ప్రజాపాలనలో చేనేత కార్మికుల ఆశ, శ్వాస అయిన సాంచల సప్పుడు రోజురోజుకు వినపడకుండా పోతున్నది. కేసీఆర్ ఆనవాళ్లను చెరిపేసే పనిలో భాగంగా కాంగ్రెస్ సర్కార్ సిరిసిల్లపై దృష్టిపెట్టింది. అందుకే నేతన్నలు ఆత్మహత్యలు చేసుకుంటున్నా రేవంత్ రెడ్డి ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.
సిరిసిల్ల కార్మిక క్షేత్రంలో 30 వేల పవర్లూంలు ఉండగా.. వాటిలో 15 వేల వరకు కాటన్ బట్టను ఉత్పత్తి చేస్తే, మిగతా 15 వేల పవర్లూంలు పాలిస్టర్ వస్ర్తాన్ని ఉత్పత్తి చేసేవి. కాటన్ బట్ట పరిశ్రమకు అనుబంధంగా 26 సైజింగ్లు, 130 వరకు చిన్న తరహా డయింగ్ యూనిట్లు మనుగడ సాగిస్తున్నాయి. అంతేకాకుండా, సుమారు 3 వేల మంది కార్మికులు ఆటో నడుపుతూ.. రవాణా, హమాలీలుగా పనిచేసేవారు. 30 వేల పైచిలుకు పవర్లూంలు, అనుబంధ పరిశ్రమలపై ఆధారపడుతూ 25 వేల మంది కార్మికులు జీవనం సాగిస్తున్నారు.
ఎన్టీఆర్ మొదలు చంద్రబాబు, వైఎస్సార్, కిరణ్కుమార్ రెడ్డి వరకు ఉమ్మడి ఏపీలో ఎంతో మంది ముఖ్యమంత్రులు నేతన్నల కష్టాలను, వారి బలవన్మరణాలను రాజకీయాలకు వాడుకున్నారే తప్ప, ఏనాడూ ఆదుకోలేదు. సిరిసిల్ల నేతన్నల సంక్షేమం కోసం కృషి చేసిన పాలకుడు కేసీఆర్ మాత్రమే. నేతన్నల సమస్యలపై పూర్తిగా అవగాహన ఉన్న కేసీఆర్ కార్మికుల సంక్షేమానికి పెద్దపీట వేశారు. తెలంగాణ తొలి ప్రభుత్వం కొలువయ్యాక స్థానిక ఎమ్మెల్యే, మంత్రి హోదాలో కేటీఆర్ వారి ఆకలిచావులను, ఆత్మహత్యలను అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి ప్రత్యేక చొరవ తీసుకున్నారు. సిరిసిల్ల నేత పరిశ్రమను కుటీర పరిశ్రమగా గుర్తించాలని ముఖ్యమంత్రిని కోరారు. ఆయన కృషి ఫలితంగా 2006 నుంచి పేరుకుపోయిన విద్యు త్తు బకాయిలపై ప్రభుత్వం 50 శాతం రాయితీ ప్రకటించింది. దాంతో నేత పరిశ్రమ కష్టాల సుడిగుండం నుంచి బయటపడింది. అంతేకాదు, నేత కార్మికుల కుటుంబాలకు 35 కిలోల బియ్యం ఉచితంగా ఇచ్చేలా అంత్యోదయ కార్డులను ఇచ్చింది. స్త్రీలకు పావలా వడ్డీకే రుణాలను అందజేసింది. స్త్రీ స్వయం శక్తి పొదుపు సంఘాలను ప్రోత్సహించింది.
నేతన్న బీమా, పెన్షన్ వర్కర్ టు ఓనర్ మొదలైన సంక్షేమ పథకాలను అమలు చేసింది. రూ.350 కోట్ల విలువైన బతుకమ్మ చీరల ఆర్డర్లు ఇచ్చింది. అంతేకాకుండా రాజీవ్ విద్యా మిషన్ పాఠశాల యూనిఫాంలు, క్రైస్తవులు, ముస్లిం సోదరులకు ఇచ్చే వస్ర్తాలను కూడా సిరిసిల్ల పరిశ్రమకే ఆర్డర్లు ఇచ్చింది. తద్వారా నేత కార్మికుల ఆత్మహత్యలు, ఆకలిచావులు పూర్తిగా తగ్గిపోయాయి.
కానీ, కొంతమంది కేసీఆర్ సర్కార్పై విషం చిమ్మా రు. సిరిసిల్ల వ్యాపార క్షేత్రం తన సహజ లక్షణాన్ని కోల్పోయిందని, పూర్తిగా ప్రభుత్వంపై ఆధారపడేలా చేశారని దుష్ప్రచారం చేశారు. కానీ, సిరిసిల్ల అప్పారెల్ పార్క్లో వేల మంది మహిళలు ఉపాధి పొందుతున్నారు. ఒక్కో మహిళ నెలకు రూ.8 వేల నుంచి రూ.12 వేల వరకు సంపాదిస్తూ కుటుంబానికి ఆసరాగా నిలుస్తున్నది. అనేక కొత్త సంస్థలు అప్పారెల్ పార్కులో యూనిట్లను ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఇలా అనేక కార్యక్రమాలు చేపట్టిన కేసీఆర్ సర్కార్ నేతన్నల ఆత్మహత్యలను నివారించింది.
కానీ, ప్రజాపాలన అంటూ గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నది. సంక్షేమ కార్యక్రమాలకు మంగళం పాడుతుండటంతో మళ్లీ నేతన్నల ఆత్మహత్యలు మొదలయ్యాయి. దశాబ్దం పాటు సాగిన బీఆర్ఎస్ పాలన సిరిసిల్లను ఉరి శాల నుంచి సిరిశాల వైపు మళ్లించింది. కానీ, రేవంత్ ప్రభుత్వం సిరిసిల్లను మళ్లీ ఉరిశాల వైపు నడిపిస్తున్నది. రేవంత్ పాలనలో సిరిసిల్లలో ఇప్పటికే 8 మంది ఆత్మహత్య చేసుకున్నారు. కార్మికుల బలవన్మరణాలు పెరుగుతున్న నేపథ్యంలో తక్షణమే కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించాలి. నాసిరకపు సాంచలను ఆధునికీకరించాలి. గత ప్రభుత్వం వలె సంక్షేమ పథకాలను అమలు చేసి కార్మికుల ఆత్మ బలిదానాలకు అడ్డుకట్ట వేయాలి.
-ఫణి రాజారావు రామినేని
94400 52555