ధర్పల్లి/ ఖలీల్వాడి/ వినాయక్నగర్/కమ్మర్పల్లి/వేల్పూర్ /మోర్తాడ్, జనవరి 21 : అయోధ్యలో నేడు (సోమవారం) నిర్వహించనున్న బాలరాముడి విగ్రహ ప్రతిష్ఠానోత్సవం సందర్భంగా ఊరూరా సందడి నెలకొన్నది. జిల్లాలోని రామాలయాలను ప్రత్యేక పూజల కోసం ముస్తాబు చేశారు. అన్ని రామాలయాల్లో ప్రత్యేక పూజలు, అన్నదానాలు చేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ధర్పల్లి మండల కేంద్రంలోని రామాలయంలో సుమారు 8 వేల మంది భక్తులకు అన్నదానం చేసేందుకు ఏర్పాట్లు చేశామని నిర్వాహకులు తెలిపారు. డిచ్పల్లి, ఇందల్వాయి మండలాల్లోని రామాలయాలను ముస్తాబు చేశారు.
నగరంలోని శ్రీరామకృష్ణ విద్యానికేతన్ ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక శోభాయాత్రను ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థుల సీతారాములతోపాటు లక్ష్మణుడు, హనుమాన్ వేషధారణలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కార్యక్రమంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ పాల్గొని మాట్లాడారు. పిల్లలకు మన సంస్కృతీ సంప్రదాయాలు బోధించాలన్నారు.
మోస్రా మండల కేంద్రంలోని ప్రధాన రహదారిపై ఉన్న సెంట్రల్ లైటింగ్ స్తంభాలను భారీ కాషాయ వస్త్రాలతో అలంకరించారు.
జిల్లా కేంద్రంలోని వినాయక్నగర్లో మంచాల శంకరయ్య చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ మంచాల జ్ఞానేందర్.. శ్రీరాముడి ఫొటోతో ఉన్న కాషాయ జెండాలను యువకులకు పంపిణీ చేశారు. జెండాలను ఇండ్లపై కట్టాలని సూచించారు.
కమ్మర్పల్లి మండలంలో సోమవారం పలు ఆలయాల వద్ద అన్నదాన కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహించనున్నారు. గ్రామాల్లోని రోడ్లు, రామాలయాలను తోరణాలతో ముస్తాబు చేశారు. దుకాణాల వద్ద అధ్యాత్మిక జెండాల విక్రయాల సందడి నెలకొంది.
వేల్పూర్ మండలంలోని వివిధ గ్రామాలు జెండాలు, తోరణాలతో కాషాయమయంగా మారాయి. సోమవారం ఆయా గ్రామాల్లో ర్యాలీలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ప్రధాన కూడళ్ల వద్ద ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. మండల కేంద్రంలోని రామాలయంలో ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అనంతరం భక్తులకు అన్నదానం చేసేందుకు ఏర్పాట్లు చేశారు. సాయంత్రం గ్రామంలోని గ్రామ చావిడి నుంచి ప్రధాన వీధుల గుండా బీసీ కాలనీ అభయ ఆంజనేయస్వామి ఆలయం వరకు శోభాయాత్ర నిర్వహిస్తారు. అంబేద్కర్ విగ్రహం సమీపంలోని జంబిహనుమాన్ కమాన్ కాషాయరంగులలో తీర్చిదిద్దారు.
అయోధ్యలో రామమందిర ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం ఉన్నందున మోర్తాడ్ మండల కేంద్రంలో మద్యం, మాంసం విక్రయాలను బంద్ చేస్తున్నట్లు గ్రామఅభివృద్ధి కమిటీ ఆదివారం తీర్మానించింది. గ్రామస్తులంతా సహకరించాలని కోరింది. రామమందిరంలో రామాలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తామని, భక్తులు పెద్దసంఖ్యలో హాజరుకావాలని కోరారు.
నందిపేట్, జనవరి 21: అయోధ్య బాలరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి వెళ్లిన కేదారేశ్వర ఆశ్రమ వ్యవస్థాపకుడు మంగిరాములు మహరాజ్కు అయోధ్య విమానాశ్రయంలో రామాలయ నిర్వాహకులు స్వాగతం పలికారు. శాలువాతో సత్కరించారు. అనంతరం మహరాజ్ రామాలయం వద్ద వివిధ పూజా కార్యక్రమాలకు అక్కడి స్వామిజీలతో కలిసి హాజరయ్యారు. ప్రత్యేక విడిది కోసం మహరాజ్కు అయోధ్య తీర్థ ట్రస్ట్ 426 నంబర్ పాస్ను కేటాయించింది.