నూతన ప్రభుత్వం కొలువు తీరాక గత వారం రోజుల పాటు జరిగిన తొలి పార్లమెంట్ సమావేశాల్లో ఇరు సభలు దద్దరిల్లిపోయాయి. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై సాగిన చర్చల్లో ప్రభుత్వ, విపక్షాల నేతల ప్రసంగాలు కొత్త వేడిని పుట్టించాయి. గత పదేండ్లుగా ఏకపక్షంగా సాగిన సభా కార్యక్రమాలకు ఎంతో భిన్నంగా ఇవి ప్రజాస్వామ్య స్ఫూర్తితో కొనసాగాయి. సభలో పెరిగిన విపక్షాల బలం వారి గొంతుల్లోనూ ప్రతిధ్వనించింది. కాంగ్రెస్కు ప్రతిపక్ష హోదా ఇచ్చి ప్రజలు దేశానికి ఎంతో మేలు చేశారని ఈ సమావేశాల తీరు తెలుపుతున్నది.
జూలై 1న లోక్సభలో తొలుత ప్రతిపక్షనేతగా రాహుల్గాంధీ, ఆ తర్వాతి రోజున ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడారు. ఇరువురి మాటలు వాగ్బాణాల యుద్ధాన్ని తలపించాయి. రాహుల్గాంధీలో తన వెనుక రెండు వందలకు పైగా సభ్యులున్నారన్న ధీమా కనబడింది. ఇండియా కూటమి సభ్యులు కూడా ఒకరిని మించి ఒకరన్నట్టు ప్రభుత్వాన్ని వివిధ అంశాలపై నిలదీశారు. పాలక పక్షమైన ఎన్డీయే వీరి గొంతుల ముందు చిన్నబోయిందనే చెప్పాలి. ఈ విమర్శలను తట్టుకోలేక ప్రధాని మోదీ స్వీయ రక్షణలో పడ్డారనవచ్చు. విపక్షాలు స్పష్టంగా ప్రస్తుత సమస్యలను ఎత్తిచూపితే ప్రధాని గత చరిత్ర తవ్వుతూ కాంగ్రెస్పై విరుచుకుపడే ప్రయత్నం చేశారు.
సభలో బీజేపీ హిందుత్వంపై రాహుల్ చేసిన మాటల దాడి ఎంతో సాహసోపేతమైనది. మతం పేరుతో వైషమ్యాలను, హింసను రేకెత్తిస్తున్న బీజేపీ దేశంలో హిందువులకు ప్రతినిధి కానేకాదని దృఢంగా అన్నారు. దేవుళ్ల ఫొటోలు చూపుతూ వీరందరూ శాంతిని బోధించారని, మీరేమో అశాంతిని సృష్టిస్తున్నారని, ఈ లెక్కన మీరు హిందువులే కారని ఘాటుగా విమర్శించారు. మీ పక్షాన లేని హిందువుల ఓట్ల వల్లనే కాంగ్రెస్ 99 సీట్లు, ఇండియా కూటమి 234 స్థానాల్లో గెలిచిందని, ఈ ఫలితాలే దేశంలో హిందువులంతా బీజేపీ వైపు లేరని రుజువు చేస్తుందన్నారు. హిందువులందరూ గంపగుత్తగా బీజేపీ పక్షం కాదనే వాస్తవాన్ని స్థిరపరచేందుకు రాహుల్గాంధీ ప్రయత్నించారు. దేశంలో అన్ని సమస్యల కన్నా ఇదే పెద్ద సమస్య. మతం పేరు మీద ఓట్లు కొల్లగొట్టాలనుకొనే బీజేపీ తంత్రం ఇక సాగకూడదనే సంకల్పం ఆయన మాటల్లో కనబడింది. ‘తమను తాము హిందువులనుకొనేవారు 24 గంటలు దేశంలో హింసను, విద్వేషాన్ని, అసత్యాన్ని పెంచుతున్నారని’ అన్నారు. వెంటనే లేచిన ప్రధాని ‘ఇదీ ఎంతో తీవ్రమైన విషయం. మొత్తం హిందూ జాతిని హింసావాదులుగా చిత్రిస్తున్నారు’ అని అన్నారు. ‘కాదు, కాదు.. నా మాటలు కేవలం బీజేపీకి, ఆరెస్సెస్కు మాత్రమే వర్తిస్తాయి’ అని రాహుల్ అదేస్థాయిలో సమాధానమిచ్చారు. బీజేపీ ఒక రాజకీయ పార్టీ తప్ప దేశంలోని హిందువులందరూ తమకు ప్రతినిధిగా దానిని భావించడం లేదనే సత్యం లోకానికి తెలియజెప్పే ప్రయత్నం ఆయన చేశారు. మతతత్వాన్ని పట్టుకొని బీజేపీ దేశ పాలనలో ముందుకు సాగకుండా కట్టడి చేసే విధంగా ఆయన ప్రసంగం సాగింది. హిందువులంతా తమ వెంట ఉన్నారనే బీజేపీ భావనను దెబ్బ తీసేందుకు ఆయన అన్నివిధాలా సాహసించారు.
నిండు సభలో ప్రధానిగా మోదీ ఇంత ఘాటైన విమర్శను ఎదుర్కోవడం ఇదే మొదటిసారి. ఆయన ముఖంలో గంభీరతతోపాటు విచారం కూడా కనబడింది. విపక్ష నేతలుగా టీఎంసీ సభ్యులు మహువా మొయిత్రా, కళ్యాణ్ బెనర్జీ ప్రసంగాలు మోదీని నిలదీసేలా ఉన్నాయి. రాచరిక చిహ్నమైన సింగోల్ను కొత్త పార్లమెంట్లో ప్రతిష్టించినందుకు బదులుగా బీజేపీ 63 సీట్లు కోల్పోయిందని మొయిత్రా విమర్శించారు. రాష్ట్రపతి ప్రసంగంలో దేశ ప్రజలు స్థిరమైన ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారన్నారు. అది పూర్తిగా అసత్యం. వారి ప్రసంగంలో మణిపూర్ ప్రస్తావన లేదు. తన ప్రసంగ ఆరంభ సమయంలో సభలోంచి వెళ్లిపోతున్న మోదీని ‘అలా వెళ్లకండి మోదీజీ, నా మాటలు వినండి!’ అంటూ ఆమె కోరారు. కళ్యాణ్ ముఖర్జీ ప్రసంగంలో మోదీ ప్రభుత్వానికి ఉన్న సంఖ్యాబలాన్ని ఎద్దేవా చేశారు. రెండు పార్టీలు పక్కకు జరిగితే కూలిపోయే సర్కారును సుస్థిర ప్రభుత్వం అనడంపై అభ్యంతరం తెలిపారు. మోదీ గ్యారంటీలకు వారంటీ లేదన్నారు. అఖిలేష్ యాదవ్ మాట్లాడుతూ అయోధ్యలో బీజేపీ ఓటమి రాముడి నిర్ణయమన్నారు.
ప్రధాని మోదీ మాట్లాడుతూ కాంగ్రెస్ చరిత్రను లేవనెత్తారు. అంబేద్కర్ను నెహ్రూ ఇబ్బంది పెట్టారని, ఇందిరా గాంధీ ఎమర్జెన్సీ విధించారని, వరుసగా పదేండ్లు పాలనకు దూరమున్నందున నిరాశతో మాట్లాడుతున్నారన్నారు. తనకు 99 మార్కులు వచ్చాయని కొడుకు తల్లికి ప్రోగ్రెస్ రిపోర్ట్ చూయిస్తే ఇవి వందకు కాదు, 543లో అని తల్లి సర్దిచెప్పిందని, సైకిల్పై నుంచి పిల్లవాడు పడితే, ఆయన నిరుత్సాహపడకుండా చీమ అడ్డం రావడం వల్ల పడ్డావు, తప్పు నీదేంలేదు అని ఓదార్చినట్లు అంటే పిట్ట కథలు చెప్పారు. రాహుల్ మాటలన్నీ పిల్లచేష్టలుగా ఉన్నాయంటూ కొట్టిపారేశారు. సభా మర్యాదను భంగపరిచేలా, హిందువులను కించపరిచేలా మాట్లాడిన రాహుల్ మాటలను తేలిగ్గా తీసుకోవద్దని, తగిన చర్యలు తీసుకోవాలని ఆయన స్పీకర్ను కోరారు.
లోక్సభా కార్యక్రమాలను ఎందరో టీవీల్లో లైవ్లో చూసి ఉంటారు. మళ్లీ పార్లమెంట్ సమావేశాలకు కళ వచ్చిందనిపించింది. ప్రధానిగా మోదీ విపక్షాల జోరును ఎదుర్కోవడం ఇదే మొదటిసారి. సభ సమఉజ్జీగా సాగుతూ ఎన్నో ప్రజా సమస్యలను, ప్రభుత్వ తప్పిదాలను సూటిగా ప్రశ్నించే అవకాశం విపక్షాలకు లభించింది. ఇదీ ప్రజా విజయం.
-బి.నర్సన్
94401 28169