగుతుంది. ఆ దుర్వాసనతో ప్రజలకు నష్టమే తప్ప, సమాజానికి ఒనగూడే ప్రయోజనం ఏమీ ఉండదు. ప్రస్తుతం రాజకీయ సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న బీఆర్ఎస్ పార్టీ ఈ చిన్న సూత్రాన్ని గుర్తుంచుకొని ముందుకు నడవాల్సిన అవసరం ఉన్నది.
రాష్ట్రంలో మొన్నటిదాన్క నీటితో కళకళలాడిన బీఆర్ఎస్ చెరువు ఇవ్వాళ ఎండిపోయే పరిస్థితికి చేరిందంటే దానికి ప్రధాన కారణం పాత నీళ్లే. ఈ నీళ్లు కొత్త నీటిని అడ్డుకున్నయి. కొత్త నీళ్లు వస్తే తమను ఇటు ప్రజలు, అటు అధిష్ఠానం పట్టించుకోదని గ్రహించి అందినకాడికి పరుచుకున్నాయి. కొత్త నీటిని అణగదొక్కినయి. వాటికి అవకాశాలు రాకుండా చేసినయి. అధిష్ఠానానికి దూరాన్ని పెంచినయి. పాత నీరు ఇప్పుడు బయటికి పోతున్నకొద్దీ ముందుగాళ్ల సంబురపడేది కొత్త నీళ్లే. ఇన్నిరోజులు ఎదురుచూసినందుకు ఇప్పటికైనా తమకు అవకాశాలు దక్కుతాయని ఉత్సాహంతో, ఉడుకు రక్తంతో ఉరకలెత్తుతున్నయి. అయినా కొత్తనీటి ముందు పాత నీరెంత? ఆకాశంలో అణువంత! కొత్త నీటి తడలకు పాత నీళ్లు కొట్టుకుపోయి మూసీ నదిలో కలిసిపోవడం ఖాయం.
తెలంగాణ కోసం తెగించి కొట్లాడి, రక్తాన్ని చిందించకుండా శాంతియుత మార్గంలో రాష్ర్టాన్ని సాధించి, ఆ రాష్ర్టాన్ని పదేండ్లు ప్రగతి పథంలో నడిపిన బీఆర్ఎస్ పార్టీకి ప్రస్తుతం సంధికాలం నడుస్తున్నది. 2001 ఏప్రిల్ 27న ఆవిర్భవించిన నాటి నుంచి ఇలాంటి ఒడిదుడుకులను, ఎత్తుపల్లాలను ఎన్నింటినో ఆ పార్టీ చవిచూసింది. ఇవన్నీ బీఆర్ఎస్ పార్టీకి కొత్తేం కాదు, కింద పడినప్పుడల్లా గోడకు కొట్టిన బంతిలా రెట్టించిన వేగంతో దూసుకువచ్చిందే తప్ప ఏనాడూ ‘అయ్యో.. నా పనైపోయిందే’ అని డీలా పడిపోలేదు. ఇప్పుడు కూడా అంతే.. బీఆర్ఎస్ తిరిగి పుంజుకుంటుంది. దానికి సమయం కూడా ఎంతో పట్టదు. కానీ, ‘బీఆర్ఎస్ పనైపోయింది’, ‘ఆ పార్టీ ఎమ్మెల్యేలు కట్టగట్టుకొని వేరే పార్టీకి వలసలు పోతున్నారు..’, ‘ఇక బీఆర్ఎస్ పార్టీని ఏదో ఒక జాతీయ పార్టీలో విలీనం చేయాల్సిందే’ అంటూ కొందరు వేణు స్వామి తరహాలో జోస్యం చెప్తున్నారు.
గోతికాడి నక్కల్లా కాచుక్కూచునే పచ్చమీడియా, దానికి సంబంధించిన కొన్ని టీవీ, యూట్యూబ్ చానళ్లు ‘మేమేమైనా తక్కువ తిన్నామా’ అంటూ రకరకాలు కథనాలను వండి వడ్డిస్తున్నాయి. ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల్లో లేనిపోని భయాందోళనలను రేకెత్తిస్తున్నాయి. దీంతో సందట్లో సడేమియా అన్నట్టు… ఏ ఎండకు ఆ గొడుగు పట్టే జంప్ జిలానీలకు అవకాశం దొరికినట్టయ్యింది. బెల్లం ఉన్నచోటే ఈగలు వాలుతాయన్నట్టుగా.. అధికారం ఉన్నచోట రాజకీయ నాయకులు వాలిపోతారని మరోసారి రుజువు చేస్తున్నారీ జంప్ జిలానీలు. తాజాగా కాంగ్రెస్ కండువా కప్పుకొన్న మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి ఆ కోవకు చెందినవారే. ఆయన వ్యక్తిగత లబ్ధి కోసం పార్టీ కండువాను మార్చారే తప్ప, ప్రజలకు ఏదో వెలగబెడతామనైతే కాదనేది నగ్న సత్యం. కండువా కప్పుకొని కామ్గా ఉంటే ఆయననూ అనేవారెవరూ ఉండరు, అడ్డుకునేవారెవరూ ఉండరు. కానీ, ‘సీఎం రేవంత్ రెడ్డి రైతులకు మేలు చేస్తున్నారు, అందుకే కాంగ్రెస్లోకి వెళ్తున్నా’ అని ప్రకటించడమే కొంచెం విడ్డూరంగా ఉన్నది. కొంచెం వెగటు కూడా పుట్టిస్తున్నది.
మొన్న కేకే కావచ్చు, నిన్న పోచారం కావొచ్చు, రేపు ఇంకొకరు కావచ్చు, ఆ తర్వాత వేరేవారూ కావచ్చు… తలపండిన ఏ ఇతర సీనియర్ నాయకులు, ఏ ఇతర ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ను వీడినా ఆ పార్టీకి వాటిల్లే నష్టమేమీ ఉండదు. కాబట్టి వెళ్తామనుకునేవాళ్లకు శాలువా కప్పి, తిలకం దిద్ది మరీ సాగనంపాలి. ఎందుకంటే పద్నాలుగేండ్ల పాటు ఉద్యమంలో, పదేండ్ల పాటు ప్రగతి యుద్ధంలో చెమటలు ధారపోసిన యువకులు, ఎంతోమంది కార్యకర్తలు సిద్ధంగా ఉన్నరు తెలంగాణ అభివృద్ధి ఎజెండాను కిందపడనివ్వకుండా పట్టుకోవడానికి. ఆ యువకులకు పదవులు ముఖ్యం కాదు, తెలంగాణ ప్రయోజనాలే ముఖ్యం. తెలంగాణ ప్రజల బాగోగులే వారికి ప్రధానం. వాళ్లు ఏనాడూ పదవులకు ఆశపడి తెలంగాణ జెండాను మోయలేదు. ప్రాణాలు పోయినా సరే ‘మా తెలంగాణ మాగ్గావాలె’ అని కొట్లాడిన ధీరులు వాళ్లు. తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడేందుకు చెమటను ధారపోసిన తెలంగాణ పరిరక్షకులు వాళ్లు.
నాకు తెలిసిన ఒక తమ్ముడు తాడబోయిన విజయ్. కరడుగట్టిన తెలంగాణ వాది. ఎంత అంటే ఇంటిపేరునే తెలంగాణ అని మార్చుకునేంత. ముదిరాజు సామాజికవర్గానికి చెందిన ఈ యువకునికి నిల్వ నీడ లేదు. రెక్కాడితేగానీ డొక్కాడని జీవితం తనది. అయినా సరే బీఆర్ఎస్ పార్టీ పురుడు పోసుకున్న నాటి నుంచి నేటిదాకా తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం అహరహం శ్రమిస్తున్నాడు. కుటుంబాన్ని ఎల్లదీసేటందుకు ఓ దిక్కు ఎవుసం చేసుకుంటనే ఇంకో దిక్కు పార్టీ కోసం పనిచేస్తున్నాడు. ఒక్క విజయే కాదు, విజయ్ లాంటి లక్షలాది మంది వీర సైనికులు బీఆర్ఎస్
పార్టీ సొంతం. అలాంటివాళ్లు నాయకులుగా తయారైతే తెలంగాణ పది కాలాల పాటు సుభిక్షంగా పరిఢవిల్లుతుంది.
ఈ సంకట స్థితిలో బీఆర్ఎస్ చేయవలసిన పనులు రెండున్నాయి. మొదటిది పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలను కాపాడుకోవడం, రెండోది నీతి, నిజాయతీ గల యువ నాయకులను తయారు చేసుకోవడం.
-గడ్డం సతీష్
99590 59041