ప్రభుత్వ విద్యుత్ సంస్థలను రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం త్వరలో విక్రయించినా విస్తుపోవాల్సిన పని లేదు. ఈ మాట ఇప్పుడెందుకు అంటున్నానంటే రాష్ట్రంలోని ప్రభుత్వ విద్యుత్ సంస్థలను నిర్వహించేవారు కరువైనట్టు, ఆ బాధ్యతలను ప్రైవేట్ సంస్థకు కట్టబెట్టినట్టు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఇటీవల ప్రకటించారు. ఈ నేపథ్యంలో రాహుల్గాంధీతో పాటు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర, జాతీయ నాయకులు అదానీ, ఆయన సంస్థల మీద చేసిన అనేక ఆరోపణలను మనం గుర్తుచేసుకోవాల్సిన అవసరం ఉన్నది. అంతేకాదు, స్వయానా రేవంత్ రెడ్డి కూడా గతంలో అదానీపై అనేక ఆరోపణలు చేసిన విషయం మనకు తెలిసిందే.
పదేండ్ల తర్వాత రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజా సమస్యలను గాలికివదిలేసి, ప్రపంచవ్యాప్తంగా అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్న అదానీ లాంటి పారిశ్రామికవేత్తకు రాష్ట్ర ప్రభుత్వ విద్యుత్ సంస్థలను అమ్మచూడటం ఆక్షేపణీయం. తెలంగాణ ప్రభుత్వ విద్యుత్ సంస్థల బాధ్యతను, ప్రభుత్వ ఉద్యోగులు నిర్వహించే కార్యకలాపాలను అదానీ సంస్థకు కట్టబెట్టడం ఏ కోశానా మంచిది కాదు. పాతబస్తీలో పేరుకుపోయిన విద్యుత్తు బకాయిలను వసూలు చేయడం కోసమే అదానీకి కట్టబెట్టినట్టు ప్రభుత్వం ప్రచారం చేసుకుంటున్నప్పటికీ దీనివెనుక అతిపెద్ద కుట్ర దాగి ఉన్నదనే విషయం అర్థమవుతున్నది.
విద్యుత్ బకాయిలను తెలంగాణ ప్రభుత్వ విద్యుత్ ఉద్యోగులు వసూలు చేయలేరా? అండర్ గ్రౌండ్ (భూగర్భ) విద్యుదీకరణ కోసమే అదానీకి కట్టబెట్టామని చెప్తున్నది. కానీ, ప్రభుత్వరంగ సంస్థ తెలంగాణ విద్యుత్ కార్పొరేషన్ ఉద్యోగులు కూడా అండర్గ్రౌండ్ పనిని సమర్థవంతంగా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. వీరిని పక్కనబెట్టి యుద్ధ ప్రాతిపదికన తెలంగాణ ప్రభుత్వరంగ సంస్థ పనులను అదానీ సంస్థకు అప్పగించాల్సిన అవసరం రేవంత్రెడ్డి ప్రభుత్వానికి ఎందుకు వచ్చిందో అంతుచిక్కడం లేదు. కాంట్రాక్టు పనులను అదానీ కంపెనీలకు కాంట్రాక్టు ఇచ్చి, వాటి ద్వారా వచ్చే కమీషన్ కోసమే రేవంత్ పాకులాడుతున్నట్టు కనబడుతున్నది. పాత బకాయిల వసూలు పేర పాతబస్తీ పౌరుల మీదికి ఉద్దేశపూర్వకంగా అదానీ కంపెనీని రేవంత్ ప్రభుత్వం ఉసిగొల్పుతున్నట్టుగా కనపడుతున్నది.
విద్యుత్ ప్రభుత్వరంగ సంస్థలను అదానీ కంపెనీకి కట్టబెట్టడాన్ని రాష్ట్రంలోని ప్రజలందరూ అడ్డుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఇది కేవలం పాతబస్తీకి పరిమితమయ్యే విషయం కాదు. తెలంగాణలో ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటుపరం చేసే కుట్రలో భాగంగానే దీనంతటినీ చూడాలి. ఇదిలా ఉంటే రాష్ట్ర గనులను ప్రభుత్వ సంస్థ అయిన సింగరేణికి కట్టబెట్టకుండా ప్రైవేటు కంపెనీలకు అప్పగించేందుకు విశ్వ ప్రయత్నాలు జరుగుతున్నాయి.
కాంగ్రెస్ నేతృత్వంలోని రేవంత్ ప్రభుత్వం చేసే పనులను ఖండించకుండా చూస్తూ ఊరుకుంటే రాష్ర్టానికి పెద్ద ఎత్తున నష్టం వాటిల్లే ప్రమాదం పొంచి ఉన్న ది. తెలంగాణ రాష్ట్ర ప్రజల వనరులను అదానీ సంస్థలకు కట్టబెట్టడం ఎంతమాత్రం సమర్థనీయం కాదు. రాష్ట్రం తెచ్చుకున్నది ప్రజల సంక్షేమం కోసమే కానీ, ప్రైవేటు వ్యక్తుల ప్రయోజనాల కోసం కాదనే విషయాన్ని ప్రభుత్వం గుర్తుంచుకోవాలి. తెలంగాణ తెచ్చుకున్నది కాంట్రాక్టు కమీషన్ల కోసం కాదనే విషయాన్ని కూడా ప్రభుత్వం గ్రహిస్తే మంచిది.
(వ్యాసకర్త: రీసెర్చర్, నేషనల్ క్యాంపైన్ ఆన్ దళిత్ హ్యూమన్ రైట్స్)
– అశోక్ ధనావత్