వినాయక నగర్, జూన్ 28: సీఎం రేవంత్రెడ్డి పరిపాలన గాలికి వదిలేసి ఢిల్లీకి చక్కర్లు కొడుతున్నాడని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ్త విమర్శించారు. ప్రజా సమస్యలను పట్టించుకోవడంలేదని మండిపడ్డారు. జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయం లో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. సీఎం సీటును కాపాడుకోవడానికి గడిచిన ఆరు నెలల్లో పదకొండు సార్లు ఢిల్లీకి వెళ్లి సోనియా, రాహుల్ చుట్టూ ప్రదక్షిణ చేయడానికి సరిపోయిందన్నారు. విద్యారంగ సమస్యలను గాలికి వదిలేయడంతో ప్రభుత్వ పాఠశాలల్లో కనీస మౌలికసౌకర్యాలు కల్పించలేని దుస్థితి నెలకొందని తెలిపారు. రేవంత్, భట్టి విక్రమార్క సొంత నియోజకవర్గాల్లో పైలట్ ప్రాజెక్టుగా ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల నిర్మాణం చేపట్టారని, అర్బన్లో ఇంతవరకూ కనీస సౌకర్యాలు కల్పించలేదన్నారు. హోం శాఖను తన వద్ద ఉంచుకున్న రేవంత్రెడ్డి.. రాష్ట్రంలో శాంతి భద్రతలపై దృష్టి సారించకుండా ప్రశ్నించే గొంతును అణచివేయాలని చూస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. పార్టీ ఫిరాయింపుల పైన ఉన్న శ్రద్ధ ప్రజల సంక్షేమం, పాలనపై లేదన్నారు. రైతులు వానకాలం పంటల సాగుకు సిద్ధమవుతున్నా ఇంతవరకూ రైతు భరోసాపై స్పష్టత లేదన్నారు. ఇందూరు నియోజవర్గానికి రేవంత్ ఇచ్చింది గాడిద గుడ్డు మాత్రమే అని మండిపడ్డారు.