NEET | వైద్య కళాశాలల్లో ప్రవేశాల కోసం జాతీయ స్థాయిలో నిర్వహించే అర్హత పరీక్ష నీట్ వల్ల దక్షిణాదికి తీవ్ర అన్యాయం జరుగుతున్నది. గత రెండు, మూడేండ్ల టాప్-100 ర్యాంకులను పరిశీలిస్తే.. ఈ విషయం స్పష్టమవుతుంది. టాప్-100లోపు ర్యాంకుల్లో గతంలో దక్షిణాది విద్యార్థులు, మరీ ముఖ్యంగా తెలుగువారు ఎక్కువగా కనిపించేవారని విశ్లేషకులు చెప్తున్నారు. ఈ మధ్యకాలంలో ఆ జాబితాలో దక్షిణాది విద్యార్థుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పడుతున్నది. ఈ ఏడాది టాప్-100 జాబితాలో తెలుగు విద్యార్థులు నలుగురు మాత్రమే ఉండటం గమనార్హం.
నీట్ను ఆఫ్లైన్లో నిర్వహిస్తుండటంతో ఉత్తరాదిలోని పలు రాష్ర్టాల్లో పేపర్ లీకేజీ ఘటనలు జరుగుతున్నాయి. కొన్నిచోట్ల పరీక్షా కేంద్రాల్లో మాస్కాపీయింగ్ జరుగుతున్నదని వైద్య నిపుణులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బీహార్, ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్. రాజస్థాన్, గుజరాత్ తదితర రాష్ర్టాల్లో ప్రశ్నాపత్రం లీక్ అవడం, ఇన్విజిలేటర్లు సాయం చేయడం వంటి అవకతవకలు జరుగుతున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ కారణంగానే ఉత్తరాది రాష్ర్టాల విద్యార్థులకు ఎక్కువ ర్యాంకులు వస్తున్నాయని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తాజా పేపర్ లీకేజీ ఉదంతం అందుకు మరింత బలాన్ని చేకూరుస్తున్నది.
సాధారణంగా వివిధ రాష్ర్టాల్లోని కళాశాలల్లోని 15 శాతం సీట్లు ఆల్ ఇండియా కోటా కిందికి వర్తిస్తాయి. నీట్లో మంచి ర్యాంకు వచ్చినవారికే ఈ సీట్లు దక్కుతాయి. అవకతవకల కారణంగా ఈ సీట్లన్నీ ఉత్తరాది విద్యార్థులు కొల్లగొడుతున్నారు. దాంతో పాటు ఎయిమ్స్ లాంటి ప్రతిష్ఠాత్మక వైద్య విద్యాసంస్థల్లోనూ వారే ప్రవేశం పొందుతున్నారు. అంతేకాదు, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్ల నుంచి నీట్ రాసే విద్యార్థుల సంఖ్య ఏటా పెరుగుతూనే ఉన్నది. పైన పేర్కొన్న రాష్ర్టాలతో పాటు ఢిల్లీ నుంచి 2018లో 4,78,255 మంది విద్యార్థులు నీట్కు హాజరుకాగా.. 2024లో ఆ సంఖ్య 11,57,180కు చేరుకున్నది. 2018లో 13.26 లక్షల అభ్యర్థులు నీట్ రాసేందుకు నమోదు చేసుకోగా.. 2024లో 24.06 లక్షల మంది నమోదు చేసుకున్నారు.
దక్షిణాదిలోని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, కేరళలో వైద్య కళాశాలలు పెరిగాయే తప్ప నీట్ రాసే విద్యార్థుల సంఖ్య మాత్రం పెరగలేదు. 2018లో దక్షిణాదిలోని ఐదు రాష్ర్టాల నుంచి 4,24,523 మంది నీట్కు హాజరుకాగా.. 2024 నాటికి ఆ సంఖ్య స్వల్పంగా పెరిగి 5,82,845కే పరిమితమైంది. ఇక దేశవ్యాప్తంగా 2018 నాటికి 499 మెడికల్ కాలేజీలు ఉండగా.. వాటిలో 70,012 ఎంబీబీఎస్ సీట్లు ఉండేవి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 706 మెడికల్ కాలేజీలు ఉండగా వాటిలో 1,08,940 సీట్లున్నాయి. ఉత్తరాదిలో విద్యార్థుల సంఖ్య పెరుగుతున్నదే తప్ప కళాశాలల సంఖ్య పెరగడం లేదు. వీటిలో దక్షిణాదిలోనే మొత్తం 270 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. అంటే దేశంలోని మొత్తం వైద్య కళాశాలల్లో 38 శాతం దక్షిణాదిలోనే ఉన్నాయి. ఇక సీట్ల విషయానికొస్తే.. దక్షిణాదిలో 43,525 సీట్లు ఉండగా.. దేశంలోని మిగతా రాష్ర్టాల్లో 65,415 సీట్లున్నాయి.
దక్షిణాదిలో భారీగా కళాశాలలు, సీట్లు ఉన్నప్పటికీ విద్యార్థులకు మాత్రం ప్రవేశాలు దక్కడం లేదు. గడచిన మూడేండ్లుగా టాప్-100 జాబితాలో దక్షిణాది, ముఖ్యంగా తెలుగు రాష్ర్టాలకు చెందిన విద్యార్థుల సంఖ్య తగ్గుతూ వస్తున్నది. గతంలో ఈ జాబితాలో మనోళ్లు కనీసం 2530 మంది ఉండేవారు. నిరుడు 687కు పైగా మార్కులను సుమారు వెయ్యి మంది సాధించగా.. అందులో 40 మంది తెలుగువారే. ఈసారి 687కు పైగా మార్కులు సాధించిన వారి సంఖ్య దాదాపు ఏడు వేలకు పెరిగింది. అయినప్పటికీ మన తెలుగువాళ్ల ప్రాతినిధ్యం మాత్రం పెరగలేదు.
అవకతవకల నేపథ్యంలో నీట్ను రద్దు చేసి మరోసారి పరీక్షను నిర్వహించాలి. ఈసారి ఆన్లైన్లోనే నిర్వహించి అవకతవకలకు చెక్ పెట్టాలి. అ దేసమయంలో ఎన్టీయేను ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉన్న ది. తద్వారా తెలంగాణ విద్యార్థులతో పాటు దక్షిణాదికి మేలు జరుగుతుంది.
పుల్లెంల గణేష్
95530 41549