నిరుద్యోగులను నమ్మించి మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి పట్ల సాధారణ ప్రజలు తమకేమీ పట్టనట్టుగా వ్యవహరించవచ్చేమో. కానీ, తెలంగాణలోని నిరుద్యోగులు మాత్రం అస్సలు సహించరు. ‘నమ్మి నానబోస్తే పుచ్చి బుర్రలైనట్టు’ ఉద్యోగాలిస్తదేమోనని ఆశతో కాంగ్రెస్ పార్టీకి అధికారం అప్పచెప్తే ఆ పార్టీ నేడు కనీసం నిరుద్యోగుల వైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. అందుకే మరో పోరు సలపడానికి తెలంగాణ నిరుద్యోగ యువత సిద్ధమైంది. కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని సహించేది లేదని తెగేసి చెప్తున్నదీ తెలంగాణ గడ్డ.
ఏండ్ల తరబడి కొలువుల కోసం వేచిచూసిన 40 లక్షల మంది నిరుద్యోగుల జీవితాల్లో రేవంత్ సర్కార్ నిప్పులు పోస్తున్నది. గురుకుల కొలువుల నియామకం పూర్తయ్యాక మిగిలిన పోస్టులను తర్వాతి వరుసలో ఉన్న అభ్యర్థులతో భర్తీ చేయాలి. కానీ, అలా చేయకుండా రేవంత్ సర్కార్ వెనుకడుగు వేస్తున్నది. తద్వారా వేలాది మంది అభ్యర్థులను మానసికంగా వేధిస్తున్నది. రీలింక్విష్మెంట్ను అమలు చేసి ఒక్క పోస్టు కూడా మిగలకుండా భర్తీ చేస్తామని ఎన్నికల ముందు రేవంత్రెడ్డి ప్రగల్భాలు పలికారు.
కానీ, నేడు ఆ మాటను మరిచారు. బాధిత అభ్యర్థులను సీఎం ఇంటి ముందు మోకాళ్ల మీద కూర్చొని, యాచించే స్థితికి దిగజార్చారు. అధికారమిస్తే ఏడాదిలోపు 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని బీరాలు పలికిన కాంగ్రెస్ నాయకులు నేడు గ్రూప్- 2, గ్రూప్- 3 నోటిఫికేషన్లో పోస్టులనే పెంచడం లేదు. హామీ ఇచ్చినట్టుగానే మరో 5,000 ఖాళీలను నోటిఫికేషన్కు ఎందుకు జత చేయడం లేదో ప్రభుత్వం సమాధానం చెప్పాలి. నమ్మి అధికారమిస్తే నమ్మక ద్రోహం తలపెట్టిన రేవంత్ రెడ్డికి కనీసం సర్కార్ పరీక్షలను వాయిదా వేయడానికి మనసొప్పడం లేదు. రూ.4 వేల నిరుద్యోగ భృతిపై కూడా మాట మార్చారు.
గ్రూప్- 1 మెయిన్స్కు 1:100 నిష్పత్తిలో అభ్యర్థులను పిలవాలని గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ నాయకులే డిమాండ్ చేశారు. కానీ, ఇప్పుడు తీరం దాటాక తెడ్డు తగలబెట్టే విధంగా మాట మారుస్తూ తప్పించుకుంటున్నారు. యూత్ డిక్లరేషన్ అంటూ ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చారు. హస్తం గుర్తుతో అరచేతిలో వైకుంఠాన్ని చూపారు. మొదటి క్యాబినెట్లోనే మెగా డీఎస్సీని ప్రకటిస్తామన్నారు. కానీ, గద్దెనెక్కాక హామీలను మరిచి నిరుద్యోగులను నిండా ముంచుతున్నారు. మెగా డీఎస్సీకి మంగళం పాడుతూ 11 వేల పోస్టులతో నోటిఫికేషన్ ఇవ్వడాన్ని తెలంగాణ విద్యార్థి, నిరుద్యోగ లోకం క్షమించదు.
ప్రభుత్వ నిరంకుశ విధానాలను వ్యతిరేకిస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు, ఆమరణ నిరాహార దీక్షలు, నిరసనలు, ఆగ్రహజ్వాలలు రాజుకుంటున్నాయి. ఈ తరుణంలో ఇవేమీ తమకు పట్టవంటూ, ప్రతిపక్ష ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకుంటూ, వారితో మంత్రి పదవులను భర్తీ చేసుకోవడంలో రేవంత్ సర్కార్ నిమగ్నమైంది. ఇది ఎన్నో త్యాగాలు, పోరాటాలను చూసిన తెలంగాణ సమాజాన్ని అవమానించడమే.
కాంగ్రెస్కు ‘ఓటు కొట్టు, జాబు పట్టు’ అని గతంలో నిరుద్యోగులను ఊరించిన కోదండరాం రెడ్డి, నిరుద్యోగుల పుణ్యాన పదవులు పొందిన బల్మూరి వెంకట్, తీన్మార్ మల్లన్న, రియాజ్ లాంటి వారు ఇప్పుడు నిరుద్యోగుల పక్షాన ఒక్కమాట కూడా మాట్లాడకపోవడం శోచనీయం.
గోడ మీద క్యాలెండర్లో పేజీలు మారుతున్నా, కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తామన్న జాబ్ క్యాలెండర్ మాత్రం గోడ మీదికి రావడం లేదు. ఈ నయవంచనను చూసి కడుపు మండిన నిరుద్యోగులు తమ హక్కుల సాధన కోసం టీజీపీఎస్సీ కార్యాలయాన్ని ముట్టడిస్తున్నారు. మంత్రులకు నిరసన సెగను చూపుతున్నారు. రానున్న రోజుల్లో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని అడ్డుకోవడానికి కూడా ఏ మాత్రం వెనకడుగు వేయరు.
‘దోపిడి చేసే ప్రాంతేతరులను
దూరం దాకా తన్ని తరుముతం
ప్రాంతం వాడే దోపిడి చేస్తే
ప్రాణంతోనే పాతర వేస్తం..!
దోస్తుగ ఉండే వారితో మేమును
దోస్తే చేస్తం ప్రాణమిస్తం
ఎంతకు అంత అన్న ధోరణితో
చింతమాని బ్రతుకును సాగిస్తం
తెలంగాణమిది తెలంగాణమిది
తీరానికి దూరాన ఉన్నది
ముంచే యత్నం చేస్తే
తీరం మునుగును తానే మునుగును తప్పక’
అన్న ప్రజాకవి కాళోజీ చూపిన బాటలో నిరుద్యోగుల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం సబ్బండ వర్గాలతో పాటు సకల పార్టీలు సంఘటితం కావాల్సిన తరుణం ఆసన్నమైంది. నిరంకుశ నిజాం నవాబులను, కాసీం రజ్వీలను, ఆంధ్రా వలస పాలకులను తరిమిన తెలంగాణ గడ్డ ఇది. మిమ్మల్ని గద్దె దింపడం ఈ గడ్డకు పెద్ద కష్టం కాదు. ఈ విషయాన్ని కాంగ్రెస్ పాలకులు గుర్తుంచుకుంటే మంచిది.
-దామెర వినోద్ కుమార్
89859 26993