ఇటీవలి పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ సాధారణ మెజారిటీకి అవసరమైన 272 సీట్లను సాధించకపోవడం కొత్త పరిణామాలకు దారితీస్తున్నది. లోక్సభ స్పీకర్, డిప్యూటీ స్పీకర్ పదవులను బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే, కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి మధ్య ఏకాభిప్రాయ సాధన ద్వారా భర్తీ చేస్తారనే అంచనా తప్పింది.
పాత పార్లమెంటరీ సంప్రదాయం ప్రకారం డిప్యూటీ స్పీకర్ పదవిని ప్రతిపక్షాలకు ఇస్తే స్పీకర్ పదవికి విపక్షాలు పోటీ పెట్టబోవనే ప్రతిపాదన వచ్చినా.. బీజేపీ అందుకు నిరాకరించింది. దీంతో కేరళ మావెలిక్కర నుంచి 8 సార్లు గెలిచిన కాంగ్రెస్ దళిత నేత కొడికున్నిల్ సురేశ్ను ప్రతిపక్షా లు పోటీకి దింపడంతో సభాపతి పదవికి ఎన్నిక అనివార్యమైంది. 48 ఏండ్ల తర్వాత ఈ రాజ్యాంగ పదవికి పోటీ జరగడం ఇదే మొదటిసారి.
18వ లోక్సభ స్పీకర్గా బీజేపీ ఎంపీ ఓం బిర్లా బుధవారం మూజువాణి ఓటు ద్వారా ఎన్నికవడం తో గతంలో జరిగిన 3 ఎన్నికలు గుర్తుకువస్తున్నాయి. 1952 నుంచి చూస్తే స్పీకర్ పదవికి ఇలా ఎన్నిక జరగడం ఇది నాలుగోసారి. మొదటి సార్వత్రిక ఎన్నికలయ్యాక 1952లో భారత పార్లమెంటు దిగువ సభ స్పీకర్ పదవికి కాంగ్రెస్ అభ్యర్థి గణేశ్ వాసుదేవ్ (జీవీ) మావలంకర్పై తమ ఉమ్మడి అభ్యర్థిగా శంకర్ శాంతారాం మోరేను ప్రతిపక్షాలు పోటీకి నిలిపాయి. పండిత నెహ్రూ నాయకత్వంలోని కాంగ్రెస్కు ఉన్న తిరుగులేని మెజారిటీ కారణంగా గుజరాత్కు చెందిన మావలంకర్ సునాయాసంగా ఎన్నికయ్యారు. మహారాష్ట్రకు చెందిన మోరే అత్యధిక తేడాతో (394-55 ఓట్లు) ఓడిపోయారు.
ఇద్దరు తెలుగు నేతల మధ్య స్పీకర్ పదవి కోసం పోటీ: మళ్లీ 15 ఏండ్ల తర్వాత ఇందిరాగాంధీ ప్రధానిగా ఉండగా జరిగిన మొదటి పార్లమెంట్ ఎన్నికలయ్యాక (1967) స్పీకర్ పదవికి రెండోసారి ఎన్నిక జరిగింది. నాలుగో లోక్సభ స్పీకర్ పదవికి నాటి ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి కాంగ్రెస్ తరపున నామినేషన్ వేయగా ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా మరో తెలుగు నేత తెన్నేటి విశ్వనాథం పోటీకి దిగారు. కాంగ్రెస్ పార్టీకి 19 67 పార్లమెంటు ఎన్నికల్లో 300 లోపు సీట్లు రావ డం, దాదాపు పది రాష్ర్టాల్లో ప్రతిపక్షాలు ఎక్కువ స్థానాలు గెలుచుకోవడంతో తెన్నేటి పరాజయం పాలైనా 200కి పైగా ఓట్లు సంపాదించగలిగారు.
ఆం ధ్రా ప్రాంతానికి చెందిన రెండో స్పీకర్గా (మొదటి తెలుగు స్పీకర్ మాడభూషి అనంతశయనం అయ్యంగార్ వరుసగా 1956, 1957లో స్పీకర్ అయ్యారు. తమిళ వైష్ణవ కుటుంబ మూలాలున్న ఆయన తిరుపతి, చిత్తూరు నుంచి లోక్సభకు గెలిచారు) నీలం సంజీవరెడ్డి 278-207 ఓట్ల తేడాతో సభాపతిగా ఎన్నికయ్యారు. విశాఖపట్నం నుంచి గెలిచిన తెన్నేటిని హిందూపురం ఎంపీ అయిన నీలం ఓడించారు. తర్వాత ఐదో లోక్సభ ఎన్నికల్లో (1971 తొలి మధ్యంతర లేదా ముందస్తు ఎన్నిక లు) కాంగ్రెస్ మూడింట రెండొంతుల మెజారిటీ సాధించడంతో కాంగ్రెస్ నేత, గురుదయాళ్ సింగ్ (జీఎస్) ధిల్లాన్ రెండోసారి స్పీకర్గా పోటీ లేకుండా 1971లో ఎన్నికయ్యారు.
1967లో స్పీకర్ పదవి చేపట్టిన సంజీవరెడ్డి 1969 రాష్ట్రపతి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికార అభ్యర్థిగా పోటీ చేయడానికి పదవికి రాజీనామా చేశాక జీఎస్ థిల్లాన్ అప్పుడు కాంగ్రెస్ తరపున స్పీకర్గా మొదటిసారి ఎన్నికయ్యారు. ఎంఏ అయ్యంగార్ మాదిరిగానే మళ్లీ రెండోసారి స్పీకర్ అయ్యే అవకాశం ఈ సిక్కు కాంగ్రెస్ నేతకు లభించింది. ధిల్లాన్ రెండోసారి స్పీకర్గా ఐదేండ్ల పదవీ కాలం పూర్తిచేసుకోవడానికి కొన్ని మాసాల ముందు 1975 డిసెంబర్లో ఇందిర మంత్రివర్గంలో చేరారు. ధిల్లాన్ రాజీనామా ఫలితంగా ఖాళీ అయిన స్పీకర్ పదవికి మూడోసారి 1976లో ఎన్నిక జరిగింది. ఈ ఎన్నికలో బీహార్కు చెందిన బీసీ నేత బలిరామ్ భగత్ కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగారు. ఆయనపై ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థి జగన్నాథరావు జోషీ (జనసంఘ్) పోటీ చేశారు. భగత్ 344-58 ఓట్ల తేడాతో మధ్యప్రదేశ్ షాజాపూర్ ఎంపీ అయిన జోషీని ఓడించారు. కర్ణాటక ధార్వాడ్ మరాఠీ కుటుంబంలో పుట్టిన జోషీ ఎంపీ నుంచి రెండుసార్లు లోక్సభకు ఎన్నికయ్యారు. స్పీకర్ పదవికి 1952, 1967, 1976 తర్వాత ఏకగ్రీవానికి బదులు ఎన్నిక జరగడం ఇప్పుడు (20 24) నాలుగోసారి. తొలి లోక్సభ ఎన్నికల నుంచి 2019లో జరిగిన 17వ లోక్సభ ఎన్నికల వరకూ 17 మంది నాయకులు ఈ పదవికి ఎన్నికయ్యారు.
స్పీకర్గా రెండేసిసార్లు చేసిన నేతలు ఆరుగురు, వారిలో ఆంధ్రా నేతలు ముగ్గురు: లోక్సభ స్పీకర్ పదవిని రెండేసి సార్లు అధిష్ఠించిన నేతలు ఆరుగురు ఉండగా వారిలో తెలుగు వారు ఇద్దరు. ఈ ఆరుగురిలో మొదటి అవకాశం రెండో స్పీకర్ ఎంఏ అయ్యంగార్కు రాగా, తర్వాత సంజీవరెడ్డికి వచ్చింది. నీలం మొదటిసారి రెండేడ్లు (1967-69) ఈ పదవిలో కొనసాగగా, రెండోసారి కేవలం 109 రోజులే ఉన్నారు. జనతా పార్టీ తరపున ఏకగ్రీవంగా స్పీకర్ అయిన నీలం మూడు నెలల తర్వాత 1977 ఆగస్టులో రాష్ట్రపతిగా పోటీ లేకుండా ఎన్నికయ్యారు. ప్రధాని ఇందిరాగాంధీ ఆశీస్సులతో జీఎస్ ధిల్లాన్ రెండుసార్లు స్పీకర్ కాగలిగారు. ఆయన మొదటిసారి రెండేండ్లలోపే సభాపతిగా ఉన్నారు.
రెండోసారి 1971లో ఈ పదవికి ఎన్నికయ్యాక నాలుగున్నరేండ్ల్లకు పైగా ఈ పదవిలో కొనసాగారు. రెండుసార్లు స్పీకర్గా ఎన్నికయ్యాక పూర్తి పదవీకాలం పదవిలో ఉన్న ఏకైక నేత కాంగ్రెస్ నేత బలరాం జాఖఢ్. పంజాబ్కు చెందిన ఈ జాట్ నేత జాఖఢ్ 1980 నుంచి 1989 మధ్య దాదాపు పదేండ్లు సభాపతిగా ఉండటం ఇప్పటికీ రికార్డు. జాఖఢ్ తర్వాత రెండుసార్లు ఈ పదవికి ఎన్నికైనది టీడీపీకి చెందిన దళిత నేత గంటి మోహన్ చంద్ర (జీఎంసీ) బాలయోగి. 1998లో స్పీకర్గా ఎన్నికైన బాలయోగి 1999 మధ్యంతర ఎన్నికల తర్వాత కూడా అదే పదవిని చేపట్టారు గాని 2002 మార్చిలో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో కన్నుమూశారు. ఫలితంగా ఆయన రెండు పదవీకాలాలు కలిపి దాదాపు నాలుగేండ్లే. బాలయోగి తర్వాత తాజాగా స్పీకర్గా వరుసగా రెండోసారి ఎన్నికైన ఓం బిర్లా 18వ లోక్ సభ సభాపతిగా పూర్తికాలం కొనసాగి జాఖఢ్ రికార్డును అధిగమించేదీ, లేనిదీ 2029లోపే తేలిపోతుంది.
-నాంచారయ్య మెరుగుమాల