వినాయక్నగర్, జూన్ 19: ఓడిపోయిన ఎమ్మెల్యే అభ్యర్థి షబ్బీర్ అలీ ఏ హోదాలో కలెక్టర్ క్యాబిన్లో కలెక్టర్, ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ మండిపడ్డారు. బీజేపీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఓడిపోయిన ఎమ్మెల్యే అభ్యర్థివా లేక జిల్లా మంత్రిని అనుకుంటున్నావా? అధికారం ఉందనే అహంకారమా అని ప్రశ్నించారు. సొంత జిల్లా కామారెడ్డిలో చెల్లని రూపాయి ఇక్కడ చెల్లుతుందని టికెట్ ఇస్తే ఇందూరు ప్రజలు కర్రుకాల్చి వాతపెట్టారని అన్నారు. ఇంత జరిగినా మళ్లీ ఏ ముఖం పెట్టుకొని వస్తున్నావని షబ్బీర్ అలీపై ఆగ్రహం వ్యక్తంచేశారు. షబ్బీర్ అలీకి ఇందూరు ప్రజలపై ప్రేమ ఉంటే డబుల్ బెడ్రూం ఇండ్లు, కొత్త రేషన్కార్డులు, పింఛన్లు ఇప్పించాలని, వంద రోజుల్లో అమలుచేస్తామన్న ఆరు గ్యారెంటీలు అమలు చేయాలని హితవుపలికారు. భూకబ్జాలు, కమీషన్లు వసూలు చేసేందుకు కాంగ్రెస్ పార్టీ నాయకులు పనిచేస్తున్నారని విమర్శించారు. ఇక్కడ తాను ఎమ్మెల్యేనని, ఓడిపోయిన వ్యక్తికి గులాం చేస్తానంటే ఊరుకోనని జిల్లా అధికారులు, పోలీసు యంత్రాంగాన్ని హెచ్చరించారు. ప్రశాంతంగా ఉన్న ఇందూరును ఇబ్బంది పెడితే చూస్తూ ఊరుకోబోమని అన్నారు. షబ్బీర్ అలీ బీసీ,ఎస్సీ,ఎస్టీ వర్గాల తరపు ప్రభుత్వ సలహాదారుడని ఇక్కడ శాసన, పరిపాలన విషయాల్లో జోక్యం చేసుకుంటే ఊరుకోబోమని, ప్రొటోకాల్ పాటించాలని సూచించారు.