రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ కొలువుదీరి సుమారు ఏడు నెలలు కావస్తున్నది.వంద రోజుల్లో నెరవేరుస్తామన్న హామీలు నెరవేరకపోగా పరిపాలన గాడి తప్పుతున్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒక్కో రంగం సంక్షోభం వైపు ప్రయాణిస్తున్న తీరు ఆందోళన కలిగిస్తున్నది.
Congress Govt | కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి నిరుద్యోగులను, చిరుద్యోగులను, వారి ఆశలనూ సోపానాలుగా వాడుకున్నది. లైబ్రరీల చుట్టూ, కోచింగ్ సెంటర్ల చుట్టూ రాహుల్గాంధీ, దీపా మున్షీలతో సహా కాంగ్రెస్ నాయకులందరూ చక్కర్లు కొట్టారు. వీరికి తోడుగా తమను తాము ప్రశ్నించే గొంతుకలుగా ప్రచారం చేసుకున్న మరికొన్ని నోళ్లు కూడా తోడై నిరుద్యోగుల్లో భ్రమలను పెంచారు. బీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రెచ్చగొట్టారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే నిరుద్యోగుల ఆకాంక్షలు నెరవేరుతాయని నమ్మబలికారు. ఢిల్లీ స్థాయిలోని అగ్రశ్రేణి కాంగ్రెస్ నేతలు తమ దగ్గరికి వచ్చి హామీలివ్వడంతో సహజంగానే ఉద్యోగార్థులు ఆశలు పెంచుకున్నారు.
గత ప్రభుత్వంలో కన్నా మిన్నగా తమ ప్రయోజనాలు నేరవేరుతాయనే గంపెడాశతో కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకురావడానికి పూనిక వహించారు. రాష్ట్రంలో గడప గడపా తిరిగీ, ప్రతి ఓటరునూ గదుమ పట్టుకొని బతిమిలాడి తమ ముఖం చూసి కాంగ్రెస్కు ఓటు వేయాలని కోరారు. అయితే నిరుద్యోగులను వాడుకొని గద్దెనెక్కిన కాంగ్రెస్.. నిరుద్యోగుల ఆశల మీద తట్టెడు మన్ను పోసింది. అధికారంలోకి వచ్చి సుమారు ఏడు నెలల కాలం గడిచిపోయింది. ఒక్కటంటే ఒక్క కొత్త నోటిఫికేషన్ రాలేదు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన గ్రూప్-1 నోటిఫికేషన్ను రద్దుచేసి నామ మాత్రంగా కొన్ని పోస్టులు కలిపి ఇదే కొత్త నోటిఫికేషన్ పొమ్మన్నారు. మొదటి క్యాబినెట్లోనే 25 వేల ఉపాధ్యాయ పోస్టులతో మెగా డీఎస్సీ ప్రకటిస్తామని చెప్పిన కాంగ్రెస్ ఇక్కడ కూడా పాత నోటిఫికేషన్కు అదనంగా 5 వేల పోస్టులు కలిపి చేతులు దులుపుకొన్నది. మెగా డీఎస్సీని దగా డీఎస్సీగా మార్చింది. దీంతో నిరుద్యోగుల గుండెలు భగ్గుమన్నాయి.
ఎన్నికల సందర్భంలో ఇచ్చిన హామీకి కట్టుబడి, గ్రూప్-1 పోస్టులు మరో 2,000 పెంచాలని, గ్రూప్-3కి సంబంధించి మరో 3000 పెంచాలనీ, 25 వేల పోస్టులతో మెగా డీఎస్సీకి నోటిఫికేషన్ ఇవ్వాలని నిరుద్యోగులు ఆందోళనకు దిగారు. ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు గ్రూప్-1 మెయిన్స్కు 1:100 చొప్పున అనుమతించాలని బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అసెంబ్లీ వేదికగా డిమాండ్ చేశారు. ఇప్పుడు అదే డిమాండ్ అభ్యర్థులు చేస్తుంటే సాంకేతిక కారణాల రీత్యా సాధ్యం కాదని అణచివేతకు దిగుతున్నారు. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు కనిపించని సాంకేతిక కారణాలు అధికారంలోకి రాగానే ఎందుకు కనిపిస్తున్నాయనే అభ్యర్థుల ప్రశ్నకు ప్రభుత్వం నుంచి సమాధానం రావడం లేదు. నిరుద్యోగులు కోరుతున్నవి గొంతెమ్మ కోరికలేమీ కాదు. అన్నీ కాంగ్రెస్ ఇచ్చిన ఎన్నికల హామీలే. ఎంత విచిత్రమంటే పరీక్షకు పరీక్షకు మధ్య కొంత వ్యవధి ఇవ్వాలని, తద్వారా ప్రిపరేషన్ విషయంలో తమపై ఒత్తిడి లేకుండా చూడాలనే చిన్న కోరికను కూడా చెవిన పెట్టడం లేదంటే ఈ ప్రభుత్వం ఎంత అహానికి పోతున్నదో అర్థం చేసుకోవచ్చు. గురుకుల టీచర్ పోస్టుల భర్తీలోని అవకతవకలను సవరించాలని రోడ్డెక్కిన వాళ్ల దిక్కు చూసిన పాపాన పోవడం లేదు.
రెండు లక్షల ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని చెప్తూ మ్యానిఫెస్టోలో తేదీల వారీగా షెడ్యూల్ను కూడా పేర్కొన్న కాంగ్రెస్ ఇప్పుడు అంతా తూచ్ అంటూ ఉల్టా నిరుద్యోగులను నిందిస్తున్నది. నిన్నటిదాకా నిరుద్యోగులను తమ మిత్రులుగా ప్రచారం చేసుకున్న కాంగ్రెస్ నేడు దుష్మన్లుగా చూస్తున్నది. పోస్టుల సంఖ్యను పెంచరు, మెగా డీఎస్సీ వేయరు, పరీక్షల తేదీలు మార్చరు, ఇస్తామన్న నిరుద్యోగ భృతి ఇవ్వరు, జాబ్ క్యాలెండర్ అయితే పత్తా లేదు. ఈ దశలో తమ డిమాండ్ల సాధన కోసం మోతీలాల్ నాయక్ అనే విద్యార్థి నాయకుడు ఆమరణ నిరాహార దీక్షకు పూనుకోవాల్సి వచ్చింది. ఆయన నిరాహార దీక్షకు బీఆర్ఎస్, ఇతర ప్రతిపక్ష పార్టీలు మద్దతు పలికాయి. గత దశాబ్ద కాలంలో బీఆర్ఎస్కు వ్యతిరేకంగా ఎక్కడ నిరసన టెంటు వేసినా అక్కడ జరూరుగా ప్రత్యక్షమైన సోకాల్డ్ సివిల్ సొసైటీ పెద్దలకు మోతీలాల్ మొర వినిపించడం లేదు, దీక్ష కనిపించడం లేదు.
సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యతను విస్మరించి బుజ్జగింపులకు దిగుతున్న కాంగ్రెస్ నాయకుల కపట వైఖరిని నిరుద్యోగులు అడుగడుగునా ఎదిరిస్తున్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం దిగివచ్చి నిరుద్యోగులకు తాము ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలి. నిరుద్యోగుల ఆకాంక్షలు నెరవేర్చాలి. లేదా ఏ నిరుద్యోగుల భుజాల మీద ఎక్కి గద్దెపై కూర్చున్నారో అదే నిరుద్యోగుల నిరసన జ్వాలలు ఈ ప్రభుత్వాన్ని నిలువునా దహించకమానవు. తమది కంచెలు లేని ప్రభుత్వమనీ, సామాన్యులకు అందుబాటులో ఉంటూ జనరంజక పాలన అందించే ప్రభుత్వమనీ, తమ పాలన ప్రజాపాలన అనీ డాంబికాలు పలికిన కాంగ్రెస్ నేతలు.. ఇప్పుడు పోలీసుల భద్రతా వలయాలలో, తుపాకుల, లాఠీల పరిరక్షణలో, నిరుద్యోగులకు అందకుండా తిరుగుతున్నారు, అణచివేతలకు పాల్పడుతున్నారు. ఇదంతా ప్రజాస్వామ్యమే అని సోకాల్డ్ మేధావులు కితాబులిస్తున్నారు. ఇదీ సాడే సాత్ సర్కార్ పాలనా వ్యవహారం.
ఇక క్షేత్రస్థాయిలో పనిచేసే చిరుద్యోగుల పరిస్థితి కనాకష్టంగా మార్చింది కాంగ్రెస్ ప్రజా పాలన. బీఆర్ఎస్ ప్రభుత్వం గ్రామీణ జీవన ప్రమాణాలు పెంచేందుకు పల్లెప్రగతి కార్యక్రమాన్ని చేపట్టి గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సౌకర్యాల కల్పన చేసింది. ప్రతి గ్రామ పంచాయతీకి ట్రాక్టర్, ట్యాంకర్ అందుబాటులోకి తెచ్చింది. దీంతో చెత్త సేకరణ చక్కగా జరిగింది. గ్రామాల్లో పరిశుభ్రత పెరిగింది. పారిశుధ్యం మెరుగుపడటంతో ప్రజలు రోగాల బారినపడే ప్రమాదం తప్పింది. గ్రామ సీమలు పచ్చగా వర్ధిల్లాయి.
కాంగ్రెస్ సర్కారు ఈ ఏడు నెలల్లో గ్రామాలను తిరిగి మురికి కూపాలుగా మార్చే దిశగా పయనిస్తున్నది. ట్రాక్టర్లు నడిపేందుకు కావాల్సిన డీజిల్ కోసం డబ్బులు విడుదల చేయకపోవడంతో అవి నిరుపయోగంగా పడిఉన్నాయి. కొన్నిచోట్ల అధికారులు అప్పులు చేసి ట్రాక్టర్లలో డీజిల్ పోయిస్తున్నారంటే పరిస్థితి ఎంత అధ్వాన్నంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. గ్రామ పంచాయతీలలో పారిశుధ్యాన్ని నిర్వహించే మల్టీ పర్పస్ వర్కర్స్కు ఏడు నెలలుగా వేతనాలు ఇవ్వలేదు. వారు అలో లక్ష్మణా అని అలమటిస్తున్నారు. దీంతో ప్రజలు అపరిశుభ్రతతో వచ్చే వ్యాధుల బారిన పడి దవాఖానాల చుట్టూ తిరుగవలసి వస్తున్నది. వర్షాకాలం కూడా కావడం వల్ల రాబోయే రోజుల్లో ఇది మరింత ముదిరే ప్రమాదం ఉన్నది.
ప్రజలకు, దవాఖానాలకు మధ్య వారధిగా పనిచేసే ఆశా వర్కర్లు కూడా జీతాలు లేక అలమటిస్తున్నారు. విధిలేక ధర్నాలకు దిగుతున్నారు. బీఆర్ఎస్ పరిపాలనలో ఆశాలకు ఇచ్చే పారితోషికం రూ.1500 నుంచి రూ.9750కి పెరిగింది. కాంగ్రెస్ చెప్పిన మార్పు ఫలితంగా తమ జీతాలు మరింత పెరుగుతాయని ఆశించిన ఆశాలకు తీవ్ర ఆశాభంగం ఎదురైంది. అంగన్వాడీలదీ అదే పరిస్థితి. బీఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో అంగన్వాడీలకు ఇచ్చే వేతనం రూ.4,200 నుంచి రూ.13,650లకు పెరిగింది. వీరి జీతం రూ.18 వేలకు పెంచుతామని కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో ఆడంబరంగా ప్రకటించింది. ఇప్పుడు యథావిధిగా మొండిచేయి చూపిస్తున్నది. అంగన్వాడీ కేంద్రాల అద్దెలు కూడా చెల్లించక ప్రభుత్వం వారిని అనేకరకాల తిప్పలు పెడుతున్నది. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకానికి అవసరమైన నిధులను కాంగ్రెస్ సర్కార్ ఇవ్వడం లేదు. చివరికి వంట చేసే సిబ్బందికి ఇచ్చే కొద్ది మొత్తాన్ని కూడా చెల్లించక ఉసురు పోసుకుంటున్నది.
ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులకు 5 విడతల కరువు భత్యం ఇవ్వవలసిన ఉన్నది. అధికారంలోకి రాగానే తక్షణమే చెల్లిస్తామని చెప్పిన సర్కార్ ఇప్పటివరకు ఒక్క విడత కరువు భత్యం కూడా చెల్లించలేదు. మార్చి నుంచి రిటైర్ అయిన ఉద్యోగులకు వారి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వలేదు. గ్రాట్యూటీ, ఇతర చెల్లింపులు నిలిపివేశారు. వృద్ధాప్యంలో తమకు రావాల్సిన కష్ట ఫలితం రానందుకు రిటైర్డ్ ఉద్యోగులు ఆవేదన చెందుతున్నారు. ఇక పీఆర్సీ కాల పరిమితి ముగిసినా ఇప్పట్లో ఇస్తారనే ఆశే లేదు. ఎంప్లాయీస్ హెల్త్ స్కీం అయితే పూర్తిగా అటకెక్కింది.
రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపు తప్పుతున్నాయని ఇటీవల జరుగుతున్న వరుస ఘటనలు సూచిస్తున్నాయి. హైదరాబాద్లో వరుస హత్యలు కలవరపెడుతున్నాయి. తెలంగాణలో ఎన్నడూ లేని రాజకీయ హత్యలు, దాడులు కాంగ్రెస్ పాలనలో మళ్లీ మొదలయ్యాయి. పరిపాలన మీద దృష్టి సారించవలసిన ముఖ్యమంత్రి ఇంకా పీసీసీ ప్రెసిడెంట్గా రాజకీయ కార్యకలాపాల్లోనే మునిగి తేలుతున్నారు. అధిష్ఠానాన్ని ప్రసన్నం చేసుకోవడం కోసం ఢిల్లీకి, ఇతర పార్టీల ఎమ్మెల్యేలను చట్టవిరుద్ధంగా తమ పార్టీలో కలుపుకొనే పనిలో వారి ఇండ్లకు తిరగడానికే సమయం సరిపోతున్నది. ప్రజాపాలన జరగకపోగా ప్రతిపక్షాలపై ప్రతీకార పాలన కొనసాగుతున్నదని, పరిపాలన క్రమంగా గాడితప్పి పోతున్నదనే భావన జనంలో నెలకొన్నది. ఇప్పటికైనా ప్రభుత్వం డంబాచారం మాని, డాంబికాలకు పోకుండా చిత్తశుద్ధితో పాలన మీద దృష్టిపెట్టాలి. ముఖ్యంగా ఆరు గ్యారంటీల అమలు మీద శ్రద్ధ పెట్టాలి. ప్రజాక్షేత్రంలో చెలరేగుతున్న ఆందోళనలను ప్రతికూల దృష్టితో చూడకుండా, ఇచ్చిన హామీలకు కట్టుబడి సమస్యల పరిష్కారానికి పూనుకోవాలని ప్రజలు ఆశిస్తున్నారు. ఆ వివేకం మరిచి ప్రవర్తిస్తే ఈ ప్రభుత్వం అతి తొందరలోనే తీవ్రమైన ప్రజా వ్యతిరేకతను చవిచూడవలసి వస్తుంది.
(వ్యాసకర్త: బీఆర్ఎస్ అధికార ప్రతినిధి)
-జి.దేవీప్రసాద్ రావు