మద్నూర్, జూలై 1: విద్యార్థుల చదువుపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు అన్నారు. మండలంలోని పెద్ద ఏక్లారా బాలికల పాఠశాలలో నియోజకవర్గంలోని గురుకుల, నవోదయ, జూనియర్ కళాశాల, డిగ్రీ కళాశాల ప్రిన్సిపాళ్లతో సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యాసంస్థల్లో ఎంత మంది చదువుతున్నారు, సిబ్బంది పూర్తిస్థాయిలో ఉన్నారా అనే వివరాలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు వడ్డించే భోజనం, వారికి కల్పిస్తున్న సౌకర్యాలపై ఆరా తీశారు. ప్రతి ఒక్కరికి చదువుతోపాటు నాణ్యమైన భోజనం అందించాలని సూచించారు. ఏమైనా సమస్యలుంటే తన దృష్టికి తీసుకురావాలని తెలిపారు.