కంఠేశ్వర్, జూలై 1: విద్యార్థులకు, నిరుద్యోగులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని ఆశావాహులు, విద్యార్థి సంఘాల నేతలు సోమవారం కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపారు. నిరుద్యోగ సమస్యలపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని, మెగా డీఎస్సీని ప్రకటించడంతో పాటు గ్రూప్-2, 3 పోస్టులను పెంచాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చినట్లు మెగా డీఎస్సీని ప్రకటించాలని, ఈ పరీక్షను సెప్టెంబర్లో నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ప్రజావాణిలో కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. అంతకు ముందు కలెక్టరేట్ ఎదుట ప్లకార్డులతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నిరుద్యోగుల సమస్యలపై ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న మోతీలాల్కు ఏదైనా జరిగితే కాంగ్రెస్ ప్రభుత్వం అంతు చూస్తామని హెచ్చరించారు. తమ రాజకీయ స్వార్థపు క్రీడలో విద్యార్థులు బలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల సంక్షేమాన్ని పక్కనపెట్టి వారి జీవితాలతో చెలగాటమాడడం సిగ్గుచేటన్నారు. టీచర్ల బదిలీలు, ప్రమోషన్ల ద్వారా ఏర్పడిన ఖాళీలను కూడా ఈ డీఎస్సీలోనే భర్తీ చేయాలని కోరారు. టెట్ ఉత్తీర్ణత సాధించిన వారికి డీఎస్సీ పరీక్ష రాసేందుకు అవకాశం కల్పించాలని, మూడు నెలల నిర్ణీత సమయాన్ని కేటాయించాలన్నారు. డీఎస్సీ అభ్యర్థులు, విద్యార్థి నాయకులు బట్టు శ్రీధర్, శంకర్, లక్ష్మణ్, ప్రవీణ్, నర్సయ్య, స్పందన, రుక్మిణి, కృష్ణవేణి, రాధిక, చంద్రభాగ్య, స్వరూపారాణి, విమల తదితరులు నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు.