ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికలు ఎంత సహజమో.. విభిన్న రాజకీయ సిద్ధాంతాలు కలిగిన పార్టీలు ఉండటమూ అంతే సహజం. దేశాన్ని పాలించడానికి రాజకీయ పార్టీల మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉండటం ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతున్నదని చెప్పడానికి నిదర్శనం. విభిన్న రాజకీయ సిద్ధాంతాలకు రాజకీయ పార్టీలు నిర్దిష్టమైన రూపాన్నిస్తాయి. అయితే ఫిరాయింపు అనేవి పార్టీ వ్యవస్థకు పట్టిన చీడపురుగు వంటిది. ఈ నేపథ్యంలో అమల్లో ఉన్న ఫిరాయింపు నిరోధక చట్టం.. కొన్ని పరిమిత పరిస్థితుల్లో మాత్రమే పార్లమెంట్, అసెంబ్లీల్లో రాజకీయ పార్టీలకు చెందిన చట్టసభ సభ్యులు, స్వతంత్ర లేదా నామినేటెడ్ సభ్యులపై అనర్హత వేటు పడకుండా పార్టీలు మారడానికి అనుమతిస్తుంది. సాధారణంగా ఒక సభ్యుడు తన మాతృపార్టీని వదిలిపెట్టి మరో పార్టీలో చేరే పరిస్థితినే ‘ఫిరాయింపు’ అని వ్యవహరిస్తారు. సంప్రదాయికంగా ఈ ఫిరాయింపును ‘ఫ్లోర్ క్రాసింగ్’ అని పిలుస్తారు. ఈ పదాన్ని మొదటగా బ్రిటిష్ దిగువ సభ (హౌజ్ ఆఫ్ కామన్స్) ప్రాచుర్యంలోకి తెచ్చింది.
Defection | మన దేశంలో పార్టీ ఫిరాయింపులు అతి మామూలు విషయంగా మారిపోవడమనేది ఎప్పటికప్పుడు రాజకీయ అస్థిరతకు దారితీస్తున్నది. ఫలితంగా ‘పరిపాలన’పై ఉంచాల్సిన దృష్టిని ‘ప్రభుత్వం’పై కేంద్రీకరించాల్సిన దుస్థితి నెలకొంటున్నది. 1960 ప్రాంతంలో ఈ పార్టీ ఫిరాయింపులు అత్యధికంగా చోటుచేసుకున్న నేపథ్యంలో ‘ఆయారాం.. గయారాం’ అనే పదం ప్రాచుర్యంలోకి వచ్చింది. మన దేశంలో ఫిరాయింపుల చరిత్ర బ్రిటిష్ పాలనా కాలం నుంచే ప్రారంభమైంది. సెంట్రల్ లెజిస్లేచర్ సభ్యుడు శ్యాంలాల్ నెహ్రూ కాంగ్రెస్ పార్టీ నుంచి ఫిరాయించి బ్రిటిష్ వారికి మద్దతివ్వడం అప్పట్లో సంచలనం సృష్టించింది. ఫిరాయింపునకు మరో ఉదంతం చెప్పుకోవాలంటే.. ముస్లిం లీగ్ పార్టీ నుంచి ఉత్తరప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికైన హఫీజ్ మహమ్మద్ ఇబ్రహీం 1937లో కాంగ్రెస్లోకి ఫిరాయించారు.
1960 దాటిన తర్వాత దేశంలో సైద్ధాంతిక రాజకీయ నిబద్ధత స్థానంలో ఇతరత్రా అంశాలు చోటుచేసుకోవడం మొదలైంది. దేశంలో నాలుగవ సాధారణ ఎన్నికలు ముగిసిన తర్వాత ఏర్పాటైన చవాన్ కమిటీ 1969లో ఒక నివేదిక సమర్పించింది. దీని ప్రకారం మొదటి-నాలుగవ సాధారణ ఎన్నికల మధ్యకాలంలో అంటే రెండు దశాబ్దాలలో వివిధ రాష్ర్టాల్లో 542 ఫిరాయింపు కేసులు నమోదయ్యాయి. వీటిల్లో 438 ఫిరాయింపులు కేవలం 1967 మార్చి నుంచి 1968 ఫిబ్రవరి మధ్యకాలంలో జరిగినవేనని నివేదిక పేర్కొంది. ఆ సమయంలో 376 మంది స్వతంత్ర అభ్యర్థులు ఎన్నికవగా.. వీరిలో 157 మంది వివిధ పార్టీల్లో చేరిపోయారు. పార్టీలు ఫిరాయించిన 210 మంది ఎమ్మెల్యేల్లో 116 మందికి మంత్రి పదవులు లభించాయంటే.. పదవీ వ్యామోహం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
1967 ఆగస్టు 11న నాలుగవ లోక్సభలో పి.వెంకటసుబ్బయ్య అనే సభ్యుడు ఫిరాయింపులను నిరోధించాలంటూ ఒక ప్రైవేటు తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దీనిపై అదే ఏడాది నవంబర్ 24, డిసెంబర్ 8వ తేదీన లోక్సభలో చర్చ జరిగింది. అనంతరం తీర్మానాన్ని లోక్సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ నేపథ్యంలో పార్టీ ఫిరాయింపులపై నాటి కేంద్ర హోంమంత్రి వైబీ చవాన్ నేతృత్వంలో అప్పటి ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేయగా.. 1969 ఫిబ్రవరిలో ఆ కమిటీ నివేదికను సమర్పించింది.
ఫిరాయింపులను అదుపు చేయడానికి కమిటీ సూచనలు సరిపోవని భావించిన కేంద్ర సర్కార్.. 1973 మే 16న లోక్సభలో 32వ రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెట్టింది. రాజ్యాంగబద్ధంగా ఫిరాయింపులను నిరోధించాలన్నది ఈ బిల్లు ప్రధాన లక్ష్యం. బిల్లును పార్లమెంట్ ఉభయసభల జాయింట్ కమిటీ పరిశీలనకు పంపారు. అయితే 1977 జనవరి 18న ఐదో లోక్సభ రద్దు కావడంతో ఈ కమిటీ మురిగిపోయింది. 1978 ఆగస్టు 28న 48వ రాజ్యాంగ సవరణ బిల్లు పేరుతో దీన్ని లోక్సభలో ప్రభుత్వం ప్రవేశపెట్టగా.. అధికార, వివక్ష సభ్యులు తీవ్రంగా వ్యతిరేకించారు. దీంతో ప్రభుత్వం ఈ బిల్లును వెనక్కి తీసుకోకతప్పలేదు.
1985 జనవరి 24న లోక్సభలో 52వ రాజ్యాంగ సవరణ బిల్లు పేరుతో కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లును ప్రవేశపెట్టింది. దీని ప్రకారం రాజ్యాంగంలోని 101, 102, 190, 191 అధికరణాలను సవరించారు. దీంతో పాటు రాజ్యాంగంలో పదవ షెడ్యూల్ను చేర్చారు. ఫిరాయింపుల నేపథ్యంలో ఒక సభ్యుడు అనర్హతకు సంబంధించిన నిబంధనలను ఇందులో పొందుపరచారు. 1985 జనవరి 30, 31వ తేదీల్లో వరుసగా లోక్సభ, రాజ్యసభలు ఈ బిల్లుకు ఆమోదం తెలిపాయి. ఈ చట్టం 1985 మార్చి 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చింది. ఈ నేపథ్యంలో లోక్సభ స్పీకర్, ఫిరాయింపునకు పాల్పడే లోక్సభ సభ్యుల అనర్హతకు సంబంధించిన నిబంధనలు రూపొందించారు. రాజ్యాంగంలోని పదవ షెడ్యూల్ 8వ పేరాకు అనుగుణంగా రూపొందించిన ఈ నిబంధనలు 1986 మార్చి 18 నుంచి అమల్లోకి వచ్చాయి.
నిబంధన-2: ఒక రాజకీయ పార్టీకి చెందిన లోక్సభ సభ్యుడు స్వచ్ఛందంగా ఆ పార్టీ సభ్యత్వాన్ని వదులుకున్నప్పుడు, పార్టీ ఇచ్చిన ఆదేశాలకు వ్యతిరేకంగా ఓటు వేసినా లేదా తటస్థంగా ఉన్నా తన లోక్సభ సభ్యత్వాన్ని కోల్పోతాడు. ఒకవేళ సభ్యుడు పార్టీ నుంచి ముందస్తు అనుమతి తీసుకున్నా లేక అతడు ఆ విధంగా వ్యవహరించిన తేదీ నుంచి పదిహేను రోజుల్లోగా పార్టీ అతడిని క్షమించినా సదరు సభ్యుడిపై అనర్హత వేటు పడదు. స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన సభ్యుడు మరో పార్టీలో చేరితే లోక్సభ సభ్యత్వాన్ని కోల్పోతాడు. ఒక నామినేటెడ్ సభ్యుడు ఏదైనా రాజకీయ పార్టీలో చేరితే చట్టసభలో సభ్యత్వం పొందిన తేదీ నుంచి ఆరు నెలలకు తన సభ్యత్వాన్ని కోల్పోతాడు.
నిబంధన-3: రాజకీయ పార్టీలో చీలిక వచ్చి రెండు గ్రూపులు ఏర్పడినప్పుడు వారిపై అనర్హత వేటు పడదు. ఒక రాజకీయ పార్టీకి చెందిన మొత్తం సభ్యుల్లో 1/3వ వంతు ఫిరాయించినప్పుడు వారిని పార్టీ చీలిక గ్రూపుగా పరిగణిస్తారు. అయితే ఈ నిబంధనను 2003లో చేపట్టిన 91వ రాజ్యాంగ సవరణ ద్వారా తొలగించారు.
నిబంధనలు-4, 5: ఒక పార్టీ వేరొక రాజకీయ పార్టీలో విలీనమైనప్పుడు సదరు పార్టీ సభ్యులకు అనర్హత వర్తించదు. వినీనం తర్వాత కొత్త పార్టీ ఆవిర్భవించవచ్చు లేదా వీరంతా విలీనం చేసుకున్న పార్టీ సభ్యులుగా పరిగణనలోకి వస్తారు. విలీనమైన పార్టీకి చెందిన సభ్యుల్లో కొంతమంది ఆ విలీనాన్ని అంగీకరించకపోతే, వారు ఒక ప్రత్యేక గ్రూపుగా కొనసాగుతారు. విలీనమయ్యే పార్టీకి చెందిన సభ్యుల్లో 2/3వ వంతుకు తగ్గకుండా సభ్యులు అంగీకరించినప్పుడు మాత్రమే ఆ విలీనం ఆమోదం పొందుతుంది.
నిబంధన-6: ఒక సభ్యుడిపై అనర్హత వేటు విధించే విషయంలో స్పీకర్ లేదా చైర్మన్దే తుది నిర్ణయం.
2003 మే 5న అప్పటి ప్రభుత్వం 97వ రాజ్యాంగ సవరణ చట్టం- 2003 పేరుతో లోక్సభలో ఓ బిల్లును ప్రవేశపెట్టింది. స్టాండింగ్ కమిటీ ఆన్ హోం ఎఫైర్స్ పరిశీలనకు ఈ బిల్లును పంపగా.. ఆ కమిటీ కొన్ని సిఫారసులను చేసింది. వీటిని బిల్లులో చేర్చి 2003, డిసెంబర్ 16న లోక్సభ, 18న రాజ్యసభ ఆమోదం తెలిపాయి. 2004 జనవరి 1న రాష్ట్రపతి ఈ బిల్లును 91వ రాజ్యాంగ సవరణ బిల్లు-2003గా ఆమోదం తెలిపారు. రాజ్యాంగంలోని పదవ షెడ్యూల్లో ఉన్న పార్టీ చీలికకు సంబంధించిన నిబంధనలను ఈ చట్టం తొలగించింది.
పదవ షెడ్యూల్లోని రెండవ పేరాలో పేర్కొన్న విధంగా ఒక సభ్యుడు అనర్హతకు గురైతే.. అతడు మంత్రి పదవి లేదా మరే విధమైన రాజకీయ పదవిని పొందడానికి వీల్లేదని ఈ బిల్లు స్పష్టం చేసింది. సదరు సభ్యుడు అనర్హతకు గురైన తేదీ నుంచి గడువు ముగిసే వరకు లేదా లోక్సభ, అసెంబ్లీ స్థానాలకు పోటీచేసే వరకు ఈ అనర్హత వర్తిస్తుంది.
బ్రెజిల్, ఇటలీ, రొమేనియా, ఫిలిప్పీన్స్ దేశాల్లో పార్టీ ఫిరాయింపులు సర్వ సాధారణం. ఆస్ట్రేలియాలో 1916లో నేషనల్ లేబర్ పార్టీ చీలిపోయింది. 1931లో లాంగ్ లేబర్ పార్టీ, 1940 కమ్యునిస్టేతర లేబర్ పార్టీ, 1955లో యాంటీ కమ్యూనిస్ట్ లేబర్ పార్టీల్లో చీలికలు వచ్చాయి. 2024 టాస్మేనియా రాష్ట్ర ఎన్నికల్లో పోటీ చేసిన లిబరల్ పార్టీ ప్రీమియర్ జర్మీ రాక్లిఫ్ తమ పార్టీ అధికారంలోకి వస్తే పార్టీ ఫిరాయింపులను నిషేధిస్తూ రాష్ట్ర రాజ్యాంగంలో మార్పులు చేస్తామని హామీ ఇచ్చారు. పశ్చిమ దేశాల్లో అత్యధిక పార్టీ ఫిరాయింపులు చోటుచేసుకునేది ఇటలీలో! 1996-2001 మధ్యకాలంలో ఇటాలియన్ ఛాంబర్ ఆఫ్ డిప్యూటీస్ (దిగువసభ)లో 25 శాతం మంది సభ్యులు పార్టీలు ఫిరాయించారు.
పార్టీ ఫిరాయింపులను మలేసియా తీవ్రంగా పరిగణిస్తుంది. ఈ మేరకు 2022లో రాజ్యాంగ సవరణ బిల్లు (నెం.3)ను దిగువ సభ దివాన్ రక్యాత్ 2/3 మెజారిటీతో ఆమోదించింది. న్యూజిలాండ్లో పార్టీ ఫిరాయింపును ‘వాకా జంపింగ్’ అని వ్యవహరిస్తారు. పార్టీ ఫిరాయింపుల నిరోధానికి ఎలక్టోరల్ (ఇంటిగ్రిటీ) అమెండ్మెంట్ యాక్ట్-2003 పేరుతో చట్టాన్ని తీసుకురాగా.. 2005 వరకు అది అమల్లో ఉంది. దీన్ని కొనసాగించే యత్నాలు 2005లో విఫలమయ్యాయి. చివరకు 2018లో ఈ చట్టాన్ని తిరిగి అమల్లోకి తెచ్చారు. రష్యన్ ఫెడరేషన్లో పార్టీ ఫిరాయింపులను చట్టవిరుద్ధంగా పరిగణిస్తారు.
టర్కీలో పార్టీ ఫిరాయింపులు అసాధారణమేమీ కాదు. గ్రాండ్ నేషనల్ అసెంబ్లీ (టర్కీ పార్లమెంట్)లో కుబులె యుగిన్ అనే సభ్యుడు (1995-99) ఒకే టర్మ్లో ఏకంగా ఏడు సార్లు తన పార్టీకి రాజీనామా చేశారు. అంతేకాదు, నాలుగు పార్టీలు మారి, చివరకు స్వతంత్ర సభ్యుడిగా తన టర్మ్ను ముగించాడు. ఉక్రెయిన్లో ‘ఇంపరేటివ్ మ్యాండేట్’ పేరుతో రాజ్యాంగ నిబంధన అమల్లో ఉంది. దీని ప్రకారం ఉక్రెయిన్ పార్లమెంట్ ‘వర్కోవ్నా రాడా’కు ఎన్నికైన సభ్యులు తాము ఏ పార్టీ తరఫున ఎన్నికయ్యారో ఆ పార్టీ సభ్యులుగానే కొనసాగాల్సి ఉంటుంది. అమెరికాలో పార్టీ ఫిరాయింపులు చాలా అరుదు. 1947-97 మధ్యకాలంలో 20 మంది మాత్రమే పార్టీలు మారారు.
దక్షిణ పసిఫిక్ సముద్ర ప్రాంతానికి చెందిన దేశం ‘వనౌటు’లో 2024 మే 29న మొట్టమొదటిసారి పార్టీ ఫిరాయింపులపై ఒక రాజ్యాంగ పరమైన ప్రజాభిప్రాయ సేకరణ (రెఫరెండం) జరిపారు. 59.28 శాతం మంది ప్రజలు పార్టీ ఫిరాయింపులను వ్యతిరేకిస్తూ ఓటు వేయడం విశేషం. దీని ప్రకారం ఒక పార్టీ తరఫున ఎంపికైన పార్లమెంట్ సభ్యుడు, పార్టీ ఫిరాయిస్తే తన సీటు కోల్పోవాల్సి వస్తుంది.
పై అంశాలను పరిశీలిస్తే ప్రజాస్వామ్య దేశాల్లో కొన్ని ఈ పార్టీ ఫిరాయింపులను తీవ్రంగా పరిగణిస్తుంటే, మరికొన్ని దేశాలు దీన్ని ఒక పెద్ద సమస్యగా చూడకపోవడం కనిపిస్తున్నది. కానీ, పార్టీ ఫిరాయింపుల వల్ల వివిధ దేశాల్లో ప్రభుత్వాలు కుప్పకూలిపోయిన సంఘటనలు కోకొల్లలు. అంతేకాదు, వీటి వల్ల ఒక రాజకీయ పార్టీ లేదా సభ్యులు తమ విశ్వసనీయతను కోల్పోతారనడంలో ఎంతమాత్రం సందేహం లేదు.
ఒక రాజకీయ పార్టీకి చెందిన లోక్సభ సభ్యుడు స్వచ్ఛందంగా ఆ పార్టీ సభ్యత్వాన్ని వదులుకున్నప్పుడు, పార్టీ ఇచ్చిన ఆదేశాలకు వ్యతిరేకంగా ఓటు వేసినా లేదా తటస్థంగా ఉన్నా తన లోక్సభ సభ్యత్వాన్ని కోల్పోతాడు. ఒకవేళ సభ్యుడు పార్టీ నుంచి ముందస్తు అనుమతి తీసుకున్నా లేక అతడు ఆ విధంగా వ్యవహరించిన తేదీ నుంచి పదిహేను రోజుల్లోగా పార్టీ అతడిని క్షమించినా సదరు సభ్యుడిపై అనర్హత వేటు పడదు.
-జమలాపురపు విఠల్రావు
సీనియర్ జర్నలిస్ట్