ఆర్మూర్టౌన్, జూన్ 28: ఆర్మూర్ నియోజకవర్గానికి ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూల్ను కేటాయించాలని, లేకపోతే ఆమరణ దీక్ష చేస్తానని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్రెడ్డి అన్నారు. ఈ మేరకు తన దీక్షకు అనుమతి ఇవ్వాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్రెడ్డికి శుక్రవారం విజ్ఞప్తి చేశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఎమ్మెల్యే ఆయనను కలిసి వినతిపత్రం సమర్పించారు. అనంతరం రాకేశ్రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కొడంగల్కు కేటాయించినట్లుగానే ఆర్మూర్ నియోజకవర్గానికి ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూల్ను కేటాయించాలని పలుమార్లు ప్రభుత్వాన్ని కోరానని చెప్పారు.
సీఎం రేవంత్రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి సానుకూలంగా స్పందించారని, ఫైల్ కూడా సిద్ధమైందన్నారు. అయితే, ఆర్మూర్కు కేటాయించిన మోడల్ స్కూల్ను ఉప ముఖ్యమంత్రి నియోజకవర్గం మధిరకు తరలించుకు పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. పేద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పిల్లల కోసం ఆర్మూర్ నియోజకవర్గానికి మూడో పైలట్ ప్రాజెక్టు కింద ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూల్ను కేటాయించాలని సీఎంను కోరానని తెలిపారు. ఒకవేళ పాఠశాలను మంజూరు చేయకపోతే తాను ఆమరణ దీక్షకు దిగుతానన్నారు. ఈ మేరకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డిని దీక్షకు అనుమతి కోరినట్లు చెప్పారు.