ఖలీల్వాడి, జూన్ 24: తమ సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ దవాఖానలో సోమవారం నుంచి జూనియర్ వైద్యులు సమ్మె ప్రారంభించారు. దవాఖాన ఎదు ట ప్లకార్డులను ప్రదర్శిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా జూడా అసోసియేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ ప్రభుత్వాలు మారినా తమకు రావాల్సిన నెలసరి వేతనాలు సకాలంలో అందడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. జిల్లా ప్రభుత్వ దవాఖానలో నిత్యం ఎంతోమంది పేద రోగులకు వైద్యమందించే తమపై ప్రభుత్వం నిర్లక్ష్యం వ్యవహరించడం సరికాదన్నారు. ఇటీవల రాష్ట్ర ఉపముఖ్యమంత్రి జూనియర్ వైద్యులకు సరైన వేతనం అందిస్తామని హామీనిచ్చి సరైన జీవో ఎందుకు విడుదల చేయలేదని మండిపడ్డారు. హైదరాబాద్, వరంగల్ తర్వాత అతిపెద్ద దవాఖాన అయిన నిజామాబాద్ ప్రభుత్వ దవాఖానలో నిత్యం 200మంది జూనియర్ వైద్యులు విధులు నిర్వర్తిస్తున్నారని తెలిపారు. సమస్యలు పరిష్కరించకపోతే విధులకు హాజరయ్యేది లేదన్నారు. ఆంధ్రప్రదేశ్, కేరళ, తమిళనాడు తరహాలో జూనియర్ వైద్యులకు తెలంగాణలో కూడా సరైన వేతనాలు చెల్లించాలన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర జూడ ఉపాధ్యక్షులు సురేశ్, హరితకృష్ణ, షఫీ తదితరులు పాల్గొన్నారు.