లింగంపేట, జూన్ 27: గ్రామీణ ప్రాంతాల్లోని ప్రాచీన కట్టడాల పరిరక్షణకు స్వచ్ఛంద సంస్థలు, యువజన సంఘాలు ముందుకు రావడం అభినందనీయమని కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ అన్నారు. లింగంపేట మండల కేంద్రంలోని నాగన్న బావిని ఆయన గురువారం సందర్శించారు. నాగన్న బావిని పర్యాటకంగా అభివృద్ధి చేస్తామన్నారు. కామారెడ్డి, ఎల్లారెడ్డి ప్రధాన రహదారి నాగన్న బావి వరకు ఫార్మేషన్ రోడ్డును ఉపాధి హామీ పథకంలో భాగంగా వేయించాలని అధికారులకు సూచించారు. రహదారికి ఇరువైపులా మొక్కలు నాటాలని, బావి వద్ద హైమాస్ట్ లైట్లు, రక్షణ కంచెను ఏర్పాటు చేయాలని పంచాయతీ రాజ్ అధికారులని ఆదేశించారు. నాగన్న బావిలో పూడికతీయడంతో భూగర్భ జలాలు పెంపొందినట్లు తెలిపారు. గతంలో కలెక్టర్గా పనిచేసిన జితేశ్ వీ పాటిల్ సహకారంతో నాగన్న బావి పునరుద్ధరణ పనులు చేపట్టిన తీరును ఇన్ఫోసిస్ వైస్ చైర్మన్ కల్పనారమేశ్ కలెక్టర్కు వివరించారు. అనంతరం బాలుర ఉన్నత పాఠశాలను సందర్శించి అమ్మ ఆదర్శ పాఠశాల పథకంలో భాగంగా పాఠశాలలో చేపట్టిన మరమ్మత్తు పనులను పరిశీలించారు. విద్యార్థులకు రుచికరమైన భోజనం అందించాలని సూచించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు గణితం బోధించారు. అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లిన కలెక్టర్.. నిల్వ ఉన్న మందుల వివరాలు, రికార్డులను పరిశీలించారు. దవాఖానలో అందిస్తున్న సేవలను డిప్యూటీ డీఎంహెచ్వో శోభారాణిని అడిగి తెలుసుకున్నారు. దవాఖాన ఆవరణలోని పిచ్చిమొక్కలను తొలగించాలని పంచాయతీ కార్యదర్శి శ్రవణకుమార్ని ఆదేశించారు. కలెక్టర్ వెంట లింగంపేట ఎంపీపీ గరీబున్నీసా బేగం, ఎల్లారెడ్డి డీఎల్పీవో సురేందర్, పంచాయతీ రాజ్ డీఈ గిరి, వ్యవసాయ శాఖ ఏడీఏ వీరస్వామి, ఎంపీడీవో నరేశ్, తహసీల్దార్ నరేందర్, పీహెచ్సీ వైద్యాధికారి హిమబిందు, ఏపీఎం శ్రీనివాస్, వ్యవసాయ శాఖ అధికారి అనిల్కుమార్, ఏపీవో అన్నపూర్ణ, పీఆర్ ఏఈ రాకేశ్ తదితరులు ఉన్నారు.