కంఠేశ్వర్, జూన్ 2: మలి విడుత ఉద్యమంలో జిల్లాకు చెందిన అనేక మంది ఉద్యమకారులు ఆత్మబలిదానాలకు పాల్పడ్డారని, వారి త్యాగాలు వెలకట్టలేనివని కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు అన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన కలెక్టర్.. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తెలంగాణ అమరుల ఆశయాలు, ఆకాంక్షలకు అనుగుణంగా ముందుకెళ్దామని పిలుపునిచ్చారు. సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక, సంక్షేమం, విద్యా, వైద్యం, వ్యవసాయం తదితర అన్ని రంగాల్లో జిల్లా అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నదని, ఇదే స్ఫూర్తితో జిల్లాను మరింతగా ప్రగతిబాటలో పయనింపజేసేందుకు కంకణబద్ధులై ఉన్నామన్నారు.
ఇటీవల లోక్సభ ఎన్నికలను సజావుగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు సహకరించిన జిల్లా యంత్రాంగానికి కృతజ్ఞతలు తెలిపారు. 4న నిర్వహించే ఎన్నికల కౌంటింగ్ను కూడా శాంతియుతంగా పారదర్శకంగా సజావుగా నిర్వహిస్తామని పేర్కొన్నారు. జిల్లా అభివృద్ధికి సమష్టితత్వంతో శక్తివంచన లేకుండా కృషి చేయాలని కోరారు. అనంతరం చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అంతకుముందు వినాయక్నగర్లోని అమరవీరుల స్మారకస్థూపం వద్ద పూలమాలలు వేసి నివాళులర్పించారు. వేడుకల్లో ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, సీపీ కల్మేశ్వర్ సింగేనవార్, అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్కుమార్, నగర పాలక సంస్థ కమిషనర్ మకరంద్, డీసీసీబీ చైర్మన్ రమేశ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.