US Elections | పరిస్థితులు ఒకోసారి విచిత్రంగా ఉంటాయి. ప్రస్తుతం అమెరికా అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న జో బైడెన్, డొనాల్డ్ ట్రంప్ల విషయంలో అదే కనిపిస్తున్నది. బైడెన్ ప్రస్తుతం అధ్యక్షుడు. డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిగా తిరిగి పోటీ పడుతున్నారు. ట్రంప్ మాజీ అధ్యక్షుడు. పోయినమారు బైడెన్తో కొద్ది తేడాతో ఓడిన ఆయన రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా మళ్లీ పోటీలో ఉన్నారు.
అధ్యక్ష స్థానానికి పోటీ పడే అభ్యర్థుల మధ్య వివిధ అంశాలపై బహిరంగ చర్చ జరిపే అమెరికన్ సంప్రదాయం ప్రకారం వీరిద్దరూ గురువారం రాత్రి చర్చకు తలపడ్డారు. ట్రంప్ మంచివాడు కాదని, బైడెన్ బలహీనుడని అమెరికాలో గల విస్తృతమైన అభిప్రాయం. అయినప్పటికీ బైడెన్ కన్న ట్రంప్నే తాము కోరుకుంటున్నామని ఈ చర్చ తర్వాత జరిగిన ప్రజాభిప్రాయ సేకరణలో మెజారిటీ ప్రజలు తేల్చి చెప్పారు. పరిస్థితులు ఒకోసారి విచిత్రంగా ఉంటాయనేది ఇది చూసే.
బైడెన్, ట్రంప్ల మధ్య వచ్చే నవంబర్ 4న ఎన్నికలలోగా రెండు విడతల చర్చ జరుగనున్నది. మొదటిది ఈ గురువారం రాత్రి అట్లాంటాలో సీఎన్ఎన్ వార్తా సంస్థ ఆధ్వర్యాన జరుగగా, రెండవది సెప్టెంబర్ 27న కాలిఫోర్నియాలో ఏబీసీ వార్తా సంస్థ నిర్వహించనున్నది. ఈ మొదటి చర్చలో ఏయే అంశాలు ప్రస్తావనకు వచ్చాయి? వాటిగురించి ఎవరేమి చెప్పారు? అనేవి సాధారణంగా ముఖ్యం కావాలి. దాన్ని బట్టి ఎవరి విధానాలేమిటి, అందువల్ల అమెరికా పరిస్థితి ఏ విధంగా ఉండగలదనే విషయమై ప్రజలు ఒక అభిప్రాయానికి వచ్చి ఆ ప్రకారం ఓటు చేస్తారు. అదేవిధంగా, తమ సమస్యలేమిటి, వాటికి ఎవరి వద్ద ఏ సమాధానాలు ఉన్నాయో కూడా చూస్తారు. మూడవ ముఖ్యమైన అంశం, గత నాలుగేండ్ల పాలనలో జరిగిన పొరపాట్లేమిటని ఇద్దరు అభ్యర్థులు గుర్తిస్తారు, వాటిని ఎట్లా సరిదిద్దగలమని ప్రజలకు హామీ ఇస్తారనేది కూడా పరిశీలనకు వస్తుంది. సాధారణ దేశాల్లోనే ప్రజలకు ఇటువంటి దృష్టి ఉండే స్థితిలో, అమెరికా వంటి అగ్రరాజ్యం గురించి చెప్పనక్కరలేదు.
గురువారం నాడు ఈ విధమైన అంశాలు చర్చకు రాలేదని కాదు. కాని విచిత్రమైన రీతిలో చివరికి, ఆయా అంశాలపై ఎవరేమి చెప్పారనే దానికన్న, బైడెన్, ట్రంప్లలో ఎవరు ధాటిగా మాట్లాడారు? ఆ ధాటిని ఎవరు తట్టుకోగా ఎవరు తడబడిపోయారన్నదే ప్రధానంగా మారింది. సాధారణ అమెరికన్ ప్రజలకే కాదు, అక్కడి మీడియాకు, పలువురు ఆలోచనాపరులకు, చివరికి ఇద్దరు అభ్యర్థుల మద్దతుదారులకు, సొంత పార్టీ ఆర్గనైజర్లకు కూడా. చర్చ ముగిసిన కొద్ది గంటలలోనే ఇది ఎంతవరకు పోయిందంటే, ట్రంప్ను ఓడించాలంటే బైడెన్ పోటీ నుంచి తప్పుకొని మరొక అభ్యర్థిని ఎంపిక చేసుకోక తప్పదని బైడెన్ పార్టీ ముఖ్యులే మాట్లాడటం మొదలుపెట్టారు.
న్యూయార్క్ టైమ్స్ ఎడిటోరియల్ బోర్డు ఒక బహిరంగ వ్యాసమే రాస్తూ, ట్రంప్ మంచివాడు కాదని, ఓడిపోవాలని, కాని ఆ పని బైడెన్ వల్ల కాదనే విషయం తేలినందున కొత్త అభ్యర్థిని ముందుకు తేవాలని తేల్చిచెప్పింది. చర్చను నిర్వహించిన సీఎన్ఎన్ వార్తా సంస్థ ఆ వెంటనే ప్రజాభిప్రాయ సేకరణ జరపగా, 67 శాతం మంది ట్రంప్ చర్చ బాగున్నదనగా, 33 శాతం మాత్రమే బైడెన్కు ఓటు వేశారు. ఎవరి చర్చ బాగుండవచ్చునని చర్చకు ముందు పోలింగ్ జరుపగా ట్రంప్కు 55 శాతం, బైడెన్కు 45 శాతం వచ్చిన ఓట్లు చర్చ తర్వాత ఆ విధంగా మారిపోయాయి. ఇదంతా చాలదన్నట్టు, ఆ మరునాడు శుక్రవారం నార్త్ కాలిఫోర్నియాలో జరిగిన ఎన్నికల సభలో బైడెన్ తన దెబ్బతిన్న ప్రతిష్టను తిరిగి సంపాదించుకునేందుకు ప్రయత్నిస్తూ దృఢంగా మాట్లాడనైతే మాట్లాడారు. కాని అదే సమయంలో, ‘నేను ఇదివరకంత తేలికగా నడవలేను. ఇది వరకంత సాఫీగా మాట్లాడలేను. ఇదివరకంత బాగా చర్చలో పాల్గొనలేను’ అనటంతో మిగిలిన పరువు కూడా పోయింది. తన మద్దతుదారులకు గుండెలు ఇంకా దిగజారి ఉంటాయి.
ట్రంప్ వయసు 78 కాగా, బైడెన్కు 81 ఏండ్లు. గురువారం నాటి చర్చలో బైడెన్ మాటలు చాలాసార్లు తడబడ్డాయి. ఆయనకు వయస్సు మీరుతున్నందున సరిగా మాట్లాడలేకపోతున్నారని, ఆలోచనలకు, మాటలకు ఒకోసారి లంగరందక మధ్య మధ్య అంతరాయాలు వస్తున్నాయనే విమర్శలు సుమారు రెండేండ్లుగా ఉన్నాయి. ట్రంప్ వయస్సు కూడా తక్కువ కాదు గాని ఆయనకు ఇటువంటి సమస్యలు లేవు. ఇదంతా గురువారం నాడు ప్రతిఫలించింది. ట్రంప్ ధాటితో బైడెన్ మరింతగా తడబడ్డారు. వయసు మీరిన బైడెన్ మరొక నాలుగేండ్లు అధ్యక్ష బాధ్యతలను నిర్వహించలేరని గతం నుంచే అభిప్రాయాలున్న స్థితిలో ఆయన స్వయంగానైనా పోటీకి దూరంగా ఉండవలసింది. లేదా తన పార్టీ ఆ నిర్ణయం తీసుకోవలసింది. గురువారం నాటి చర్చ దరిమిలా ఈ చేదుమాటలు అందరికీ తెలిసివచ్చి ఉండాలి. కానీ, ఒకవేళ అభ్యర్థిని మార్చదలిచినా ఈ దశలో సాధ్యమా అనే ప్రశ్న ఉంది.
అసాధ్యమని, లేదా కష్టం మీద సాధ్యమనే చర్చలు ఇప్పటికే పార్టీలో మొదలయ్యాయి. ఏది జరగాలన్నా మొదట బైడెన్ అంగీకరించవలసి ఉంటుందని, ఆయన సుముఖంగా కన్పించటం లేదని కొన్ని వార్తలు వెలువడ్డాయి. ఈ విధమైన చర్చలు, విమర్శలు రాగల వారాలలోనూ సాగుతూనే ఉంటాయి. బైడెన్కు అనుకూలంగా జరిగేది బహుశా ఏమీ ఉండకపోవచ్చు. అనగా తనతో పాటు తన పార్టీ నైతిక బలం ఇంకా తగ్గుతుందనుకోవాలి. ఈ పరిస్థితుల మధ్య సెప్టెంబర్ 27 కాలిఫోర్నియా చర్చ ఏవైనా అద్భుతాలు చేయగలదా? చివరికి ఏమి జరిగినా, జరగకున్నా అసలు ఇటువంటి చర్చే బైడెన్కు అవమానకరమని వేరే చెప్పనక్కరలేదు. ఇదిలా ఉండగా బైడెన్ వైఫల్యాన్ని గమనించిన విరాళాల దాతలు ఇప్పుడు అందుకు సందేహిస్తున్నారట!
ఇదంతా బైడెన్, ట్రంప్ల చర్చాశైలి, ఆరోగ్యస్థితికి సంబంధించిన విషయం. ఓటర్లకు ఇరువురి విధానాలు, పరిపాలనలకన్న ఇవే తక్షణ సమస్యలుగా మారటం ఒక విచిత్ర స్థితి. అట్లాగని ఇతర అంశాలు చర్చకు రాలేదని, అవి ప్రజల దృష్టిలో లేవని కాదు. మొదట చెప్పుకొన్నట్టు ట్రంప్ అధ్యక్ష కాలానికి, వ్యక్తిగత వ్యవహరణకు సంబంధించి విమర్శలు చాలానే ఉన్నాయి. ఆయన పోయినసారి ఓడినపుడు తన సమర్థకులు అధ్యక్ష భవనంపై దాడి చేయటం, ఆయన వెంటనే పదవిని వదిలి వెళ్లిపోకపోవటం, నల్ల జాతీయులపై, మెక్సికన్ వలసదారులపై దాడులు, కొవిడ్ సమస్యను నిర్లక్ష్యం చేయటం, వేశ్యలతో సంబంధాలు, తరచూ అబద్ధాలు చెప్పటం, ఈ చర్చ సందర్భంగానూ కొన్నిసార్లు అదే పనిచేయటం వంటి తీవ్రమైన విమర్శలు ఆయనపై ఉన్నాయి. అవి గతంలో ఉండగా చర్చ సమయంలో బైడెన్ వాటిని ప్రస్తావించి ట్రంప్ను ఆత్మరక్షణలోకి నెట్టజూశారు. కానీ, ప్రజలు ఒకసారి ఒకరిని బలపరచేందుకు మానసికంగా సిద్ధమైనప్పుడు, వారు చెప్పేవి అసత్యాలని తెలిసినప్పటికీ మారరు. ఇదొక గమనించదగ్గ విశేషం.
ట్రంప్పై ఈ తరహా విమర్శలను గత నాలుగేండ్లుగా వింటున్న అమెరికన్లు అందుకు అలవాటుపడిపోయారు. వారికి తమ నిత్య జీవిత సమస్యలు ప్రధానంగా మారాయి. అటువంటి సమస్యలు లేని వర్గాలకు మాత్రం ట్రంప్ ఇంకా విలన్గా నిలిచిపోయారు. వాస్తవానికి గత ఎన్నికల్లోనూ దిగువస్థాయి వర్గాలు ట్రంప్ను పూర్తిగా బలపరిచాయి. ఆయనపై అప్పటికి ఉండిన కొన్ని ఆరోపణలను విస్మరించాయి. బైడెన్ అధ్యక్షుడైన నాలుగేండ్లలో ట్రంప్ గురించిన మరికొన్ని విమర్శలు వెలువడ్డాయి. కానీ, తన మద్దతుదారులు వీటిని కూడా పట్టించుకోవటం లేదు. దీనికి సంబంధించే బైడెన్ నాలుగేండ్లలో ముఖ్యమైనవి రెండు జరుగుతున్నట్టు ఈ వర్గాల ప్రజలు భావిస్తున్నారు. అందులో మొదటిది ఆర్థికవ్యవస్థ బలహీనపడుతూ ఉపాధి కల్పన దెబ్బతింటుండటం.
రెండవది, అక్కరలేని ఉక్రెయిన్ యుద్ధాన్ని సృష్టించి అందుకు లక్షల కోట్ల డాలర్లు, అంతులేని ఆయుధాలు ధారపోయటం. బైడెన్ నాయకత్వం నాటో సైనిక కూటమిని రష్యా వైపు విస్తరిస్తున్న కారణంగానే తమ భద్రత కోసం భయపడుతున్న రష్యా, ఉక్రెయిన్పై దాడికి సమకట్టిందన్నది అందరికీ తెలిసిన విషయమే. ఇరువురి మధ్య రాజీ ప్రయత్నాలను కూడా అమెరికా సాగనివ్వటం లేదు. మొత్తానికి ఆ యుద్ధానికి అవుతున్న భారీ వ్యయాన్నంతా తమపై పన్నుల రూపంలో వసూలు చేస్తున్నారన్నది అమెరికా సామాన్యుల నిరసన. అదే స్థితి వల్ల ధరల పెరుగుదల, నిరుద్యోగం, జీవన ప్రమాణాల పతనం మొదలైనవి జరుగుతున్నాయన్నది వారి ఫిర్యాదు. ఈ సమస్యలను ట్రంప్ కొంత కాలం నుంచే ప్రస్తావిస్తూ, ఇప్పుడు చర్చ సందర్భంగా తిరిగి బలంగా లేవనెత్తారు. తాను ఎన్నికైన పక్షంలో ప్రమాణ స్వీకారానికి ముందే పుతిన్, జెలెనిస్కీలతో మాట్లాడి రాజీ కుదర్చగలనని ప్రకటించటం సామాన్య ప్రజలను బాగా మెప్పించినట్టు కనిపిస్తున్నది. అది సాధ్యమా అన్నది వేరే ప్రశ్న.
గాజా యుద్ధం మరొక ముఖ్యాంశం. స్వయంగా యూదులైన బైడెన్, ట్రంప్ ఇద్దరూ ఇజ్రాయెల్ సమర్థకులే. కానీ, ఆ పని ట్రంప్ మాటలలో చేస్తుండగా, చేతల రూపంలో చేస్తున్న బైడెన్ అన్నివర్గాల ప్రజల్లో ఆ మేరకు వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. ఇజ్రాయెల్ ఎంత దారుణమైన హత్యాకాండ సాగిస్తున్నా కుప్పతెప్పలుగా ఆయుధాలను, నిధులను నిరంతరం సరఫరా చేయటం, ఐక్యరాజ్యసమితి, అంతర్జాతీయ న్యాయస్థానం సహా ప్రపంచ జనాభిప్రాయాన్ని ఖాతరు చేయక ఇజ్రాయెల్ను బలపరచటం బైడెన్ను ఒక సహ హంతకునిగా నిలబెడుతున్నది. పైన పేర్కొన్న వ్యక్తిగత బలహీనతలకు తోడు ఇటువంటి వివిధాంశాలు అన్నీ బైడెన్కు వ్యతిరేకంగా మోహరిస్తున్నట్టు భావించాలి. అందువల్లనే, ట్రంప్కు ఒక నో రిమార్క్ వచ్చినా బైడెన్కు రెండు నో రిమార్కులు వస్తున్నట్టు కనిపిస్తున్నది. మొత్తమ్మీద, ఒక గొప్ప ప్రజాస్వామిక దేశంగా భావించే అమెరికా అధ్యక్ష అభ్యర్థులలో ఎవరైనా గొప్పవారున్నారా అన్నది బయటి ప్రపంచానికి కలిగే సందేహం.
-టంకశాల అశోక్