కంఠేశ్వర్, జూలై 3: అంగన్వాడీ ఉద్యోగులను వంచించేలా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ జిల్లా కేంద్రంలోని ధర్నా చౌక్ వద్ద బుధవారం అంగన్వాడీ టీచర్లు, వర్కర్లు ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్(సీఐటీయూ) జిల్లా అధ్యక్షుడు రమేశ్బాబు మాట్లాడుతూ అంగన్వాడీ ఉద్యోగులు గత సెప్టెంబర్లో సమ్మె నిర్వహించడంతో అప్పటి ప్రభుత్వం 65ఏండ్లు నిండిన టీచర్లకు రూ.2లక్షలు, ఆయాలకు రూ.లక్ష, రిటైర్మెంట్ బెనిఫిట్స్తోపాటు ఆసరా పింఛన్ ఇచ్చేందుకు అంగీకరించిందన్నారు. అందుకు భిన్నంగా ప్రస్తుత ప్రభుత్వం 65ఏండ్లు నిండిన వారికి రిటైర్మెంట్ ప్రకటించాలని, జూలై 1 నుంచి జీతాలు ఇవ్వొద్దని జీవో జారీ చేశారన్నారు. జీవో ప్రకారం టీచర్లకు రూ.లక్ష, ఆయాలకు రూ. 50వేలు మాత్రమే చెల్లిస్తామని పేర్కొన్నారని వివరించారు. ప్రభుత్వం విడుదల చేసిన జీవోను వెంటనే ఉపసంహరించుకోవాలని, గతంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని, ఉద్యోగులకు వారసత్వపు హక్కును కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ధర్నా శిబిరానికి వచ్చిన ఐసీడీఎస్ పీడీకి వినతిపత్రం అందజేశారు. అనంతరం అదనపు కలెక్టర్ను కలిసి మెమోరాండం అందజేశారు. కార్యక్రమంలో అంగన్వాడీ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు దేవగంగు, సీఐటీయూ అధ్యక్షుడు జై శంకర్ గౌడ్, కోశాధికారి చంద్రకళ, ఉపాధ్యక్షురాలు సూర్యకళ, శివరాజమ్మ, కరుణ తదితరులు పాల్గొన్నారు.