హైదరాబాద్, జూలై 3 (నమస్తే తెలంగాణ): గంజాయి మహమ్మారి గ్రామాలకు విస్తరించింది. పచ్చని పల్లెల్లో యువతను పీల్చి పిప్పిచేస్తున్నది. ప్రతి పల్లెలో కనీసం ఐదారుగురు గంజాయి బాధితులు ఉంటున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అర్బన్ ప్రాంతాల నుంచి సులువుగా గ్రామాల్లోకి గంజాయి వస్తుండడంపై తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఇంటర్, డిగ్రీ చదివే విద్యార్థులే గంజాయికి అలవాటు పడుతుండడం ఆందోళన కలిగించే అంశం. ఊరి చివర శ్మశానం, చెరువు గట్లు, స్కూళ్లు, రోడ్లు, రైల్వే ట్రాక్లలో అడ్డాలు ఏర్పాటు చేసుకొని.. సాయంత్రం కాగానే బ్యాచ్ల వారీగా చేరుకొని.. అంతా కలిసి గంజాయి తాగుతున్నారు. కొన్నిచోట్ల రోడ్లపైనే గంజాయి పీల్చుతూ.. నానా హంగామా చేస్తున్నారు. అర్బన్ ప్రాంతాల్లోని విద్యార్థులను లక్ష్యంగా చేసుకొని గంజాయి బ్యాచ్లు రూ.500, రూ.1000కి గ్రాముల చొప్పుల గంజాయి విక్రయిస్తున్నాయి. కాలేజీల్లో చదువుతున్న గ్రామీణ యువకులకు స్నేహం ముసుగులో సిగరెట్, బ్రీజర్, బీర్ వంటివి అలవాటు చేసి, ఆ తర్వాత గంజాయి వినియోగించేలా ప్రోత్సహిస్తున్నట్లు స్వచ్ఛంద సంస్థల పరిశోధనలో వెల్లడైంది. ఇలా గంజాయి సేవిస్తున్న వారిలో టీనేజర్లే ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తున్నది. యవ్వనంలో హుషారుగా ఉండాల్సిన వారు.. ఎదురురొమ్ము పీక్కపోయి, ముఖమంతా పాలిపోయి, కండ్లు గుంజుకుపోయి, బలం లేక బక్కచిక్కి.. గంజాయి వ్యసనంతో జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఎదుగూబొదుగులేని బిడ్డలను చూసి, తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమవుతున్నారు.
సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సూచనల మేరకు పోలీసులు, ఎక్సైజ్ సిబ్బంది సమన్వయంతో అన్ని గ్రామాల్లో డ్రగ్స్ నిర్మూలన కమిటీలు ఏర్పాటు చేయాలనుకుంటున్నాం. ఆ మేరకు కార్యాచరణ మొదలుపెట్టాం. డ్రగ్స్ అనర్థాలపై స్కూళ్లు, కాలేజీల్లో విద్యార్థులకు అవగాహన కల్పించేలా విద్యాశాఖతో ఒప్పందం చేసుకుంటున్నాం. డ్రగ్స్కు బానిసైన వారిని దారిలోకి తెచ్చేందుకు రిహాబిలిటేషన్ సెంటర్లను ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నది. డ్రగ్స్ మహమ్మారిని తరిమేందుకు అందరూ కలిసిరావాలి.
‘మాల్’ అనే కోడ్ గంజాయికి అని సులువుగా తెలిసిపోతుండడంతో.. ‘స్టఫ్’ అనే మరో కోడ్తో గంజాయి క్రయ, విక్రయాలు జరుగుతున్నాయి. రాష్ట్రంలో రైలుమార్గాలు ఉన్న గ్రామాల పరిధిలో గంజాయి అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. తక్కువ మొత్తంలో రైళ్లలోనే ఎక్కువగా గంజాయి సరఫరా అవుతున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. గంజాయికి అలవాటు పడిన వారు.. స్టఫ్ కోసం ఎంతదూరమైనా వెళ్తున్నారు. అర్బన్ ప్రాంతాల్లో ఎండు గంజాయి కాకుండా గంజాయి చాక్లెట్లు తింటూ మత్తులో జోగుతున్నారు. పోలీసులు, నార్కోటిక్ బ్యూరో, ఎక్సైజ్ సిబ్బంది నిర్వహిస్తున్న దాడుల్లో అధిక మొత్తంలో గంజాయి, గంజాయి ఆయిల్, చాక్లెట్లు పట్టుబడుతుండడం గమనార్హం. ఆరునెల్లలో 2682 కేజీల గంజాయి, 91 కేజీల గంజాయి చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. 1.25 కేజీల హషీష్ ఆయిల్, 117.2 గ్రాముల చరస్, 6 కేజీల ఓపీఎం, 384.4 గ్రా. ఎండీఎంఏ, 80 గ్రా. హెరాయిన్ను ఎక్సైజ్ సిబ్బంది పట్టుకున్నారు. ఇక పోలీసులు, నార్కోటిక్ సిబ్బంది స్వాధీనం చేసుకుంటున్న డ్రగ్స్ విలువ కోట్లలో ఉంటున్నాయి.