రెంజల్, జూలై 1: కందకుర్తి గ్రామ సమీపంలో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లను అందించాలని సోమవారం కందకుర్తి – నవీపేట ప్రధాన రోడ్డుపై లబ్ధిదారులు రాస్తారోకో నిర్వహించారు. కేసీఆర్ ప్రభుత్వం అర్హులైన లబ్ధిదారుల కోసం నిర్మించిన డబుల్బెడ్రూం ఇండ్లను పంపిణీ చేయకపోవడంలో ఆంతర్యమేమిటో చెప్పాలని మండిపడ్డారు. డబుల్ బెడ్రూం ఇండ్ల లబ్ధిదారుల ఎంపికలో చేతులు మారినట్లు అధికారుల ముందు మొర పెట్టుకున్నారు. స్పందించిన తహసీల్దార్ శ్రావణ్కుమార్ మాట్లాడుతూ లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేస్తే వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. త్వరలోనే అర్హులైన లబ్ధిదారుల ఆధారంగా డబుల్ బెడ్రూం ఇండ్ల పంపిణీ జరుగుతుందని, అప్పటి వరకు సంయమనం పాటించాలని సూచించారు. అక్రమంగా ఇండ్లలోకి ప్రవేశిస్తే కేసులు నమోదు చేయడమే కాకుండా డబుల్ బెడ్రూం ఇండ్లకు అర్హత కో ల్పోతారని తహసీల్దార్ హెచ్చరించారు. సుమారు గంటపాటు రాస్తారోకో చేపట్టడంతో కందకుర్తి – నవీపేట, ధర్మాబాద్ – ప్రధాన రోడ్డుపై వాహనాలు నిలిచిపోవడంతో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది.