నిజామాబాద్, జూన్ 27(నమస్తే తెలంగాణ ప్రతినిధి): కొంత మంది సబ్రిజిస్ట్రార్ల ధనదాహం నిజామాబాద్ జిల్లా పరువును మంట కలుపుతున్నది. పైసలకు కక్కుర్తి పడుతున్న సబ్ రిజిస్ట్రార్లతో సామాన్యులకు చుక్కలు కనిపిస్తున్నాయి. అడ్డదారిలో నకిలీ రిజిస్ట్రేషన్లు చేస్తూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ప్రజల ఆస్తికి పూచీగా నిలవాల్సిన ప్రభుత్వ రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖ అధికారులే అక్రమార్కులతో చేతులు కలిపి మాయాజాలానికి పాల్పడుతున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు భూమి అన్న తేడా లేకుండానే ఇష్టారీతిన రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. ఏడాది కాలంలోనే అక్రమ వ్యవహారాలతో ఏకంగా ముగ్గురు అధికారులపై వేటు పడినప్పటికీ తీరు మారకపోవడం విడ్డూరంగా మారింది. జిల్లా కేంద్రంలోనే జరిగిన ఈ తంతు మరువకముందే ఏకంగా అధికార పార్టీకి చెందిన స్థలాన్ని సైతం ఓ సబ్ రిజిస్ట్రార్ అప్పనంగా పేరు మార్పిడి చేసేయడం విస్తు గొల్పుతున్నది. వెనుకాముందు ఆలోచించకుండా, రికార్డులను పరిశీలన చేయకుండానే కాంగ్రెస్ పార్టీకి చెందిన స్థలాన్ని కట్టబెట్టడం ఇప్పుడు దుమారం రేపుతున్నది. అధికార పార్టీకి చెందిన స్థలానికే భద్రత లేకపోవడంతో సామాన్యుల ఆస్తికి లెక్కా పత్రమే లేకుండా పోయిందన్న వాదన ఇప్పుడు బలంగా వినిపిస్తున్నది.
నిజామాబాద్ నగరంలోని శంభుని గుడి వెనుకాల కాంగ్రెస్ పార్టీ పట్టణశాఖ కార్యకలాపాల కోసం 75గజాల విలువైన స్థలం ఉంది. ఇక్కడ ప్రైవేటు వ్యక్తులు దుకాణాలు పెట్టుకొని వ్యాపారాలు చేసుకుంటున్నారు. మడిగెలకు కిరాయిని కాంగ్రెస్ పార్టీకి చెల్లిస్తున్నారు. అధికార పార్టీకి సంబంధించిన ముఖ్యమైన కార్యకలాపాలన్నీ రైల్వేస్టేషన్ సమీపంలోని డీసీసీ ఆఫీసులోనే జరుగుతుండడంతో అటువైపు నాయకులు పట్టించుకోవడం మానేశారు. దీంతో రంగంలోకి దిగిన అక్రమార్కులు ఎలాగైనా ఈ స్థలాన్ని కాజేసేందుకు స్కెచ్ వేసి అడ్డంగా దొరికిపోయారు. దశాబ్దాలుగా 8-4-359/1 ఇంటి నంబర్తో ఉన్న స్థలం కాంగ్రెస్ పార్టీ పేరిట ఉన్నది. మొత్తం ఎనిమిది మడిగెలకు ఇంటి నంబర్లు ఉండగా ఒక మడిగె కింద 43.65 గజాల భూమిని అక్రమార్కులు తమ పేరిట రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. మహ్మద్ యూసుఫ్ అనే వ్యక్తి మహ్మద్ మాజిద్కు అమ్ముతున్నట్లుగా సేల్డీడ్ రాసుకున్నారు. యూసుఫ్ మరణించడంతో పాషా, రిజ్వాన బేగం అనే మహిళ మహ్మద్ మాజిద్కు 43.65 గజాల స్థలాన్ని అమ్మినట్లుగా మే 6వ తేదీనాడు రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ పేరిట ఉన్న ఈ స్థలానికి యూసుఫ్ ఎలా వారసుడిగా మారాడు. ఇతని చనిపోవడంతో రంగంలోకి మరికొంత మంది వ్యక్తులు ఎలా వచ్చారు. రికార్డులు సరి చూసుకోకుండానే పేరు మార్పిడీని ఎలా బదలాయించారు అన్నది పాలకవర్గంలోని నేతలకే అంతు చిక్కడం లేదు.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లా రిజిస్ట్రేషన్ శాఖలో బోధన్, బాన్సువాడ, నిజామాబాద్ ప్రాంతాల్లో శాఖాపరమైన చర్యలు అధికారుల ప్రవర్తనలో మార్పు తీసుకురావడం లేదు. అక్రమాలకు పాల్పడుతున్న వ్యక్తులపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తున్నప్పటికీ దొడ్డిదారిలో జేబులు నింపుకొనేందుకు అలవాటు పడిన వారంతా యథాలాపంగా అడ్డదారిని వదలడం లేదు. 2022లో భీమ్గల్ ఇన్చార్జి సబ్ రిజిస్ట్రార్, సీనియర్ అసిస్టెంట్ ప్రవీణ్ సస్పెన్షన్కు గురి కావడం ఉమ్మడి జిల్లాల్లో చర్చనీయాంశమైంది. ప్రభుత్వ నిబంధనలను యథేచ్ఛగా ఉల్లంఘిస్తూ అక్రమ రిజిస్ట్రేషన్లకు పాల్పడడం, నాన్ లేఅవుట్ దస్తావేజులకు రిజిస్ట్రేషన్లు చేయడంతో విధుల నుంచి తొలగించారు. భీమ్గల్లో ఏడాదిన్నరగా ప్రవీణ్ చేసిన బాగోతాలపై వచ్చిన ఫిర్యాదులపై రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖకు చెందిన డీఐజీ స్థాయి అధికారి విచారణ చేశారు. తప్పు నిజమేనని తేలడంతో పక్కన పెట్టారు. ఇదే ఏడాదిలో నిజామాబాద్లో ముగ్గురు రిజిస్ట్రేషన్ అధికారులపై వేటు పడింది. కబ్జాగాళ్లతో చేతులు కలిపి వివాదాస్పద భూములను రిజిస్ట్రేషన్ చేసిన ఘటనలో చర్యలు తీసుకున్నా మార్పు రావడంలేదు. ఇప్పుడేకంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆస్తిని అదే నిజామాబాద్ సబ్ రిజిస్ట్రార్ హోదాలోని వ్యక్తి అప్పనంగా అంటగట్టడం ముక్కున వేలేసుకునేలా చేసింది. రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖ తీరు మరోసారి తేటతెల్లమైంది. అక్రమ రిజిస్ట్రేషన్ వ్యవహారంలో మొత్తంగా అధికార పార్టీ పరువు మంట కలిసినట్లయ్యింది. నష్టనివారణ చర్యల్లో భాగంగా జిల్లాకు చెందిన హస్తం నేతలు రంగంలోకి దిగి పోలీస్ కమిషనర్, జిల్లా రిజిస్ట్రార్కు ఫిర్యాదు చేశారు. సుమారుగా రూ.అరకోటికి పైగా విలువ చేసే ఈ మడిగెను తిరిగి తమ ఆధీనంలోకి తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.